IT Sector Layoffs: ఐటీ రంగంలో భారీ లేఆఫ్లకు AI కారణమా? తాజా నివేదిక ఏం చెబుతోంది
Research Report on Artificial Intelligence: ప్రస్తుతం, AI కారణంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు పోవడం లేదని, AI తో మరింత క్రమబద్ధమైన, సమర్థవంతమైన పని ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయని ఓ నివేదికలో వెల్లడైంది.

Research Report on Artificial Intelligence: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా విస్తరిస్తున్న క్రమంలో దీనివల్ల భారీ స్థాయిలో ఉద్యోగాలు పోతున్నాయని, ముఖ్యంగా ఐటీ రంగంలో ఆందోళన నెలకొంది. ఇటీవల జరిగిన లేఆఫ్స్ కూడా చాలాసార్లు ఏఐతో లింక్ చేయడం చూశాం. అయితే, Indian Council for Research on International Economic Relations (ICRIER) ఓపెన్ ఏఐ సహకారంతో రూపొందించిన ఇటీవలి రీసెర్చ్ నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయా?
‘AI and Jobs: This Time is No Different’ శీర్షికతో రూపొందించిన ఈ స్టడీ ప్రకారం, ప్రస్తుతం ఐటీ రంగంలోని ఉద్యోగాలు నేరుగా ఏఐ కారణంగా పోవడం లేదు. ఏఐ రాకతో పనిచేసే విధానాలు మరింత వ్యవస్థీకృతంగా, సమర్థవంతంగా మారాయని, ఉత్పాదకత పెరిగిందని.. పని ప్రక్రియల్లో మార్పులు వచ్చాయని నివేదిక చెబుతోంది. కానీ, ఇది విస్తృత స్థాయిలో ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేయడం లేదు. ఈ సర్వేను నవంబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య దేశంలోని 10 నగరాల్లోని 650 ఐటీ సంస్థలపై నిర్వహించారు. ఇందులో రిక్రూట్మెంట్ ట్రెండ్స్, వ్యాపార డిమాండ్, ఉత్పాదకత, స్కిల్ సెట్లను విశ్లేషించారు.
ఏఐ (AI) అవుట్పుట్ను సులభతరం చేస్తుందని, నైపుణ్యం కలిగిన నిపుణుల వినియోగాన్ని పెంచుతుందని, ప్రస్తుతానికి ఉద్యోగాలను తొలగించడం లేదని నివేదికలో వెల్లడైంది. ఎంట్రీ-లెవల్ నియామకాల్లో కొంత తగ్గుదల ఉన్న మాట వాస్తవమేనని కంపెనీలు అంగీకరించాయి. కానీ మిడ్, సీనియర్ లెవల్ హోదాల్లో నియామకాలు గతంలో లాగే కొనసాగుతున్నాయి. ఐటీ రంగంలోని ట్రెండ్స్ చాలా వరకు కోవిడ్ కంటే ముందు పరిస్థితులకు అనుగుణంగానే ఉన్నాయని, ఏఐ వాటిలో అసాధారణ మార్పులు తీసుకురాలేదని నివేదిక స్పష్టం చేసింది.
పరిశోధనలో ఏమి తేలింది?
ఏ పాత్రల్లోనైతే ఎక్కువ ఆటోమేషన్ సాధ్యమవుతుందో, ఆ ఉద్యోగాలు ఎక్కువ రిస్క్లో ఉన్నాయని కూడా ఈ స్టడీ చెబుతోంది. దీనికి భిన్నంగా సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా ఇంజనీర్లు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ల వంటి పోస్టులకు డిమాండ్ పెరిగింది. మొత్తం మీద ప్రస్తుతానికి ఏఐ ఉద్యోగాలను తొలగించడం కంటే నైపుణ్యం ఆధారిత మార్పులను తీసుకువస్తోందని, దీనివల్ల ఉద్యోగులు కొత్త టెక్నాలజీకి అనుగుణంగా తమను తాము అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక సూచిస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) లేదా కృత్రిమ మేధస్సు అంటే మానవుల లాగే యంత్రాలు లేదా కంప్యూటర్ ప్రోగ్రామ్లు ఆలోచించడం, నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోవడాన్ని తెలియజేసే ఒక మోడ్రన్ టెక్నాలజీ. సాధారణంగా కంప్యూటర్లు మనం ఇచ్చిన ఆదేశాలను మాత్రమే పాటిస్తాయి. కానీ AI ఉన్న కంప్యూటర్లు తనంతట తానుగా డేటాను విశ్లేషించి సమస్యలను పరిష్కరించగలవు.
ఏఐ ఎలా పనిచేస్తుంది?
ఏఐ కేవలం ఒకే రకమైన ప్రోగ్రామ్ కాదు, ఇది అనేక విభాగాల కలయిక. ఇందులో ముఖ్యంగా మూడు అంశాలు ఉంటాయి.
లెర్నింగ్: భారీ సమాచారాన్ని (Data) సేకరించి, అందులోని నియమాలను అర్థం చేసుకోవడం.
రీజనింగ్: సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి ఒక నిర్దిష్ట ఫలితాన్ని లేదా నిర్ణయాన్ని తీసుకోవడం.
సెల్ఫ్-కరెక్షన్ : తన తప్పుల నుండి తాను నేర్చుకుంటూ, టైం ప్రకారం తన పనితీరును మెరుగుపరుచుకోవడం చేస్తూ అత్యుత్తమ ఫలితాలు అందిస్తుంది.
























