TTD News: తిరుమలలో దళారుల ఏరివేతకు చర్యలు తీసుకోండి - టీటీడీ ఈవో ఆదేశాలు
Tirupati News: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జే శ్యామల రావు టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ, జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దళారులను ఉపేక్షించవద్దని ఆదేశించారు.

Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో జె.శ్యామలరావు జిల్లా ఎస్పీని కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో బుధవారం (జూలై 3) ఉదయం జిల్లా పోలీస్, టీటీడీ నిఘా, భద్రత విభాగం అధికారులతో ఈవో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆర్జితసేవ టికెట్లకు సంబంధించి భక్తులను మోసగిస్తున్న అనేకమంది దళారులను ఉపేక్షించరాదన్నారు. వారిపై వెంట వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సీవీఎస్ఓ వివరించిన ఆవశ్యకత మేరకు తిరుమలలో ఐటీ అనుబంధంగా ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు సైబర్ క్రైమ్ టీం ఏర్పాటు పరిశీలించవలసిందిగా సంబంధిత అధికారులకు ఈవో సూచించారు.
అంతకుముందు పోలీస్ విభాగం వారు తిరుమలలో దర్శన దళారులకు సంబంధించి, ఆన్లైన్ ద్వారా, డిప్ సిస్టం ద్వారా, రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులు, దొంగతనం కేసులు, మధ్యపానం, నకిలీ వెబ్ సైట్లు, తదితర అంశాలకు సంబంధించిన కేసులు ఏఏ దశల్లో ఉన్నాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ మరో వారంలోపు ఈ కేసుల్లో ఉన్న దళారులకు చట్టపరంగా తగు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులను కోరారు. అంతేకాకుండా ఇటువంటి కేసుల సత్వర పరిష్కారం కోసం టీటీడీ విజిలెన్స్, పోలీస్ విభాగాలు తరచూ సమావేశం కావాలని అన్నారు.
ఈ సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీ అండ్ ఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్, తిరుమల అదనపు ఎస్పీ విమల కుమారి, డీఎస్పీ శ్రీనివాస ఆచారి, టీటీడీ విజివో (విజిలెన్స్) గిరిధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Before You Go
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
ట్రెండింగ్ వార్తలు





















