![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Andhra Pradesh Assembly Elections 2024: గోదావరి జిల్లాల్లో వైసీపీకి కొత్త తలనొప్పి- అలా చేయడం మా వల్ల కాదంటున్న నేతలు
ఎమ్మెల్యేల్లో కొందరిని పార్లమెంటుకు పంపించేందుకు వైసీపీ అధిష్ఠానం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే వారి నుంచి మాత్రం ఎటువంటి అంగీకారం కనిపించడం లేదని తెలుస్తోంది.
![Andhra Pradesh Assembly Elections 2024: గోదావరి జిల్లాల్లో వైసీపీకి కొత్త తలనొప్పి- అలా చేయడం మా వల్ల కాదంటున్న నేతలు YSR Congress party leadership is trying to send some MLA to Parliament constituency Andhra Pradesh Assembly Elections 2024: గోదావరి జిల్లాల్లో వైసీపీకి కొత్త తలనొప్పి- అలా చేయడం మా వల్ల కాదంటున్న నేతలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/25/186c813665a37f6b119e27be82fd9ea51703467584605215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
YSRCP News: అధికార పార్టీలో కొందరు ఎమ్మెల్యేలను స్థాన చలనం తప్పదని ఇప్పటికే సంకేతాలు జారీ చేసిన వైసీపీ అధిష్ఠాం వారిలో కొందరిని పార్లమెంటుకు పంపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.. అయితే వారి నుంచి మాత్రం ఎటువంటి అంగీకారం కనిపించడం లేదని తెలుస్తోంది. ఫలానా స్థానం నుంచి మీరు ఎంపీగా పోటీచేయాల్సి ఉంటుంది. అందుకు సిద్ధంగా ఉండండి అంటే బాబోయ్ ఎంపీగా పోటీనా.. మావల్లకాదండీ అంటూ ఏదోలా సైడ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారట పలువురు ఎమ్మెల్యేలు..
పార్లమెంటుకు పోటీకు దొరకని అభ్యర్థులు..
దాదాపు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ఒక పార్లమెంటు స్థానం కాగా ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ చేసేందుకు అభ్యర్ధులు దొరకని పరిస్థితి కనిపిస్తోందట. ఎవ్వరిని వెళ్లమన్నా ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు ఆశావహులు ఎవ్వరిని ఎంపీగా పోటీచేయాలని అధిష్ఠానం సూచించినా మావల్ల కాదులేండి అంటున్నారట.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా మార్గాని భరత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన్ను రాజమండ్రి సిటీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధిగా బరిలో దింపేందుకు ఇప్పటికే నిర్ణయం తీసేసుకుంది పార్టీ. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం పంపించనుందని ప్రచారం సాగుతోంది. అమలాపురం నియోజకవర్గం నుంచి చింతా అనురాధ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆమె కూడా ఎక్కడో ఓ చోట అసెంబ్లీ సిటు ఇవ్వాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మూడు పార్లమెంటు స్థానాలు ఖాళీ అయిన పరిస్థితి ఉంది. ఈ మూడు స్థానాల్లోనూ ఎవ్వరిని బరిలో దింపాలన్న ఆలోచనలో అధినాయకత్వం నిమగ్నమయ్యింది కానీ అభ్యర్థులు దొరకని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోందట..
మూడు చోట్ల ఎమ్మెల్యేలచే పోటీచేయిస్తారా..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు పార్లమెంటు నియోజకవర్గాలుండగా అందులో అమలాపురం ఎస్పీ రిజర్వుడు. ఇక్కడ పోటీ చేయించేందుకు ముందు టీడీపీలో ఎంపీగా పనిచేసిన ప్రస్తుత ఎమ్మెల్సీ డాక్టర్ పండుల రవీంద్రబాబును రంగంలోకి దింపాలనే ఆలోచన చేసింది. అయితే ఆయన కూడా ఎంపీ కంటే కూడా పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అధిష్టానం ముందు ప్రపోజల్ పెట్టారు.దీంతో ఈ స్థానం భర్తీ చేసేందుకు ఏలూరు జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు స్థానం అయిన చింతలపూడి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మట్ల ఎలీజాను బరిలో దింపేందుకు ప్రయత్నించింది. అయితే ఆయన దీనికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతోపాటు తాను చింతలపూడి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తానని, తప్పక గెలిచి తీరుతానని ముఖ్యమంత్రి జగన్ ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. రాజమండ్రి స్థానం నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ లేదా షర్మిలా రెడ్డిని రంగంలోకి దించాలని ప్రయత్నిస్తుందట. కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి మాజీ మంత్రి, కాకినాడ రూరల్ శాసన సభ్యుడు కురసాల కన్నబాబును పోటీలో దించాలని ఆలోచనలో జగన్ ఉన్నారని చర్చ జరుగుతోంది.
ఆర్థిక భారం తట్టుకోలేకనేనా..
పార్లమెంటు సభ్యునిగా పోటీ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని అభ్యర్ధులు వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీచేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆర్దీకంగా తోడ్పాటు నందివ్వడం అనేది సంప్రదాయంగా వస్తూ ఉంది. ఎంపీ అభ్యర్ధి ఆవిధంగా సర్దుబాటు చేయకపోతే ఎమ్మెల్యే అభ్యర్థులు క్రాస్ ఓటింగ్కు ప్రోత్ససహిస్తారని, ఎంపీకి మీరు ఓటు ఎలా వేసుకున్నా అసెంబ్లీ స్థానానికి మాత్రం తనకే వేయాలని సూచించే అవకాశం లేకపోలేదు. దీంతో ఓటమి తప్పదని భయపడుతున్నారట. అంతే కాకుండా ఎంపీగా గెలిచినా స్థానికంగా అనుకున్నంత పట్టు లభించచదన్న వాదన ముందు నుంచి కనిపిస్తోంది. ఇవన్నీ బేరీజు వేసుకునే పార్లమెంటుకు పోటీ అంటే ముందుకు వెళ్లడం లేదన్నది అభ్యర్థుల్లో కనిపిస్తోందని పలువురు చెప్పుకుంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)