YS Jagan: రేపు మా ప్రభుత్వంలో ప్రతిచర్యలు కొనసాగితే చంద్రబాబు మీ పరిస్థితి ఏంటి ? జగన్ సూటిప్రశ్న
Gudivada in Krishna district | కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ నాయకులు, జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఇది సరికాదని హెచ్చరించారు.

Violence and political hooliganism unfolded in Gudivada in Krishna district | గుడివాడ: కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడిని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. మహిళల మీద మీదాడి, మీ శాడిజంకు పరాకాష్ట చంద్రబాబు అంటూ మండిపడ్డారు. వైసీపీ నాయకుల మీద వరుసగా దాడులు చేయించడమే కాదు, చివరకు బీసీ మహిళా నాయకుల మీద నిస్సిగ్గుగా దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థానంలో మీరు ఉన్నారని, అధికారం ఉందని, పోలీసులు ఎలా చెప్తే అలా వింటున్నా అని, మీ పచ్చసైకోలతో మీరు దాడులు చేయించడం ఏమంత గొప్పపనా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
‘ఏం నేరం చేశారని గుడివాడలో మీవాళ్లను పంపి ఒక బీసీ అయిన స్థానిక జడ్పీ సభ్యురాలు, కృష్ణాజిల్లా ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడులు చేయించారు. పోలీసుల సమక్షంలోనే దుర్భాషలు ఆడుతూ వారిపై దాడి చేయించారు. దీన్ని పరిపాలన అనరు శాడిజం, పైశాచికత్వం అంటారు చంద్రబాబు. ఒక రాజకీయపార్టీగా మేం కార్యక్రమాలు చేసుకోకూడదా? ఆ కార్యక్రమాలకు మా నాయకులు, మా మహిళా నాయకులు హాజరు కావడం ఏమైనా తప్పా? మా వాళ్లని ఎందుకు హౌస్ అరెస్టు చేస్తున్నారు. కార్యక్రమానికి వెళ్తున్న వారిపై దాడులు ఎందుకు చేస్తున్నారు. మహిళ అనికూడ చూడకుండా, దుర్భాషలు ఆడుతూ, సిగ్గు లేకుండా ఆమెపై దాడి చేశారు. ఆమె వాహనం సైతం ధ్వంసం చేశారు.

పెద్దారెడ్డిని ఇంటికి పోనివ్వరు..
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో ఇలాగే జరుగుతోంది. హైకోర్టు ఆదేశాలున్నా పెద్దారెడ్డి తన ఇంటికి, తన నియోజకవర్గానికి మీరు వెళ్లనీయడంలేదు. పైగా పోలీసులు సినిమా స్టైల్లో తుపాకులు చూపించి ఆయన్ని బయటకు తీసుకెళ్లారు. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై నెల్లూరులో ఒక పథకం ప్రకారం పోలీసుల సమక్షంలోనే మీ పచ్చసైకోలతోనే దాడులు చేయించారు. పైగా దాడికి గురైన బాధితుడు ప్రసన్నకుమార్ రెడ్డి మీదే ఎదురుకేసుపెట్టారు. దాడిచేయించిన, ఇల్లు ధ్వంసం చేసిన ఎమ్మెల్యే వారి మనుషులమీద ఏ చర్యలు, అరెస్టులు లేవు. ఇది శాడిజం కాదా? పైశాచికత్వం కాదా? ఇలా చేయడం మీకు గొప్పగా కనిపిస్తోందా?
చంద్రబాబు రాజకీయ కక్షలతో ఏపీలో ఒక దుష్ట సంప్రదాయాన్ని తెచ్చి, దాన్ని కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో పాటు వైసీపీ నేతలైన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, వల్లభనేని వంశీ, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, పోసాని కృష్ణమురళి సహా ఎంతోమందిపై తప్పుడు కేసులు పెట్టారు. వీళ్లేకాకుండా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సహా ఎంతోమంది అమాయకులపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు.
వైసీపీ నేతలు, కార్యకర్తలపై దొంగ కేసులు
వైయస్సార్సీపీకి చెందిన గ్రామ, మండలస్థాయి నాయకులపైన, సోషల్మీడియా యాక్టివిస్టులపైన తప్పుడు కేసులు పెట్టి వారిని హింసించారు. నేటికి వారిని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇదే సంప్రదాయం రేపు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రతిచర్యలు చేపడితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి చంద్రబాబు? ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టాన్ని పూర్తిగా గాలికి వదిలేసి, మీ ఇష్టానుసారం ప్రవర్తిస్తే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రోజులు మారితే ఇప్పుడు మీరు చేస్తున్న దుర్మార్గాలకు, దారుణాలకు మీరు బాధ్యతవహించాల్సి ఉంటుందని ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాం. ఇకనైనా ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంమీద దృష్టిపెట్టాలి. లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారు చంద్రబాబు’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.






















