KTR On Elections : కేసీఆర్ 9 ఏళ్ల పాలన ట్రైలరే - 99 సీట్లు గెలుస్తామని కేటీఆర్ ధీమా !
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 99 సీట్లు గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 9 ఏళ్ల కేసీఆర్ పరిపాలన ట్రైలరేనన్నారు.

KTR On Elections : తెలంగాణలో మరో ఐదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారాన్ని దక్కించుకుంటుందని మంత్రికే టీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా 99 స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. ఈ తొమ్మిదేళ్లలో ప్రజలు చూసింది కేవలం ట్రైలరేనన్నారు. కేసీఆర్ ఆలోచనల్లో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయన్నారు. నానక్ రామ్ గూడలో క్రెడాయ్ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని.. ద్వితీయ శ్రేణి నగరాల్లో 50వేల ఐటీ ఉద్యోగాలను సృష్టంచడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు.
ఈ సందర్భంగా గత ముఖ్యమంత్రులతో పోలిస్తే కేసీఆర్ ఎంత భిన్నంగా పరిపాలించారో విశ్లేషించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన చంద్రబాబు, వైఎస్ఆర్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య ఉన్న తేడా ఏంటో మున్సిపల్ మంత్రి కేటీఆర్ వివరించారు. చంద్రబాబు ఐటీ, బిజినెస్ రంగాలను ముందుకు నడిపించారు. తనను తాను ఒక సీఈవోగా అభివర్ణించుకునే వారన్నారు. వైఎస్ఆర్ రైతులు, సంక్షేమం, పేదలపై దృష్టి పెట్టారు. వారిద్దరూ కేవలం కొన్ని రంగాలనే ఎంచుకొని రాష్ట్రాన్ని పాలించారున్నారు. కానీ, సీఎం కేసీఆర్ తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల అభివృద్దికి చర్యలు తీసుకుంటూనే.. మరో వైపు వ్యవసాయాన్ని అగ్రగామిగా నిలిపారన్నారు. రైతులు, ప్రజల సంక్షేమాన్ని కూడా ఆయన మారువలేదని మంత్రి కేటీఆర్ క్రెడాయ్ సభ్యలుకు తెలిపారు.
అన్ని వర్గాల వారి సంక్షేమానికి కేసీఆర్ పని చేసినందున వచ్చే ఎన్నికల్లో ఆయన మరోసారి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 24 గంటల కరెంటు ఇస్తున్నాము. నీళ్ల బాధ తీరింది. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయిన కేటీఆర్ చెప్పారు. 1940లో కట్టిన అప్పర్ మానేరు కోసం రైతులు హైదరాబాద్ వరకు పాదయాత్రలు చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఎండాకాలంలో కూడా నిండు కుండలా ఉందని చెప్పారు. ఇలాంటి మార్పులు రావాలంటే నాయకుడిలో చిత్తశుద్ధి, అకుంఠిత దీక్ష ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. 67 ఏళ్లలో జరగని అభివృద్ధి 9 ఏళ్లలోనే సాధ్యపడిందంటే అందుకు సీఎం కేసీఆర్ దార్శనికతే కారణమని మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ నగరం నాది అని చెప్పుకోవడానికి మనమే కాకుండా, మన పిల్లలు కూడా గర్వ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఎన్నో అనుమానాలు, అపోహలు ఏర్పాడ్డాయి. ముఖ్యంగా నిర్మాణ రంగంలో ఉన్న వాళ్లు చాలా కంగారు పడ్డారు. 10 ఏళ్ల క్రితం ఇందిరా పార్క్ వద్ద పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారు. పవర్ హాలీడేలు పెడితే మేము ఎలా బతకాలి, మా కార్మికులకు ఎలా ఉపాధి దొరుకుందని ఆవేదన చెందారు. ఒక వైపు రైతుల ధర్నాలు. మోటార్లకు కరెంటు కావాలని.. మరోవైపు నీళ్ల గోస ఉండేది. అప్పట్లో ఊర్లలోకి పోవాలంటే భయమేస్తుండేది. కరెంటు, నీళ్లకు కూడా ఈ ప్రాంతం చాలా ఇబ్బంది పడిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
సాయిచంద్ మరణంతో కార్యక్రమం రద్దు చేయాలనుకున్నామని.. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కార్యక్రమానికి హాజరయ్యానని కేటీఆర్ తెలిపారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.





















