Mithun Reddy ED investigation: మిథున్ రెడ్డి ఈడీ విచారణ పూర్తి - ఏడు గంటల పాటు ప్రశ్నల వర్షం
Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డిని ఏడు గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. తరవాత ఆయన మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

ED questioned Mithun Reddy for seven hours: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా విచారించారు. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో సుమారు ఏడు గంటల పాటు ఈ విచారణ సాగింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీలో జరిగిన అక్రమాలు, లైసెన్సుల కేటాయింపులు, మనీలాండరింగ్ అంశాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
విజయసాయిరెడ్డి వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నలు
ఈ విచారణలో భాగంగా, ఇప్పటికే ఈడీ విచారణ ఎదుర్కొన్న విజయసాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సేకరించిన కీలక సాక్ష్యాధారాలను మిథున్ రెడ్డి ముందు ఉంచి ప్రశ్నించినట్లు సమాచారం. మద్యం కంపెనీలకు అనుకూలంగా నిబంధనలు మార్చడంలో ఎవరి ఒత్తిడి ఉంది? నిధులు ఏ మార్గాల్లో మళ్లాయి? అనే అంశాలపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని బ్యాంక్ లావాదేవీలు , డిజిటల్ సాక్ష్యాలపై కూడా ఆయన నుంచి వివరణ కోరినట్లు సమాచారం.
ఏపీ సిట్ సేకరించిన సాక్ష్యాల ఆధారంగా మరికొన్ని ప్రశ్నలు
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగిన ఈ విచారణ ముగిసిన అనంతరం, మిథున్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు మీడియా ప్రతినిధులు ఆయనను పలకరించే ప్రయత్నం చేశారు. అయితే, ఆయన ఎటువంటి ప్రకటన చేయకుండానే కారులో వేగంగా వెళ్లిపోయారు. విచారణలో ఆయన చెప్పిన సమాధానాలపై అధికారులు సంతృప్తి చెందారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కేసులో మరికొంత మంది కీలక నేతలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
మరోసారి పిలుస్తారా లేదా అన్నదానిపై సస్పెన్స్
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు వేగవంతం కావడం, ఇప్పుడు దానికి ఈడీ మనీ లాండరింగ్ కోణాన్ని జత చేయడంతో వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. మద్యం అక్రమాల ద్వారా వేల కోట్లు చేతులు మారాయని ఇప్పటికే టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోపిస్త్తోంది. ఇప్పటికే అవినీతి కేసుల్లో సిట్ దూకుడుగా విచారణ జరుపుతోంది. కీలక నిందితుల్ని అరెస్టు చేసింది. ఈడీ విచారణ తుది దశకు చేరుకుంటే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరిన్ని ప్రకంపనలు సృష్టించనుంది.
























