Ayush Mhatre Speech U19 World Cup Win | రోహిత్, హర్మన్ వారసత్వం కొనసాగించామన్న ఆయుష్ | ABP Desam
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్ ను చిత్తు చేసి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. వైభవ్ సూర్యవంశీ వీరవిహారంతో భారత్ 100 పరుగుల తేడాతో ఆంగ్లేయులను చిత్తు చేసి ఆరోసారి సగర్వంగా వరల్డ్ కప్ ను ముద్దాడింది. ఏడాది కాలంగా వరల్డ్ కప్ టార్గెట్ గా తమ ప్రతిభను చాటుకున్న యువ భారత్ కప్ తో సూపర్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ సందర్భంగా వరల్డ్ కప్ విజయంపై 17ఏళ్ల కుర్రాడు కెప్టెన్ ఆయుష్ మాత్రే చాలా గొప్పగా మాట్లాడాడు. 2024 తర్వాత వైట్ బాల్ క్రికెట్ లో జరిగిన అన్ని ఐసీసీ టోర్నీల్లోనూ భారత్ దే హవా అన్న ఆయుష్...2024 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రోహిత్ శర్మ, 2025 వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వారసత్వాన్ని అండర్ 19 వరల్డ్ కప్పులోనూ కొనసాగించామన్నాడు. వారి విజయాల స్ఫూర్తిగా అండర్ 19 వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్నామన్న ఆయుష్...టీమ్ లో ఉన్న ప్రతీ ఒక్కరూ బాధ్యతలను సమర్థంగా పంచుకోవటం ద్వారా ఈ కప్ కల సాధ్యమైందన్నాడు. టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న భారత జట్టు మ్యాచ్ ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామన్న ఆయుష్..అది కూడా సాధిస్తే వైట్ బాల్ క్రికెట్ లో అన్ని ఐసీసీ టోర్నీలు సాధించిన జట్టుగా భారత్ నిలుస్తుందన్నాడు. ఆయుష్ ఆశించినట్లుగా భారత్ టీ20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంటే రెండేళ్లుగా అంటే 2024 తర్వాత వైట్ బాల్ క్రికెట్ లో భారతే విశ్వవిజేతగా నిలబడనుంది. మనోళ్లే కింగులు..మనోళ్లే క్వీనులుగా సరికొత్త చరిత్రను సృష్టించనున్నారు.























