ప్రాంతీయవాదం పెరిగితే దేశం విచ్ఛిన్నమవుతుందని, ఉగ్రవాదుల్లా మాట్లాడటం మంచిది కాదని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి.
KTR vs Pawan Kalyan: "పవన్ కల్యాణ్ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ప్రాంతీయవాదులను ఉగ్రవాదులతో పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డారు.

- పవన్ కల్యాణ్ ప్రాంతీయవాదంపై వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
- పొట్టి శ్రీరాములు, ప్రధాని మోడీ చర్యలపై కేటీఆర్ నిలదీశారు.
- తెలంగాణ ప్రజలదేనని, పవన్ జాతీయ పాఠాలు అక్కర్లేదన్నారు కేటీఆర్.
KTR vs Pawan Kalyan: ప్రాంతీయ వాదాన్ని పెంచుకుంటూ పోతే దేశం విచ్చిన్నమవుతుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఉగ్రవాదుల్లా మాట్లడం దేశానికే మంచిది కాదని ఆయన హితవు పలికారు. దీన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. హైదరాబాద్లో మీట్ది ప్రెస్లో మాట్లాడుతూ ప్రాంతీయ వాదం ఉగ్రవాదం అయితే పొట్టి శ్రీరాములు చేసింది ఏంటని ప్రశ్నించారు. ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం కాకుండా మద్రాస్ నుంచి విడిగొట్టాలని దీక్ష చేయలేదా అని నిలదీశారు.
తెలంగాణ ప్రజల జాగీరే!
తెలంగాణ కచ్చితంగా తెలంగాణ భూమి పుత్రుల జాగీరు అని కేటీఆర్ ఘాటుగా కామెంట్ చేసారు. ఇందులో ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు. 100% ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్లు, ఈ నేల కోసం పోరాటాలు చేసినవాళ్లు, ఈ నేల కోసం త్యాగాలు చేసినవాళ్లు ఉన్నారని అన్నారు. వారి నెత్తురుతో తడిచిన నేల వారి జాగీరే అని అన్నారు. ముమ్మాటికీ తెలంగాణ ఇక్కడున్న నాలుగు కోట్ల మంది జాగీరేనని స్పష్టం చేశారు.
పొట్టి శ్రీరాములది, మోదీది కూాడ ఉగ్రవాదమేనా?
కుటుంబాలతో తెలంగాణ వచ్చి ఉండాలని, వ్యాపారులు చేసుకోవాలని, స్థిరపడాలని కేటీఆర్ సూచించారు. అలా ఉండొద్దని, తిరగొద్దని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. 10, 12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందా? అని అడిగారు. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నామని కేటీఆర్ తెలిపారు. "పవన్ ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అన్నారు. నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా ప్రాంతీయవాదం అంటే... మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేర్పడాలని పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు, అది కూడా ప్రాంతీయవాదం అంటారా?
ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ ని... మోడీ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను పట్టుకొని పోతా ఉన్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గుజరాత్కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ ?" అని నిలదీశారు.
పవన్ జాతీయ పాఠాలు అక్కర్లేదు
అసలు వివాదమే లేని జనగణమన, వందేమాతరం విషయాలను ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఏం వచ్చిందని కేటీఆర్ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. కావాలనే ప్రజలను రెచ్చగొట్టేందుకు ఇలాంటివి చేస్తున్నారని మండిపడ్డారు. "జనగణమన పాడరు అని. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏమీ లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల. కమ్యూనిస్టులు కదంతొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్తగాదు, మాకు యుద్ధాలు కొత్తగాదు, త్యాగాలు కొత్తగాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది ఇక్కడ, దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది." అని అన్నారు.
పవన్ను గౌరవిస్తాం, బిర్యానీ పెడతాం... కానీ...
పవన్ ను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తామన్నారు కేటీఆర్. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తామని తెలిపారు. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతామని చెప్పారు. కానీ, వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాం అంటే ఒప్పుకోమన్నారు. 60 ఏళ్లు పోరాటం చేసి మొన్న వేరుపడ్డామని, పవన్ది ఈ మధ్యనే 'ఓజీ' అని సినిమా వచ్చిందని ఇక్కడ అసలైన తెలంగాణ ఓజీ మా కేసీఆర్ ఉన్నారని అన్నారు. ఆయన తెలంగాణను కాపాడుకుంటారని పేర్కొన్నారు.
