Pawan Kalyan: మన పార్టీపై కుట్రలు, దృష్టి మరల్చేందుకు కొన్ని శక్తుల కుట్రలు: పవన్ కళ్యాణ్ లేఖ
Pawan Kalyan: జనసేన పార్టీపై కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని, మన దృష్టి మరల్చేందుకు పని చేస్తున్నారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

Pawan Kalyan: జనసేన పార్టీపై కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తమ దృష్టి మరల్చేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయన్న సమాచారం ఉందని తెలిపారు. జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అడుగు ఆచితూచి వేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తీవ్ర ఆర్థిక నేరాలు, ఆరోపణలపై మాట్లాడాల్సిన పరిస్థితిలో అప్రమత్తంగా ఉండాలని జనసేన శ్రేణులు ఉద్దేశించి బహిరంగ లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం శ్రమిస్తున్న ఈ తరుణంలో మన పార్టీ దృష్టిని మళ్లించడానికి, మన భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని కుట్రపూరితు శక్తులు నిరంతరం పని చేస్తున్నాయని హెచ్చరించారు. ఈ మేరకు లేఖ విడుదల చేసి జాగ్రత్తలు చెప్పారు.
ప్రియమైన జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులకు... - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/QbaAExy3OW
— JanaSena Party (@JanaSenaParty) April 24, 2023
లేఖలో ఏముందంటే..
'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం మనం శ్రమిస్తున్న తరుణంలో మన దృష్టి మళ్లించడానికి, మన భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని శక్తులు నిరంతరం పని చేస్తున్నాయి. వాటిని అర్థం చేసుకుని పార్టీ నాయకులు, శ్రేణులు ముందుకు వెళ్ళవలసి ఉంది. మనకు సానుకూలంగా ఉన్న రాజకీయ పక్షాలు, నాయకులకు మన పార్టీ పట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బ తీసే కల్పిత సమాచారాన్ని మన శ్రేణులకు చేర్చే కుట్రలకు పాల్పడుతున్నట్లు మన వద్ద విశ్వసనీయ సమాచారం ఉంది. అందువల్ల పార్టీలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. తీవ్రమైన ప్రతి విమర్శలు, తీవ్రమైన ఆర్థిక నేరాల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకువెళ్ళండి. వారి సూచనలు, సలహా మేరకు మీరు మాట్లాడండి.
పార్టీలోని నాయకులు, వీర మహిళలు, జన సైనికులు మాట్లాడే ప్రతి మాట పార్టీపై ప్రభావం చూపుతుంది. కనుక సదా అప్రమత్తంగా ఉండాలి. మాట్లాడే ముందు వాస్తవాలు నిర్ధారించుకోవాలి. స్థాయి, తీవ్రత హద్దులు దాటినట్లు సభ్య సమాజం భావించని విధంగా మన మాటలు ఉండాలి. ఒక వ్యక్తి గురించి మాట్లాడే సమయంలో అకారణంగా వారి కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించవద్దు. ఆధారాలు లేకుండా నేరారోపణలు చేయకండి. అది పార్టీకి, సమాజానికి కూడా హితం కాదు.
నన్ను విమర్శించే వారికి, వ్యక్తిగతంగా దూషించే వారికి బదులు చెప్పే సమయంలో నేను చాలా అప్రమత్తంగా ఉంటానన్న సంగతి మీ అందరికీ తెలిసిందే, ప్రతి అక్షరాన్ని, ప్రతి మాటను బేరీజు వేసుకుంటూ హద్దులు దాటకుండానే కొంత తగ్గి బదులు చెబుతాను. ఎందుకంటే మన నుంచి వచ్చే ప్రతీ మాటకు అంత బలం ఉంటుంది. ఆ బలం అపసవ్యంగా మారకూడదు. నేనంటే ఇష్టంలేని వారికి కూడా శుభ సమయాలలో వారికి మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ప్రకటన చేస్తుంటాను కదా! ఇలా చేయడం అంటే సమాజంలో సమతుల్యత, సృహుద్భావం నెలకొనాలనే.
ముఖ్యంగా ఈ విషయాలను మరిచిపోకండి...!
1. సరైన ధ్రువపత్రాలు లేకుండా ఎవరిపైనా ఆర్థిక నేరారోపణలు చేయకండి.
2. కేవలం మీడియాలో వచ్చిందనో లేదా ఎవరో మాట్లాడారనో నిర్ధారణ కానీ అంశాల గురించి మాట్లాడకండి.
3. పొత్తుల గురించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారం ఆధారంగా మాట్లాడకండి. ఈ విషయంలో మేలు చేసే నిర్ణయం నేనే స్వయంగా తీసుకుంటా.
4. మనతో సయోధ్యగా ఉన్న రాజకీయ పక్షాలలో చిన్న చితక నాయకులు మనపై ఏమైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలు ఆ నాయకుని వ్యక్తిగతమైన విమర్శలుగా భావించండి. వాటిని ఆయా పార్టీలకు ఆపాదించవద్దు. మీ శ్రేయస్సును కాంక్షించే.. మీ పవన్ కళ్యాణ్' అని పేర్కొన్న లేఖను పార్టీ అధికారిక ట్విట్టర్ లో పోస్టు చేశారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















