Jayamangala Venkataramana: జనసేన కండువాతో మండలి చైర్మన్ వద్దకు జయమంగళ- ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదించాలని పట్టు
MLC Jayamangala: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ బుధవారం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తో సమావేశమయ్యారు. తన రాజీనామా ఆమోదించాలని కోరారు.

Jayamangala Venkataramana requested accept his resignation: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్సీల రాజీనామాల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ బుధవారం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఎదుట వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు. ఆయన తన మెడలో జనసేన పార్టీ కండువా వేసుకునే విచారణకు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలోనే తన పదవికి రాజీనామా చేసిన ఆయన, దానిని తక్షణమే ఆమోదించాలని మండలి చైర్మన్ను స్వయంగా కోరారు.
జయమంగళ వెంకటరమణ గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ ఓడిపోవడంతో ఆ పార్టీకి దూరమయ్యారు. గత ఏడాది మార్చి నెలలోనే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ లేఖను సమర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అప్పటి నుండి ఆయన జనసేన నాయకుడిగానే కొనసాగుతున్నప్పటికీ, సాంకేతికంగా ఆయన రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. గతంలో తన రాజీనామాలు ఆమోదించలేదని హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు.
సాధారణంగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేసినప్పుడు, వారు ఏవైనా ఒత్తిళ్లకు లోనై రాజీనామా చేశారా లేదా అన్నది నిర్ధారించుకోవడానికి స్పీకర్ , మండలి చైర్మన్ వ్యక్తిగత విచారణ నిర్వహిస్తారు. జయమంగళ విషయంలో కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసినప్పటికీ, మండలిలో బలం తగ్గిపోతుందనే కారణంతో లేదా సాంకేతిక కారణాల సాకుతో గతంలో వీటిని పెండింగ్లో ఉంచారనే విమర్శలు ఉన్నాయి. జయమంగళ స్వయంగా వచ్చి తన రాజీనామాను ధృవీకరించినందున, ఇక ఆమోదముద్ర వేయక తప్పని పరిస్థితి నెలకొంది.
విచారణ అనంతరం జయమంగళ మీడియాతో మాట్లాడారు. తాను స్వచ్ఛందంగానే రాజీనామా చేశానని, జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితుడనై ఆ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. నైతిక విలువలకు కట్టుబడి పదవికి రాజీనామా చేశానని, ఇప్పుడు మండలి చైర్మన్ తన నిర్ణయాన్ని గౌరవించి రాజీనామాను ఆమోదిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. గురువారం కూడా రాజీనామా చేసిన మరో నలుగురు ఎమ్మెల్సీలతో స్పీకర్ మాట్లాడనున్నారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరైనప్పుడు జయమంగళ వెంకటరమణ జగన్ ను పొగిడారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. తన దేవుడు జగన్ అని ఉదయం లేవగానే ఆయన ఫోటోకు దండం పెట్టుకుంటానని చెప్పారు. తాను అప్పుల్లో ఉన్నప్పుడు పిలిచిపదవి ఇచ్చి అప్పులన్నీ తిరిపోయేలా చేశారని చెప్పారు. దీంతో ఆయన రాజీనామా ఉపసంహరణపై వెనక్కి తగ్గుతారని ప్రచారం జరిగింది. కానీ జయ మంగళ మాత్రం రాజీనామాకే కట్టుబడ్డారు.
























