AP CM Chandra Babu Davos Tour : ఆదివారం దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు- WEFలో ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సమావేశాలు, షెడ్యూల్ ఇదే
Andhra Pradesh CM Chandra Babu Davos Tour Schedule:సోమవారం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్లో పర్యటించనుంది. దీని కోసం ఆదిరవారం బయల్దేరనున్నారు. ఈ టూర్ షెడ్యూల్ ఇదే

AP CM Chandra Babu Davos Meeting:బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులు సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్లో వెళుతున్నారు. అక్కడ జరిగే జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో చర్చలు జరపనున్నారు. ఈ సదస్సులో భాగస్వాములు అవ్వడం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకు సిఎం చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దేశానికి సంబంధించి పలు దిగ్గజ సంస్థలతోపాటు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఏపిలో పెట్టుబడులకు ఓకే చెప్పింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, పారిశ్రామిక దిగ్గజాలతో ఉన్న పరిచయాలు, గతంలో సాధించిన విజయాలు కారణంగా 7 నెలల కాలంలోనే పెద్ద సంఖ్యలో పెట్టుబడుల వచ్చాయి. ముఖ్యంగా పారిశ్రామిక వేత్తల్లో నమ్మకాన్ని కల్గించిన చంద్రబాబు... పెట్టుబడుల విషయంలో ఒక పాజిటివ్ వాతారణాన్ని తీసుకురాగలిగారు. దీంతో దేశంలోని ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు రూ.4 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. వీటిలో కొన్ని ప్రాజెక్టులకు ఇప్పటికే శంకుస్థాపనలు జరిగాయి. రానున్న రోజుల్లో అర్సెల్లార్ మిత్తల్ స్టీల్ పరిశ్రమ, బిపిసిఎల్ వంటి ప్రాజెక్టుల పనులు ప్రారంభంకానున్నాయి.
జాబ్ ఫస్ట్ విధానం
ఎన్నికల్లో ప్రకటించినట్లు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల సాధన లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 20 లక్షల ఉద్యోగ, ఉపాధి కల్పన టాస్క్ ఫోర్స్కు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల పోటీని తట్టుకుని నిలబడేందుకు ప్రభుత్వం దాదాపు 15కుపైగా కొత్త పాలసీలు ప్రకటించింది. జాబ్ ఫస్ట్ విధానంతో తెచ్చిన ఈ కొత్త పాలసీలతో పెట్టుబడుదారులను ఆకర్షిస్తోంది. ఇండస్ట్రియల్ డెవల్మెంట్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేటు పార్క్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, సెమికండ్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, డాటా సెంటర్ పాలసీ,స్పోర్ట్స్ పాలసీలు, టూరిజానికి పరిశ్రమ హోదా వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
వీటిని చూపించి దావోస్లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రముఖంగా ప్రస్తావించి పెట్టుబడులు సాధించాలని ముఖ్యమంత్రి ఆలోచనగా ఉంది. రాష్ట్రంలో ఉన్న మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ రాయితీలు, సమర్థవంతమైన నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు చూపించి కంపెనీలను ఆకర్షించేందుకు దావోస్ పర్యటనను వేదికగా చేసుకోబోతున్నారు.
ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి జ్యూరిచ్కు సీఎం బృందం
ఆదివారం సాయంత్రం అమరావతి నుంచి దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి ముందుగా ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ నుంచి అర్ధరాత్రి 1.30 గంటలకు తన బృందంతో జ్యూరిచ్కు చేరుకుంటారు. ముందుగా జ్యూరిచ్లో ఉన్న ఇండియన్ అంబాసిడర్తో భేటీ అవుతారు. అనంతరం హిల్టన్ హోటల్లో 10 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతారు. అక్కడి నుంచి హోటల్ హయత్లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహించే సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చిస్తారు. ఏపిని ప్రమోట్ చేయడం, పెట్టుబడులకు వారిని ఆహ్వానించడంపై చర్చిస్తారు.
అక్కడ నుంచి 4 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి దావోస్ చేరుకుంటారు. తొలి రోజు రాత్రి పలువురు పారిశ్రామికవేత్తలతో డిన్నర్ మీటింగ్లో సిఎం పాల్గొంటారు. అర్సెల్లార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిత్తల్తో ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. తొలి రోజు సమావేశాలు ముగించుకుని హోటల్ కు చేరుకుంటారు.
రెండో రోజు షెడ్యూల్
రెండో రోజు సిఐఐ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో పాల్గొంటారు. తరువాత సోలార్ ఇంపల్స్, కోకకోలా, వెల్స్పన్, ఎల్జి, కార్ల్స్బర్గ్, సిస్కో, వాల్ మార్ట్ ఇంటర్ నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంస్థల సీఈవోలతో, చైర్మన్లతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. యుఎఈ ఎకానిమీ మినిస్టర్ అబ్దుల్లా బిన్తో సిఎం సమావేశం అవుతారు. అనంతరం వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహిస్తున్న ఎనర్జీ ట్రాన్సిషన్ : వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ అనే అంశంపై జరిగే చర్చలో పాల్గొంటారు.
అనంతరం ది నెక్ట్స్ వేవ్ పైనీరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమోరో అనే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. రెండో రోజు ఈ భేటీలతో పాటు వివిధ జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో సిఎం పాల్గొంటారు. బ్లూమ్ బర్గ్ వంటి మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా ఏపీ పాలసీల గురించి వివరిస్తారు.
మూడో రోజు షెడ్యూల్
మూడవ రోజు కూడా పలు బిజనెస్ టైకూన్లతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రోజుకు కనీసం పదికిపైగా భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. నాలుగో రోజు ఉదయం దావోస్ నుంచి జ్యూరిచ్ చేరుకుని అక్కడి నుంచి స్వదేశానికి రానున్నారు.
షెడ్యూల్ మీటింగ్స్తోపాటు... నాలుగు రోజుల సమయంలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి బృందం పాల్గొంటుంది. సిఎం బృందంలో పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్, ఐటీ మంత్రి నారా లోకేష్తోపాటు ఇండస్ట్రీశాఖ అధికారులు, ఇడిబి అధికారులు ఉన్నారు.
4 రోజుల దావోస్ పర్యటనలో బ్రాండ్ ఎపి ప్రమోషన్తో పెద్దఎత్తున పెట్టుబడులకు మార్గం సుగమం చేసేందుకు సిఎం ఆలోచనలు చేస్తున్నారు. దెబ్బతిన్న బ్రాండ్ పునరుద్దరణతో మళ్లీ రాష్ట్రానికి దేశ, విదేశీ పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్రం ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దీనికి ఈ పర్యటన దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.





















