Nellore and Eluru Mayor Elections: ఈ 26న నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు
Mayor Elections in Nellore and Eluru | నెల్లూరు, ఏలూరు నగరపాలక సంస్థల మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Andhra Pradesh News | అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, ఏలూరు నగరపాలక సంస్థల్లో ఖాళీగా ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల భర్తీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26వ తేదీన ఈ కీలక స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా పారదర్శకతను పాటించాలని, సంబంధిత పాలకవర్గ సభ్యులకు, ఎక్స్ అఫీషియో సభ్యులకు ఈ నెల 20వ తేదీలోగా సమాచారం అందజేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి నెల్లూరు, ఏలూరు జిల్లాల కలెక్టర్లకు, ఆయా నగరపాలక సంస్థల కమిషనర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలను పంపింది.
నిర్ణీత షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అనివార్య కారణాల వల్ల లేదా ఏవైనా ఇతర ఇబ్బందుల వల్ల ఆ రోజు సమావేశం నిర్వహించలేని పరిస్థితి తలెత్తితే, మరుసటి రోజు అంటే 27వ తేదీన తప్పనిసరిగా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అమలును సుసాధ్యం చేసేలా, బీసీల జనాభాపై లోతైన అధ్యయనం చేయడానికి ఒక డెడికేటెడ్ కమిషన్ను ప్రభుత్వం నియమించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు నేడు లేదా రేపు వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు ఏకసభ్య కమిషన్ను నియమించే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆమోదముద్ర వేశారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాను ఈ డెడికేటెడ్ కమిషన్గా నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రిజర్వేషన్ల ఖరారుకు అవసరమైన అధ్యయనాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం ఈ కమిషన్కు 30 నుంచి 45 రోజుల గడువును ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బీసీల వెనుకబాటుతనాన్ని ఈ కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఈ అధ్యయనం కోసం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ గ్రామ మరియు స్వర్ణ వార్డు సచివాలయాల సిబ్బంది నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే (యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) డేటాను కమిషన్ ప్రామాణికంగా తీసుకోనుంది. ఈ సర్వే ద్వారా సేకరించిన గణాంకాలను విశ్లేషించి, రిజర్వేషన్ల అమలుపై కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.























