Telugu Language: నాగబు తొలి తెలుగు పదం కాదా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
మొదటి తెలుగు పదంపై ఎందుకీ కన్ఫ్యూజన్. ఇన్నాళ్ల పరిశోధనల్లో ఏం తేలింది. ఇప్పటికి ఏ పదాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. పరిశోధకులు ఏం చెబుతున్నారు.
దేశ భాషలందు తెలుగు లెస్స అని మన చక్రవర్తులు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని విదేశీయులు గౌరవించిన భాష తెలుగు. తెలుగు భాషలోని తియ్యదనమ కమ్మదనం మరే భాషకు లేవంటే అతిశయోక్తి కాదు. ప్రతి భాషకూ తనదైన ప్రత్యేకత, మాధుర్యం ఉంటాయి. ప్రపంచంలోని చాలా భాషలతో పోలిస్తే.. తెలుగుకు కొన్ని అదనపు ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే ఇన్ని శతాబ్దాలుగా ఘన కీర్తిని అందుకుంటోంది మన తెలుగు భాష
అప్పటి నుంచే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్
క్రీ.శ.1400-1500 మధ్య నికోలో డి కాంటీ అనే యాత్రికుడు ప్రపంచ యాత్రలు చేస్తూ.. భారత్ వచ్చాడు. ఈ క్రమంలో తెలుగు ప్రాంతానికి చెందిన వారిని కలిశాడు. తెలుగు భాష ఉచ్ఛరణ తీరును గమనించి అచ్చుతో అంతమయ్యే ప్రత్యేక లక్షణం ఉన్నట్లు గుర్తించాడు. అంతకుముందు ఒక ఇటాలియన్ భాషలోనే ఇలాంటి సంప్రదాయం ఉన్నట్లు భావించాడు. ఇక్కడి భాషలోనూ ఇదే విధానం ఉండటంతో తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా పేర్కొన్నాడు. నాటి నుంచి మన అమ్మ భాష ఆ గుర్తింపుతో వర్థిల్లుతోంది.
దేశంలో నాలుగో అతిపెద్ద భాషగా తెలుగు వర్థిల్లుతోంది. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాషగా తెలుగుకు గుర్తింపు ఉంది. తెలుగు భాషను మాట్లాడే వారు మన దేశంలో 8 కోట్ల మంది ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికార భాషగా తెలుగు వర్థిల్లుతోంది. దేశంలోని పలు ప్రాంతాల్లోనూ తెలుగు మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
నాగబు మొదటి పదం
ఇంతటి తియ్యదనం, కమ్మదనం ఉన్న తెలుగు భాషకు అంతే స్థాయి ప్రాచీనత కూడా ఉంది. ఇన్ని వందల, వేల సంవత్సరాల ప్రయాణంలో మన భాషలో తొలి పదం ఏమయ్యుంటుందని చాలా మంది చరిత్రకారులు పరిశోధనలు చేశారు. ప్రత్యేకించి వేటూరి ప్రభాకరశాస్త్రి వంటి చరిత్రకారులు, భాషా ప్రేమికులు సాగించిన పరిశోధనలతో తెలుగు వైభవం ప్రజర్విల్లింది. వేటూరి ప్రభాకర శాస్త్రి పరిశోధనల్లో తొలి తెలుగు పదంగా 'నాగబు' అనే పదాన్ని గుర్తించారు. అమరావతి స్తూప శిథిలాలలోని రాతి పలక మీద ఈ పదాన్ని ప్రభాకరశాస్త్రి కనిపెట్టారు. పగిలిన ఆ రాతి పలక మీద ఉన్నది నాగబు అన్న ఒకే ఒక మాట. ‘నాగబు’ అన్న పదంపై 1928లో ‘భారతి’ మాస పత్రికలో ఒక వ్యాసాన్ని ప్రచురించారు. నాగబు అనేది ఒకే పదమని, తెలుగు ప్రత్యయాంతమైన తత్సమ పదమని చెప్పారు.
ఎన్నో శాసనాలను పరిశోధించి వాటిని భారత పురాతత్వ సంస్థ శాసన విభాగ సంచిక ‘ఎపిగ్రాఫియా ఇండికా’ (EpigraphiaIndic)లో ప్రచురించారు. దీనిలో ‘నాగ’ ఒక పదమనీ, ‘బు’ మరో పదమనీ అన్నారు. ఇంతకీ ఆ పదం నాగము, లేదా నాగు అనే పామును సూచించే పదంగా భావిస్తారు.
అయితే తొలి తెలుగు పదం మీద కొన్ని భిన్నమైన వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. అమరావతిలో దొరికిన శాసనాలలో చాలాచోట్ల 'నాగబుధనికా' 'నాగబుద్ధి' లాంటి పేర్లు కనిపిస్తాయని, 'నాగబు' అనే మాట తో దొరికినది ఒక రాతి ముక్క అని, అది 'నాగబుధనో' లేదా ' నాగబుద్ధి' లాంటి మాట కల శాసన శిల పగిలిపోగా 'నాగబు' అన్న భాగం మాత్రమే ఉన్న ముక్క మనకు లభించి ఉండవచ్చని ఈమని శివనాగిరెడ్డి లాంటి చరిత్రకారుల అభిప్రాయం.
నాగబుపై భిన్న వాదనలు
'అంధిర లోకము'.. తెలుగులో శాసనబద్ధమైన తొలి పదమని కొందరి వాదన. ఇందుకు ఆధారమైన క్రీ.పూ.3000-2500 ఏళ్లనాటి శాసనాన్ని.. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని కన్నమడకలలో కనుగొన్నారు. ఈ శాసనంలో "అంధిరలోకము'' అనే పదం ఉంది. ప్రస్తుతం మనం 'ఆంధ్ర లోకము'గా పలుకుతున్న పదాన్నే పూర్వం ఇలా అనేవారని గుర్తించిన పరిశోధకులు దీనిని ప్రపంచంలోనే శాసనపూర్వకమైన తొలి తెలుగు పదంగా గుర్తించారు. ఇలా తొలి తెలుగు పదంమీద భిన్నమైన వాదనలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటివరకూ చాలా మంది పరిశోధకులు మాత్రం నాగబు పదాన్నే తొలి తెలుగు పదంగా పరగిణిస్తుండటంతో అదే తొలి తెలుగు పదంగా చలామణీలో ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets