Chandrababu Banakacharla: గోదావరిపై పోలవరం ఒక్కటే అనుమతి ఉన్న ప్రాజెక్ట్ - బనకచర్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Banakacharla: గోదావరిపై పోలవరం ఒక్కటే అనుమతి ఉన్న ప్రాజెక్టు అని చంద్రబాబు ఉన్నారు. కాళేశ్వరం సహా మిగతావన్నీ అనుమతి లేనివేనని స్పష్టం చేశారు.

Polavaram is the only permited project on Godavari : గోదావరిపై పోలవరం తప్ప మిగతావన్నీ అనుమతి రాని ప్రాజెక్టులేనని ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే సమస్య సృష్టించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన గోదావరిలో నీళ్లను ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని గుర్తు చేశారు. మనం మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం? తెలంగాణపై ఎప్పుడైనా గొడవ పడ్డానా? అని ప్రశ్నించారు. కృష్ణాలో తక్కువ నీటిపై గొడవ పడితే లాభం లేదని, కొత్త ట్రైబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్లాలని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరాలపై కూడా చంద్రబాబు స్పందించారు.
ఈ ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతంలో కరువు తీవ్రతను తగ్గించడానికి, గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు లింక్ చేస్తుందని, తద్వారా సాగునీటి సమస్యలను పరిష్కరిస్తుందని ఆయన వివరించారు. తెలంగాణకు నీటి హక్కులు ఉన్నాయని, కానీ ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. గోదావరి నీటిని కృష్ణా, పెన్నా బేసిన్లకు మళ్లించి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కరువు తీవ్రతను తగ్గిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, మొత్తం ఖర్చు రూ. 81,900 కోట్లని అంచనా వేశారు. కేంద్రం 50% నిధులను (రూ. 40,950 కోట్లు) గ్రాంట్గా, మిగిలిన 50%ని ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ బాండ్ మెకానిజం (FRBM) కింద అప్పుగా సేకరించేందుకు అనుమతిస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసమేనని, తెలంగాణకు అన్యాయం జరగదని, గోదావరిలో 2,000-3,000 TMC సరప్లస్ నీరు సముద్రంలోకి వృథాగా పోతుందని, దీనిని సద్వినియోగం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
మరో వైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ను కలిశారు. 014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటే ముందు ఆ నదీ యాజమాన్య బోర్డు, జల్శక్తి మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే ఎపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాలి. బనకచర్ల విషయంలో ఏపీ వీటన్నింటిని ఉల్లంఘిస్తోందిని .. ఎలాంటి అనుమతులు ఇవ్వవొద్దని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు ప్రీ - ఫీజిబిలిటీ రిపోర్ట్ను తిరస్కరించాలని జల్శక్తి మంత్రి @CRPaatil గారిని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు కోరారు. బనకచర్ల ప్రాజెక్టు విష… pic.twitter.com/UZ4PJqBZpL
— Telangana CMO (@TelanganaCMO) June 19, 2025
తెలంగాణకు గోదావరి నదిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు మొత్తంగా 1500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేయాలని, దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 1500 టీఎంసీల నీటితో కోటిన్నర ఎకరాలకు నీరు అందుతుందని.. ఆ తర్వాత ఏపీ చేప్టటే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీలిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియలో సత్వరం స్పందిస్తూ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శించడం తగదని జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వైఖరితో ఇరు రాష్ట్రాల మధ్య పలు అపోహలు, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్క-సారక్క, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతో పాటు అన్ని రకాల అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.





















