AP Rains UPdate: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం- కోస్తాంధ్రాకు భారీ వర్ష సూచన
AP Weather Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Andhra Pradesh Weather Update: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలవైపుగా కదులుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఇది ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల వైపు కదులేందుకు అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యేందుకు ఛాన్స్ ఉందన్నారు అధికారులు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాల కురుస్తాయని చెప్పారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం (25-07-25) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని తెలిపారు.
శనివారం (26-07-25) ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
గురువారం సాయంత్రం 5 గంటల నాటికీ మన్యం జిల్లా సీతంపేటలో 58మి.మీ, శ్రీకాకుళం జిల్లా మందసలో 49.7మిమీ, అల్లూరి జిల్లా ముంచింగిపుట్టులో 44.5మి.మీ, చింతపల్లిలో 41.5 మి.మీ, వజ్రపుకొత్తూరులో 40.7 మి.మీ వర్షపాతం రికార్డు అయ్యింది.





















