Chandrababu UAE Tour Schedule: నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
Chandrababu UAE Tour | ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మూడు రోజులపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోపర్యటించనున్నారు. నవంబర్ లో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించనున్నారు.

అమరావతి: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఏపీ మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించారు. విశాఖలో జరిగే సదస్సులో పాల్గొనాలని పారిశ్రామిక వేత్తలను కోరారు. ఇప్పుడు ఇక సీఎం చంద్రబాబు వంతు వచ్చింది. ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. ఈ మేరకు సింగపూర్ లో గతంలో పర్యటించిన సీఎం చంద్రబాబు (Chandrababu) బృందం ఇప్పుడు యూఏఈకి వెళ్తుంది. నవంబర్ 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Summit) కోసం సీఎం చంద్రబాబు దుబాయ్ లో రోడ్ షో నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం దుబాయ్ చేరుకోనున్న చంద్రబాబు
ఈ పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని దుబాయ్ సహా వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలను, కంపెనీలను, ప్రభుత్వ ప్రతినిధులను విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు చంద్రబాబు ఆహ్వానించనున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ కు 10 గంటలకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా దుబాయ్ కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు దుబాయ్ (Dubai) అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. చంద్రబాబు పర్యటన చివరి రోజున దుబాయ్ లో AP NRT ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు (Chanrababu) పాల్గొననున్నారు.

దుబాయ్ చేరుకున్న తొలి రోజు నుంచే సీఎం చంద్రబాబు వివిధ పారిశ్రామిక వేత్తలతో భేటీలు నిర్వహించనున్నారు. చంద్రబాబు పర్యటించే మూడు రోజుల పర్యటనలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలను కలిసేలా పర్యటన కొనసాగనుంది. ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో మూడు, పారిశ్రామిక వేత్తలతో 14 వన్ టు వన్, రౌండ్ టేబుల్ మీటింగ్స్, రెండు సైట్ విజిట్స్, సీఐఐ పీఎస్ రోడ్ షో 1, తెలుగు డయాస్పోరా 1, మీడియా ఇంటర్వ్యూలు సహా తన పర్యటనలో చంద్రబాబు 25 సమావేశాల్లో పాల్గొననున్నారని ప్రభుత్వ వర్గాల సమాచారం.
తొలిరోజు పర్యటన షెడ్యూల్ ఇలా...
తొలిరోజు అక్టోబర్ 22న పర్యటనలో భాగంగా 5 కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. వీరితో వన్ టు వన్ సమావేశాల్లో పాల్గొంటారు. వీరితో జరిపే వేర్వేరు భేటీల్లో ఇండస్ట్రీయల్, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్, పోర్టులు-షిప్ మేనేజ్మెంట్, వేర్ హౌసింగ్ సదుపాయాలు వంటి రంగాల్లో పెట్టుబడులపై ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చించనున్నారు. తొలి రోజు పర్యటనలో సీఎం చంద్రబాబు బృందం పలు ప్రాంతాలను సందర్శించనుంది. మ్యూజియం సందర్శనలో భాగంగా జర్నీ టూ 2071 థీమ్ తో ఉండే స్పేస్ ట్రావెల్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను చంద్రబాబు టీం పరిశీలించనుంద. అలాగే ఇదే మ్యూజియంలో ఏర్పాటు చేసిన భవిష్యత్ టెక్నాలజీ సొల్యూషన్స్ అనే అంశంపైనా వారు అధ్యయనం చేయనున్నారు.
బుధవారం రాత్రికి సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన రోడ్ షోకు చంద్రబాబు హాజరవుతారు. వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. విశాఖలో వచ్చే నెల 14,15వ తేదీల్లో జరగబోయే పెట్టుబడుల సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించనున్నారు. దుబాయ్ పర్యటనలో చంద్రబాబుతో పాటు ఏపీ మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్థన్ రెడ్డి, సీఎం సెక్రటరీ కార్తికేయ మిశ్రా, ఇండస్ట్రీస్ సెక్రటరీ యువరాజ్, ఏపీ ఇడిబి సీఈఓ సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ధాత్రిరెడ్డి పాల్గొననున్నారు.






















