Amaravati Bill Rajya Sabha: అమరావతికి రాజ్యసభ జై - బీఆర్ఎస్సూ సపోర్టు - తర్వాత ప్రక్రియ ఇదే!
Rajya Sabha : పీ ఏకైక రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. వైసీపీ మినహా అందరూ సర్థించారు. ఈ జాబితాలో బీఆర్ఎస్ కూడా ఉంది.

Rajya Sabha unanimously approves AP Capital Bill: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన (సవరణ) బిల్లు-2026కు రాజ్యసభలో ఘనమైన ఆమోదం లభించింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై గురువారం ఎగువసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. లోక్సభ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించగా, నేడు రాజ్యసభ కూడా పచ్చజెండా ఊపడంతో అమరావతికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించే దిశగా మరో కీలక అడుగు పడింది. పదకొండు రాజకీయ పార్టీలకు చెందిన 17 మంది ఎంపీలు ఈ చర్చలో పాల్గొని ఏపీ రాజధానిగా అమరావతికి తమ మద్దతు ప్రకటించారు.
వైసీపీ విముఖత
ఈ చర్చలో అనూహ్య రీతిలో ప్రాంతీయ, జాతీయ పార్టీలన్నీ ఏకగ్రీవంగా అమరావతికి మద్దతు పలికాయి. కాంగ్రెస్, బీజేపీ, టీడీపి, జనసేన వంటి పార్టీలతో పాటు తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి కూడా ఈ బిల్లును సమర్థించింది. గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న అనిశ్చితికి ఈ బిల్లు ముగింపు పలుకుతుందని ఎంపీలు పేర్కొన్నారు. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రస్తావిస్తూ, రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చే పరిహారంపై స్పష్టత లేదని ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది.
గళమెత్తిన ఎంపీలు
చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి, ఏపీ రాజధాని విషయంపై ఇంతకాలం ఆలస్యం జరగడం పార్లమెంటు వైఫల్యమని, ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకున్నందుకు సంతోషమని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ప్రసంగిస్తూ, ఇది కేవలం పరిపాలనాపరమైన నిర్ణయం కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అని ఉద్వేగభరితంగా చెప్పారు. 2014 విభజన గాయాలను ఈ చట్టం మాన్పుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీలు తమ ప్రసంగాల్లో అమరావతిని బెంగళూరు, హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరారు.
మద్దతు తెలిపిన బిఆర్ఎస్
తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు భంగం కలగకుండా, పొరుగు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం తమకు ఇష్టమని బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. ఏపీకి ఒక శాశ్వత రాజధాని ఉండటం వల్ల తెలుగు రాష్ట్రాల మధ్య మరింత సహకారం పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ప్రధాన పార్టీలు అమరావతికే ఓటు వేయడంతో సభలో ఒక అరుదైన ఏకాభిప్రాయం కనిపించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ చర్చకు సమాధానం ఇస్తూ, ఏపీ ప్రజల ఆకాంక్షలకు గౌరవం ఇస్తూనే ఈ చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. కేవలం వాయిస్ ఓట్ ద్వారా బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు చైర్మన్ ప్రకటించడంతో ఏపీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తదుపరి ప్రక్రియ ఏమిటి?
పార్లమెంటులోని ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించినందున ఇది తదుపరి దశలో రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్తుంది. రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే ఇది చట్టంగా మారుతుంది. తదనంతరం కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దీనివల్ల ఏపీ రాజధానిగా అమరావతికి రాజ్యాంగబద్ధమైన హోదా లభిస్తుంది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ చట్టాన్ని మార్చడం దాదాపు అసాధ్యమవుతుంది.























