AP Deputy CM Pawan Kalyan: హిమాలయాలు ఎలా తలవంచవో... ప్రధాని మోదీ ఎక్కడా తలవంచరు: పవన్ కల్యాణ్
‘పిఎం - జన్ మన్’ ద్వారా రూ.555 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టామని ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సి.ఎం., డిప్యూటీ సి.ఎం.ల సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు

న్యూఢిల్లీ: ‘హిమాలయ పర్వతాలు ఎలా తలవంచవో... భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఎక్కడా తలవంచరు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా దేశ శక్తిసామర్థ్యాలను చాటిన ఘనత మన ప్రధానిదే’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సి.ఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశంలో ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నడూ ఓట్లు వస్తాయా రావా అనేది ఆలోచన చేయలేదు. దేశ అభివృద్ధే లక్ష్యంగా పనిచేశారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం ‘పి.ఎం – జన్ మన్’ కార్యక్రమం. కేంద్రం నిధులు సమకూరుస్తున్న ఈ కార్యక్రమం ద్వారా పర్టీక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (PVTG) ఉండే ఆవాసాలకు రహదారి సౌకర్యం కల్పించగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే పి.ఎం. - జన్ మన్ ద్వారా కేంద్రం అందిస్తున్న రూ.555.61 కోట్ల నిధులతో 612.72 కి.మీ. మేర రహదారులు నిర్మిస్తున్నాం. ఇవన్నీ పర్టీక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆవాసాలను అనుసంధానించే రహదారులు. వీటి ద్వారా ఏపీలో 7 జిల్లాల్లో 239 పి.వి.టి.జి. ఆవాసాలకు రహదారులు అందుబాటులోకి తెస్తున్నామని’ చెప్పారు.
ఓట్లు కోసం చూస్తే...
239 ఆవాసాలకు రహదారుల ఏర్పాటు చేయడంతో సుమారు 50 వేల మందికి రోడ్డు సౌకర్యం వస్తుందన్నారు. వారు మనకు ఓట్లు వేస్తారా లేదా అనే ఆలోచన ఎక్కడా చేయలేదు ప్రధాని నరేంద్ర మోదీ. అదే మొత్తాన్ని ఓట్లు వస్తాయి అనే చోట ఖర్చు చేయవచ్చు. ప్రతి ఒక్కరికీ, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ముందడుగు వేస్తున్నారు. ఆ స్ఫూర్తితోతోనే ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ముందుకు వెళ్తున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఈరోజు ఢిల్లీలోని అశోకా హోటల్ లో గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి అధ్యక్షతన జరుగుతున్న ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రుల కాంక్లేవ్ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan.#NDAConclave pic.twitter.com/UB5TYhBaxq
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) May 25, 2025
ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర క్యాబినెట్ (AP Cabinet) ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ 3 నెలలపాటు రాష్ట్రంలో పర్యటించి తయారుచేసిన నివేదికను అనుసరించి ఎస్సీ వర్గీకరణ చేపట్టినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఆపరేషన్ సిందూర్, అందుకు దారి తీసిన పరిస్థితులు చాలా క్లిష్టమైనవి. ఇటువంటి దశలో సైతం ప్రజల రక్షణతోపాటు వారి భవిష్యత్తు కోసం ప్రధాని మోదీ ఆలోచించారు. దేశంలో కుల గణన చేపట్టడం చాలా అవసరం. దేశంలో ఉన్న కులాల పరిస్థితులు, వారి జీవనం, వృత్తులు, స్థితిగతులు తెలుస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు. అన్ని కులాలు, వెనుకబడిన వర్గాల వారికి జీవనోపాధి మెరుగుదలకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఏ పథకాలు తీసుకురావాలో పాలకులకు స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.






















