Reliance Capital: హిందూజా గ్రూప్ చేతికి రిలయన్స్ క్యాపిటల్ - ఎన్సీఎల్టీ నుంచి ఆమోదం
రిలయన్స్ క్యాపిటల్ దివాలా పరిష్కారం కేసులో, ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ప్రతిపాదించిన రూ.9,650 కోట్ల విలువైన రిజల్యూషన్ ప్లాన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదించింది.

Hinduja Group Will Be The New Owner Of Reliance Capital: ముకేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్కు కొత్త యజమాని పేరు ఖరారైంది. హిందూజా గ్రూప్ (Hinduja Group) కంపెనీ అయిన ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (IndusInd International Holdings Limited) ఇప్పుడు కొత్త ఓనర్ అవుతుంది. రిలయన్స్ క్యాపిటల్ దివాలా పరిష్కారం కేసులో, ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ప్రతిపాదించిన రూ. 9,650 కోట్ల విలువైన రిజల్యూషన్ ప్లాన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదించింది.
దివాలా పరిష్కార ప్రక్రియ కింద ఆర్డర్
దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా రిలయన్స్ క్యాపిటల్ను చేజిక్కించుకునేందుకు IIHL (ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్) దాఖలు చేసిన దరఖాస్తును NCLT (National Company Law Tribunal) ముంబై బెంచ్ ఆమోదించింది. 2023 జూన్లో, రెండో రౌండ్ బిడ్డింగ్ సందర్భంగా ఈ ప్రణాళికను IIHL సమర్పించింది.
NCLT ఆమోదంతో, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యకు పరిష్కారం దొరికింది. ఎట్టకేలకు, అనిల్ అంబానీ (Anil Ambani) ప్రమోటెడ్ కంపెనీని కొనుగోలు చేసేందుకు హిందూజా గ్రూప్నకు అనుమతి లభించింది. గత ఏడాది జూన్లో, రూ. 9661 కోట్ల అడ్వాన్స్ క్యాష్ బిడ్ రౌండ్లో, మానిటరింగ్ కమిటీ ద్వారా IIHL ఎంపిక జరిగింది. రిలయన్స్ క్యాపిటల్ అదనపు నగదు నిల్వ రూ. 500 కోట్లు కూడా రుణదాతలకు చేరనుంది.
పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు
జస్టిస్ వీరేంద్ర సింగ్ బిష్త్ & టెక్నికల్ సభ్యుడు ప్రభాత్ కుమార్తో కూడిన NCLT ముంబై బెంచ్, IIHL రిజల్యూషన్ ప్లాన్ మౌఖికంగా ఆమోదించింది. ఈ రోజు (మంగళవారం) సాయంత్రం పూర్తి స్థాయి ఆర్డర్ కాపీ వెలువడుతుంది. టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, హిందూజా గ్రూప్ బిడ్ల మధ్య వివాదం సుప్రీంకోర్టులో కొనసాగుతోంది కాబట్టి, ఈ ప్రణాళికను పర్యవేక్షించడానికి ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తారు.
అసలు విషయం ఇది
పరిపాలన సంబంధిత సమస్యలు & రుణ ఎగవేతల కారణంగా, అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్లోని రిలయన్స్ క్యాపిటల్ (Reliance Capital) డైరెక్టర్ల బోర్డును 2021 నవంబర్లో, రిజర్వ్ బ్యాంక్ (RBI) రద్దు చేసింది. ఆ తర్వాత, వై నాగేశ్వరరావును అడ్మినిస్ట్రేటర్గా సెంట్రల్ బ్యాంక్ నియమించింది. ఈ కంపెనీని స్వాధీనం చేసుకోవడానికి 2022 ఫిబ్రవరిలో బిడ్లను ఆహ్వానించారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత, ఇప్పుడు, ఇది ఓ కొలిక్కి వచ్చింది.
రిలయన్స్ క్యాపిటల్కు రూ. 40,000 కోట్లకు పైగా అప్పు ఉంది. మొదట, కేవలం నలుగురు కంపెనీలే దరఖాస్తు చేశాయి, వాటితోనే బిడ్ నిర్వహించారు. అయితే, తక్కువ బిడ్ల కారణంగా రుణదాతల కమిటీ మొత్తం ఆ నాలుగు ప్లాన్లను తిరస్కరించింది. ఆ తర్వాత ఒక ఛాలెంజ్ మెకానిజాన్ని ప్రారంభించారు. దీనిలో IIHL, టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ పాల్గొన్నాయి.
మరో ఆసక్తికర కథనం: మార్చిలో బ్యాంక్లు 14 రోజులు పని చేయవు, హాలిడేస్ లిస్ట్ ముందే చూసుకోండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

