Breaking News Live Telugu Updates :కేంద్ర హోంమంత్రి అమిత్షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
దక్షిణ ఝార్ఖండ్ ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ పై విస్తరించి ఉన్న తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుంది. ఆదివారం నాటికి ఉత్తర ఛత్తీస్గఢ్, ఉత్తర మధ్యప్రదేశ్ దిశగా కదులుతూ తీవ్రవాయుగుండం బలహీనపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
కోస్తాంధ్ర, రాయలసీమలో
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడతాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. రాయలసీమలోని నేడు రేపు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలంగాణలో వర్షాలు
రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంలో వాయుగుండంగా మారే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని చెప్పింది. శనివారం హైదరాబాద్ లోని పలు చోట్ల వర్షం కురిసింది.
హైదరాబాద్ లో వర్షాలు
బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం బలహీనపడుతోంది. దీంతో దాని ప్రభావం తెలంగాణపై ఉంది. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురవనుంది. ఉదయం వేళ చల్లగా ఉంటూ, మధ్యాహ్నానికి వాతావరణం పూర్తిగా వేడెక్కుతుంది. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు. ఆగస్టు 21 వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి.
Gold Price Today 21st August 2022: ఇటీవలే పెరిగిన బంగారం ధరలు గత రెండు రోజులు క్రమంగా తగ్గాయి. ఇవాళ నిలకడగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,150 వద్దే ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 అయింది. హైదరాబాద్లో రూ.700 తగ్గడంతో వెండి 1 కేజీ ధర నేడు రూ.61,300గా ఉంది. కరీంనగర్, వరంగల్లో 24 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.52,150 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,800 గా ఉంది. వెండి కేజీ ధర రూ.61,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఏపీలో బంగారం ధరలు.. (Gold Rate Today In AP)
ఏపీలో బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 21st August 2022) 10 గ్రాముల ధర రూ.52,150 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,800 గా ఉంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.61,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
విశాఖపట్నం, తిరుపతిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,800, నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.61,300 అయింది.
కేంద్ర హోంమంత్రి అమిత్షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిశారు. ఎవరూ ఊహించని విధంగా అమిత్ షా ఎన్టీఆర్ ను డిన్నర్ మీట్ కు రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు యంగ్ టైగర్ డిన్నర్ కోసం వెళ్లారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా చూశారు కేంద్ర మంత్రి అమిత్ షా. అందులో ఎన్టీఆర్ నటన చూసి ఫిదా అయ్యానని.. ఈ క్రమంలోనే ఆయనతో మాట్లాడని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కేవలం సినిమా గురించే కాకుండా పలు రాజకీయ అంశాలపై కూడా చర్చ జరిగే అకాశం కనిపిస్తోందని తెలుస్తోంది.
ఎమ్మెల్సీ అనంత బాబుకి మాతృమూర్తి వియోగం
ఎమ్మెల్సీ అనంతబాబు తల్లి ఆనారోగ్యంతో మృతి చెందారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబుకి మాతృమూర్తి వియోగం.
గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న అనంతబాబు తల్లి మంగారత్నం కొద్దిసేపటి క్రితం అపోలో హాస్పిటల్ లో మృతి చెందారు.
బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు. అమిత్ షా తెలంగాణ పర్యటనలో వివిధ కార్పొరేషన్లకు చెందిన 30 మంది కార్పొరేటర్లుతో అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకోని అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఉజ్జయిని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దాదాపు అరగంట పాటు అమ్మవారి ఆలయంలో అమిత్ షా, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉండనున్నారు.
కేంద్ర మంత్రి అమిత్ షాతో జూ.ఎన్టీఆర్ సమావేశం
Jr. NTR : కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. అయితే అమిత్ షా పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అవుతున్నారు. అమిత్ షా ఆహ్వానంతో ఎన్టీఆర్ లంచ్కు వెళ్తున్నారు. 15 నిమిషాల పాటు ఇద్దరూ సమావేశం కానుంది. అయితే ఈ సమావేశం రాజకీయపరంగా, లేక వేరే కారణంగా అనేది ఇంకా తెలియాల్సిఉంది.
నేడు దిల్లీకి సీఎం జగన్, రేపు ప్రధానితో భేటీ
CM Jagan : నేడు ఏపీ సీఎం జగన్ దిల్లీకి వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, సాయంత్రం 7 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి దిల్లీ బయలుదేరనున్నారు. రాత్రి 9.15 గంటలకు దిల్లీ చేరుకుని రాత్రికి 1 జన్పథ్ నివాసంలో బస చేయనున్నారు. రేపు ఉదయం 10.15 ప్రాంతంలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.
సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన రద్దు
CM KCR : సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన రద్దు అయింది. జిల్లాలో పలు కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారని ముందు సమాచారం వచ్చింది. కానీ అనుకోని కారణాలతో సీఎం పర్యటన ఆఖరి నిమిషంలో రద్దు అయింది.
శ్రీకాకుళం హైవేపై నారా లోకేశ్ ను అడ్డుకున్న పోలీసులు
Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను శ్రీకాకుళం హైవేపై పోలీసులు అడ్డుకున్నారు. పలాస పర్యటనలో భాగంగా విశాఖ ఎయిర్పోర్ట్లో దిగి రోడ్డుమార్గంలో వెళ్తోన్న లోకేశ్ ను శ్రీకాకుళం సమీపంలో హైవేపై పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ కొత్తరోడ్డు కూడలి వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రులు కళా వెంకట్రావు, చినరాజప్పతో సహా ఇతర నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పలువురు కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
సత్తెనపల్లిలో విషాదం, డ్రైనేజి క్లీన్ చేసేందుకు దిగి ముగ్గురు మృతి
Sattenapalli News : సత్తెనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. న్యూ వినాయక ఫ్యామిలీ రెస్టారెంట్లో డ్రైనేజిలోకి దిగిన ముగ్గురు ప్రమాదానికి గురై మృతిచెందారు. డ్రైనేజీ బాగు చేసేందుకు లోపలికి వెళ్లిన ముగ్గురు ఊపిరి అందక మరణించారు. మృతుల్లో ఇద్దరు కార్మికులు, బిల్డింగ్ యజమాని కొండలరావు ఉన్నట్లు తెలుస్తోంది.
పలాసలో హై టెన్షన్, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడుని అడ్డుకున్న పోలీసులు
Palasa : పలాస నందిగామ మండలం పార్టీ అధ్యక్షుడు అజయ్ కుమార్ వివాహానికి వెళ్తోన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడుని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. పెళ్లికి వెళ్లొద్దని పోలీసులు అడ్డుకున్నారు. పలాసలో ధర్నాలు, ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు తెలిపారు. మరికాసేపట్లో నారా లోకేశ్ పలాస చేరుకోనున్నారు. ఇప్పటికే పలాసలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో హై డ్రామా, మేకతోటి సుచరిత ఇంటి ముందు ఎమ్మెల్యే శ్రీదేవి ధర్నా
Guntur News : గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ను నియమించడంపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అర్ధరాత్రి తన అనుచరులతో కలిసి జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటి ముందు ధర్నాకు దిగారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ నియామకంతో ఎమ్మెల్యేను అవమానించారని శ్రీదేవి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానంతో మాట్లాడదామని ఎమ్మెల్యే శ్రీదేవికి సుచరిత నచ్చజెప్పడంతో ఆమె ఆందోళన విరమించారు. పార్టీ అధినేతతో మాట్లాడేందుకు తాడికొండ నేతలు ప్రయత్నిస్తున్నారు. 10 గంటల్లో పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే నాలుగు మండలాల్లోని నాయకులు పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets