![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్జాం - తీరం దాటేది ఏపీలోనే!
Michaung cyclone : మిగ్జాం తీవ్ర తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని రెండు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
![తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్జాం - తీరం దాటేది ఏపీలోనే! MICHAUNG cyclone updates It is expected to cross the coast at Bapatla in Machilipatnam heavy rain fall in telangana Andhra Pradesh తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్జాం - తీరం దాటేది ఏపీలోనే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/04/d41f790cb04fb165efa981177ef8a22c1701677539617215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Michaung Cyclone Effect In Andhra Pradesh And Telangana :పశ్చిమబంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జాం తీవ్ర తుపానుగా మారుతోంది. చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 90కిలోమీటర్లు దూరంలో నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో పుదుచ్చేరికి 200 కిలోమీటర్ల దూరాన బాపట్లకు 300కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుపాను వేగంగా దూసుకొస్తోంది. బాపట్ల దివిసీమ మధ్యలోనే మంగళవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.
తీరం దాటే ప్రాంతంలో భారీ ఆస్తి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో అధికారులను అప్రమత్తం చేసింది. ఈ తుపాను ప్రభావంతో తెలంగాణలో కూడా రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని చెబుతోంది. అక్కడ కూడా అధికారులు అప్రమతంగా ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమతం చేయాలని చెబుతోంది.
తుపాను ప్రభావంతో తీర ప్రాంతంలో అలజడి మొదలైంది. సముద్రపు అలలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నారు. ఈ ప్రమాదకర పరిస్థితిలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుక ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నిజాంపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో పదో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు కృష్ణ పట్నంలో 8 హెచ్చరిగా ఎగరేశారు. మిగతా పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయింది.
తీర్ప ప్రాంతంలోని చాలా జిల్లాలో వర్షాలు ఊపందుకున్నాయి. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగతా కోస్తా ప్రాంతాల్లో వాతావరణం చాలా గంభీరంగా ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. తుపాను ప్రభావం తగ్గే వరకు వరి కోతలు వద్దని సూచిస్తున్నారు. ఇప్పటికే కోత చేసిన వాళ్లు వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెబుతున్నారు.
తుపాను ప్రభావం తిరుమలపై గట్టిగానే ఉంది. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. దీంతో ఏఎన్సి కాటేజ్, బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద భారీ వృక్షాలు నెలకొరిగాయి. దీని వల్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు వృక్షాలను తొలగించి ట్రాఫిక్ను పునరుద్దరించారు.
భారీగా కురుస్తున్న వర్షాలకు తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. పాపవినాశనం మార్గంలోని పలు ప్రదేశాల్లో చెట్లు కూలి పోవడంతో పాపవినాశనం వైపుగా భక్తులను వెళ్లనియ్యడం లేదు. సందర్శనీయ ప్రదేశాలైన శ్రీపాదాలు, శిలాతోరణానికి కూడ భక్తులను వెళ్లనియ్యకుండా అడ్డుకుంటున్నారు.
నెల్లూరు నగరంలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు తిష్టవేసింది. ప్రధాన రహదారులపై కూడా ప్రయాణం నరకంగా మారింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాదచారులు కూడా ఇబ్బందులు పడ్డారు. వర్షం వస్తే నగరంలోని అండర్ బ్రిడ్జ్లు నీట మునుగుతాయి. ఇక్కడ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. వర్షం వచ్చిన ప్రతిసారీ ఈ సమస్య ఉండేదే అయినా నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో మిచౌంగ్ తుపాను ప్రభావం కొనసాగుతున్న ఈ సమయంలో నెల్లూరు అండర్ బ్రిడ్జ్ లు నీట మునిగాయి. నగర వాసులకు నరకం చూపించాయి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)