AP Free Bus: దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ!
Dola Sree Bala Veeranjaneya Swamy | దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి: దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రకటించిన 'ఇంద్రధనస్సు' కార్యక్రమంలో భాగంగా, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం, రాష్ట్రంలో 'స్త్రీ శక్తి' పథకం వర్తించే అన్ని ఆర్టీసీ బస్సుల్లోనూ దివ్యాంగులు ఇకపై ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ చారిత్రాత్మక నిర్ణయం పట్ల దివ్యాంగుల తరఫున ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
నెలరోజుల్లోపు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ..
ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దివ్యాంగులకు నెలకు రూ. 6,000 పింఛన్ అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా, దివ్యాంగుల కోసం కేటాయించిన బ్యాక్లాగ్ ఉద్యోగ ఖాళీలను వచ్చే మార్చి నెల లోపు భర్తీ చేస్తామని మంత్రి కీలక ప్రకటన చేశారు. విద్య, ఉపాధి, రవాణా రంగాల్లో దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని మంత్రి బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.
























