Chandrababu Singapore Tour: సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ తో చంద్రబాబు బృందం భేటీ, విశాఖ పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Singapore Investments to Andhra Pradesh | సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ తో ఏపీ సీఎం చంద్రబాబు బృందం భేటీ అయింది. గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్ల ఏర్పాటుకు సహకరించాలని సింగపూర్ మంత్రిని చంద్రబాబు కోరారు.

AP CM Chandrababu meets Singapore Minister | సింగపూర్: సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక విభాగం మంత్రి టాన్ సీ లాంగ్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం భేటీ అయ్యింది. విశాఖ పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ మంత్రికి ఆహ్వానించారు. ఏపీ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ ప్రాజెక్టులను చేపట్టిందని ఇందులో సింగపూర్ నుంచి మరింత సహకారాన్ని ఆశిస్తున్నామని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వలో జరిగిన తప్పిదాలు సరిదిద్ద చేయడానికి సింగపూర్ పర్యటనకు వచ్చానని వారికి చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైన రికార్డులను సైతం సరిచేస్తామన్నారు.
ఏపీలోనూ వేగంగా పోర్టుల నిర్మాణం
సింగపూర్ లో రెండో రోజు పర్యటనలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్ మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వాములు కావాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన అంశంలోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరమని అన్నారు. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని.. ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని సింగపూర్ మంత్రికి ఏపీ టీమ్ వివరించింది. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో అత్యుత్తమ విధానాలు అనుసరించటంలో సింగపూర్ ఏపీకి సహకరించాలని కోరారు.
గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కావు
మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమనిచంద్రబాబు అభిప్రాయపడ్డారు. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ తో ప్రత్యేకంగా చర్చించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా రికార్డులు సరి చేసేందుకే సింగపూర్ వచ్చానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
సింగపూర్ పై ఉన్న అభిమానంతోనే గతంలో హైదరాబాద్ లో సింగపూర్ టౌన్ షిప్ (Singapore Township) నిర్మించామని చంద్రబాబు గుర్తు చేశారు. సింగపూర్ ను చూసే హైదరాబాద్ లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని గతంలో చేపట్టినట్లు తెలిపారు. మరోవైపు ఏపీలో నవంబరు నెలలో జరగనున్న పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ ను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.
గృహ నిర్మాణం, సబ్ సీ కేబుల్ రంగాల్లో కలిసి పని చేసేందుకు ఆసక్తి
గృహ నిర్మాణం, సబ్ సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ తెలిపారు. ఈ రంగంలో సింగపూర్- ఏపీ కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీ, గృహనిర్మాణం లాంటి అంశాల్లో ప్రపంచ బ్యాంకుతో కలిసి పని చేస్తున్నామని సింగపూర్ మంత్రి ఏపీ సీఎం చంద్రబాబుకు వివరించారు. గతంలో హైదరాబాద్ వచ్చి సీఎం చంద్రబాబుతో కలిశానని సింగపూర్ మంత్రి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశానికి చంద్రబాబుతో పాటు ఏపీ మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ సహా ఏపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.






















