Crime News: దైవదర్శనానికి వెళ్లిన యువతిపై సామూహిక అత్యాచారం, పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు
దైవదర్శనానికి వెళ్లిన యువతిపై ఎనిమిది మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల నుంచి ఫిర్యాదు రావడంతో పోలీసుల కేసు నమోదు చేసుకుని ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నాగర్ కర్నూలు: దైవ దర్శనానికి వెళ్లిన యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. బంధువుపై దాడి చేసి అతడ్ని తాళ్లతో కట్టి పడేసి, యువతిపై ఎనిమిది మంది యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారని సమాచారం. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి తన బంధువుతో కలిసి ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయంలో మొక్కులు తీర్చుకోవడానికి శనివారం సాయంత్రం వచ్చింది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రాత్రి ఆలయం ప్రాంగణంలోనే నిద్ర చేయాలనుకున్నారు. ఈ క్రమంలో యువతి కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీపంలోని గుట్ట ప్రాంతంలోకి వెళ్ళింది. ఆమె వెంట బంధువు కూడా వెళ్లారు.
అక్కడే ఉన్న 8 మంది యువకులు యువతి వెంట వచ్చిన బంధువుపై దాడి చేశారు. అనంతరం అతడి కాళ్లు, చేతులు కట్టేశారు. అనంతరం యువతిని గుట్ట ప్రాంతంలో నిర్మానుష్య చోటుకు తీసుకువెళ్లి యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఉరుకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. నిందితులను ఊర్కొండ పేటకు చెందిన 8 మందిగా గుర్తించారు. యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మరో ఇద్దరి జాడ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