"ఈ దేశంలో ఏ నాయకుడైనా, ఏ నాయకురాలైనా పార్టీ పెట్టవచ్చు. పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఏ ప్రాంతంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా నిరభ్యంతరంగా పోటీ చేయవచ్చు. ప్రజాస్వామ్య భారతంలో అది అందరికీ ఉన్న హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు. ఇందులో ఏమీ అనుమానం పడక్కర్లేదు. కానీ, ఏ ప్రాంతంలోనైతే మీరు పోటీ చేయాలనుకుంటున్నారో, ఆ ప్రాంత ఆకాంక్షలు, ఆ ప్రాంత పరిస్థితులు, ఆ ప్రాంత ప్రజలు, వారి మనోభావాలు, వారి పోరాటాలు, వారి త్యాగాలు కూడా తెలుసుకోవాలి, వారి మీద అభిమానం ఉండాలి." అని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ జనసేన కొత్తగా పోటీ చేసేదేముంది?
2023లో జనసేన పోటీ చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. "2023లో పోటీ చేయలేదా మీరు? చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డుల్లో, కొత్తగా చేసేదేముంది? మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? 2018లో చంద్రబాబు నాయుడు వచ్చారు, పోటీ చేశారు. 23లో మీరు పోటీ చేశారు. పోటీ చేయండి, ఎవడొద్దంటున్నాడు?
కానీ, మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు, ఇదేదో ఆశామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. ఇదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో, రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ."
ఇక్కడికి వచ్చినప్పుడు, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలని కేటీఆర్ సలహా ఇచ్చారు. "జనసేనను ఎవరు అడ్డుకుంటున్నారు ? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకుని, ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 2023లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, ఇప్పుడెవరు అడ్డుకున్నారు? మేమేం చేస్తాం దానికి?"
పవన్, ఎవరైనా సరే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి, ఇక్కడ సభ పెడతాం అంటే భావోద్వేగాలు రగులుతాయి. అది కూడా గతంలో తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఆ విభజించిన పద్ధతి నచ్చలేదు అన్న వ్యక్తి అలా చేస్తే ఊరుకుంటారా. తెలంగాణ ఏర్పడటం ఇష్టం లేకే ఇలాంటివి చెబుతున్నరాని అన్నారు. " ఇది బాగాలేదు, అది బాగాలేదు అని. మరి అది బాగాలేకపోతే, ఇది బాగాలేకపోతే, 11 రోజులు అన్నం ముట్టకుండా ఉంటే, మళ్లీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉందా? మీటింగ్ పెడదాం అనుకున్నావ్, అడ్డుకున్నదెవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమన్నా అనాలనుకుంటే వాళ్లననాలి. కాబట్టి, పవనైనా ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోటీ చేశారు కూడా కదా మీరు. 2023 మే భీ ఆప్ బహుత్ కరే.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
ప్రాంతీయవాదంపై పవన్ కల్యాణ్ ఏ వ్యాఖ్యలు చేశారు?
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎలా స్పందించారు?
కేటీఆర్ పవన్ వ్యాఖ్యలను ఖండించారు. పొట్టి శ్రీరాములు పోరాటం, మోడీ ఆర్థిక ప్రాంతీయవాదం ఉగ్రవాదం అవుతుందా అని ప్రశ్నించారు.
తెలంగాణ ఎవరి జాగీరని కేటీఆర్ స్పష్టం చేశారు?
తెలంగాణ ఈ నేల కోసం కష్టపడ్డవారి, పోరాడినవారి, త్యాగాలు చేసినవారి జాగీరు అని కేటీఆర్ అన్నారు. ఇది నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల సొత్తు అని స్పష్టం చేశారు.
దేశభక్తిపై పవన్ కల్యాణ్ పాఠాలు అవసరం లేదని కేటీఆర్ ఎందుకు అన్నారు?
నిజాం సర్కార్కి వ్యతిరేకంగా పోరాడిన నేల తెలంగాణ అని, దేశభక్తి గురించి తమకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు.
ట్రెండింగ్ వార్తలు




















