Tirumala: తిరుమల కొండపై వివాదం- సిబ్బందిపై యాత్రికుల దాడి -ఇద్దరు భక్తులపై కేసులు
తిరుమలలో టిటిడి అధికారుల తీరు వివాదాలకు కారణమవుతోంది. పైస్థాయి సిబ్బంది ఒకలా కింది స్థాయి సిబ్బంది తీరు మరోలా ఉంటుంది. ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
ఏడుకొండల్లో కొలువై ఉన్న వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి దేశ విదేశాల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దర్శనం కోసం భక్తులు పరితప్పించి పోతుంటారు. స్వామి దర్శనం జరిగితే చాలు సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్టు, దాతల దర్శనం, ఆర్జిత సేవలు వంటి రూపాల ద్వారా భక్తులు స్వామి వారి దర్శనం కల్పిస్తుంది టిటిడి. తిరుమల పుణ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులకు ఎటువంటి అసౌఖర్యం కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత టిటిడి అధికారులపై ఉంది.
కోవిడ్ ముందు వరకూ కొనసాగిన దర్శన విధి విధానాలు కోవిడ్ తరువాత మారిపోయాయి. పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తూ వచ్చింది టిటిడి.. అయితే కోవిడ్ పూర్తి స్ధాయిలో తగ్గుముఖం పట్టడంతో భక్తుల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం దాదాపు అరవై వేల నుంచి డెభై వేల వరకూ భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు.
కోవిడ్ సమయంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తూ ఉండడంతో భక్తులు బస చేసేందుకు ఏర్పాటు చేసిన అతిథి గృహాలు, వసతి గృహాలను మరమ్మత్తులు ప్రారంభించింది టిటిడి. తిరుమలలో భక్తుల కోసం దాదాపు ఏడు వేల ఐదు వందలకుపైగా వసతి గదులు ఉన్నాయి. వీటిలో చాలా వరకూ మరమ్మత్తులు చేయాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం భక్తుల రద్దీ బాగా పెరగడంతో తిరుమలలో వసతి గదుల కొరత అధికమైంది. భక్తులు వసతి గదులు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులు రోడ్లపైనే కునుకు తీస్తున్నారు.
కలియుగ వైకుంఠ నాధుడు దర్శనార్ధం విచ్చేసిన భక్తులకు వారి వారి స్ధోమతకు తగ్గట్టుగా గదులు కేటాయిస్తుంది టిటిడి. సామాన్య భక్తులకు సిఆర్ఓ, టిబి కౌంటర్లల్లో కేటాయిస్తే, విఐపి, వివిఐపిలకు పద్మావతి విచారణ కార్యాలయంలో గదులు కేటాయిస్తారు. విఐపి, వివిఐపి తాకిడి అధికంగా ఉండే పద్మావతి విచారణ కార్యాలయంలో ప్రోటోకాల్ పరిధిలో వ్యక్తులకు తగిన గదులను ముందుగానే కేటాయించి ఉంచుతారు. తరువాత సిఫార్సు లేఖలపై వచ్చిన భక్తులకు విఐపి కాటేజీల కేటాయిస్తారు.
అతిధి గృహాలు, వసతి గృహాలు మరమ్మత్తులు కొనసాగడంతో భక్తులకు కావాల్సిన కాటేజీల కేటాయించలేక పోతున్నారు అధికారులు. దీంతో గదుల కోసం గంటల తరబడి భక్తులు నిరీక్షించాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది. వచ్చిన భక్తులపై కార్యాలయాల్లో ఉన్న అధికారులు ఒకలా వ్యవహరిస్తే.. కింది స్ధాయి సిబ్బంది మరోలా వ్యవహరిస్తున్నారు. కార్యాలయంలో నెలకొన్న పరిస్థితిని సున్నితంగా చెప్పాల్సింది పోయి వారితో దుసురుగా మాట్లాడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజాగా పద్మావతి విచారణ కార్యాలయంలో అతిథి గృహం కేటాయింపు కోసం సిఫార్సు లేఖతో వచ్చిన అనంతపురానికి చేందిన భక్తులు వచ్చారు. తమ కుటుంబానికి వసతి గది కేటాయించాలని భక్తులు కోరగా అందుకు గదులు ఖాళీ లేవని కొంత సమయం వేచి ఉండాలని అధికారులు సమాధానమిచ్చారు. కాసేపు ఆగి మరోసారి గది కోసం కార్యాలయం లోనికి ప్రచేశించారు. మళ్లీ అదే సమాధానం వచ్చింది. మరి కాసేపు వేచి ఉండి ఆఫీస్లోకి వెళ్తుండగా గొడవ ప్రారంభమైంది.
కార్యాలయంలోకి వెళ్తున్న భక్తులను సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో భక్తులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన సిబ్బంది తలుపులు వేసేశారు. ఈక్రమంలో భక్తుడు శివారెడ్డి చేతి వేళ్లు తలుపు మధ్యలో ఉండి నలిగి పోయాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆగ్రహించి కుటుంబ సభ్యులు సిబ్బందిపై దాడి చేశారు.
ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు ఇరువురిని సముదాయించారు. తర్వాత టిటిడి సిబ్బంది ఫిర్యాదు మేరకు తిరుమల టూటౌన్ పోలీసులు సునీల్ రెడ్డి, శ్యామ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదుపై భక్తులు మండిపడుతున్నారు. కార్యాలయాల్లో అధికారులు, క్రింది స్ధాయి సిబ్బంది తీరు మార్చుకోవాలని భక్తులు సూచిస్తున్నారు. దర్శనం కోసం వచ్చిన భక్తులపై అధికారులు కోపగించుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు..
మరోవైపు కొందరు దళారులు సర్వదర్శన టోకేన్లను ప్రక్కదారి పట్టిస్తున్నారు.. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, గోవింద రాజసత్రం, శ్రీనివాసాల్లో సామాన్య భక్తుల కోసం కేటాయిస్తున్న టోకెన్లను కొందరు దళారులు కౌంటర్ సిబ్బందితో కుమ్మక్కై విక్రయిస్తున్నారు. భక్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టిటిడి విజిలెన్స్ అధికారులు ఇద్దరు కౌంటర్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.. దళారుల కోసం గాలిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets