Purandheshwari: ఏపీలో పొత్తులు, సీఎం అభ్యర్థిపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు, పోలవరం పైన కూడా
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం నిధుల దారి మళ్లింపుపై సర్పంచ్ లు పార్టీలకతీతంగా తమ మద్దతు కోరారని పురంధేశ్వరి అన్నారు.

పోలవరం ప్రాజెక్టు లెక్కలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వివరణ కోరిందని ఆ విషయంలో తాము త్వరలో కేంద్ర జలశక్తి మంత్రిని కలవనున్నట్లుగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయలేదని పురంధేశ్వరి స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవుతున్న ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తోందని అన్నారు. ఏపీలో ప్రజలకు మేలు చేయలేని స్థితిలో జగన్ ఉన్నారని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. పోలవరం పునరావాస ప్యాకేజీ విషయంలో ఏపీ ప్రభుత్వం సరైన గణాంకాలు కేంద్రానికి ఇవ్వటం లేదన్నారు. రాజమండ్రిలో బుధవారం (జూలై 26) ఆమె మీడియాతో మాట్లాడారు.
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం నిధుల దారి మళ్లింపుపై సర్పంచ్ లు పార్టీలకతీతంగా తమ మద్దతు కోరారని అన్నారు. వారికి బీజేపీ పూర్తి మద్దతుగా నిలుస్తోందని అన్నారు. ఆగస్టు 10న జిల్లాల్లో సర్పంచ్ లకు మద్దతుగా ధర్నాలు జరుగుతాయని అన్నారు. 17న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై భారీ సభ ఉంటుందని స్పష్టం చేశారు.
వీరి హయాంలో మడ అడవులు నరికి వేతతో పాటు, మట్టి మాఫియా, ఇసుక మాఫియా చెలరేగి పోతోందని విమర్శించారు. చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. 10 లక్షలు, 15 లక్షల రూపాయల పనులు చేసే చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకునే సీఎం, రైతులకు నిజంగా ఏం మేలు చేశారని పురంధేశ్వరి ప్రశ్నించారు. పిఠాపురం వంతెనపై శీతకన్ను వేయడంవల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న్నారని చెప్పారు.
పొత్తులపైనా క్లారిటీ
జనసేనతో నిన్న ఎలా పొత్తు ఉందో, నేడు, భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుందని పురంధేశ్వరి అన్నారు. మిగతా పార్టీలు కలుస్తాయా లేదా అనే సంగతి అధిష్ఠానం నిర్ణయం అని అన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని అన్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయం కూడా అధిష్ఠానమే చూసుకుంటుందని అన్నారు.
ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యం అని పురంధేశ్వరి అన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం 22 లక్షల ఇళ్ళు ఇచ్చిందని.. రాజమండ్రికి లక్షా 86 వేల ఇళ్లు కేటాయింపు జరిగితే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఎన్ని ఇళ్లు కంప్లీట్ చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణానికి బాగా ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

