![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
DK Aruna : గద్వాల ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హత - ఎమ్మెల్యేగా డీకే అరుణ !
తప్పుడు అఫిడవిట్ సమర్పించారని నిర్ధారణ కావడంతో గద్వాల ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హతా వేటు వేసింది. సమీప ప్రత్యర్థి డీకే అరుణను విజేతగా ప్రకటించింది.
![DK Aruna : గద్వాల ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హత - ఎమ్మెల్యేగా డీకే అరుణ ! Gadwala MLA was disqualified by the High Court after it was found that he had submitted a false affidavit. DK Aruna : గద్వాల ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హత - ఎమ్మెల్యేగా డీకే అరుణ !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/24/2c60280c29ead85323ff07cb3c7f05b11692870228521228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
DK Aruna : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తరహాలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా పదవి కోల్పోయారు. కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని.. ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన డీకే అరుణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు... తీర్పు ఇచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని నిర్ధారణ కావడంతో కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హతా వేటు వేసి.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు చెప్పారు. కృష్ణమోహన్ రెడ్డికి మూడు లక్షల జరిమానాను కూడా కోర్టు విధించింది. ఇందులో యాభై వేల రూపాయలు డీకే అరుణకు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.
కొద్ది రోజుల క్రితం కొత్తగూడెం ఎమ్మెల్యేలపైనా ఇలాగే అనర్హతా వేటు వేశారు. దీంతో ఆయన సుప్రీంకర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా తో పోటీలో ఓడిపోయిన జలగం వెంకట్రావు ను ఎమ్మెల్యేగా ప్రకటించారు. కానీ సుప్రీంకోర్టు స్టే వల్ల ప్రమాణస్నీకారం చేయలేకపోయారు. 2018 ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డీకే అరుణ దాదాపుగా 28వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని అనర్హతా వేటు వేయాలని డీకే అరుణ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరుగుతూండగానే ఆమె పార్టీ మరిపోయారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి బీజేపీలో చేరిపోయి.. ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేశారు. ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ నేతగా కొనసాగుతున్నారు.
హైకోర్టు తీర్పును అమలు చేస్తే ఆమె ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అవుతారు. అయితే ఎమ్మెల్యే పదవి కాలం దాదాపుగా ముగిసిపోయే దశకు వచ్చింది. మళ్లీ ఎన్నికల కోసం కేసీఆర్ .. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇందులోనూ.. కృష్ణమోహన్ రెడ్డి అభ్యర్థిగా చోటు దక్కించుకున్నారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చారు. బీఆర్ఎస్ తరపున ఓడిన జలగం వెంకట్రావుకు అనుకూలంగా తీర్పు వచ్చినా.. వనమా సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేవరకూ స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించలేదు. ఇప్పుడు.. సొంత పార్టీ ఎమ్మెల్యేపై అనర్హతా వేటు వేసినందున.. తీర్పును ప్రభుత్వం.. అసెంబ్లీ స్పీకర్ వెంటనే అమలు చేసే అవకాశం ఉండదని.. కృష్ణమోహన్ రెడ్డి కూడా.. సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. సుప్రీంకోర్టులో స్టే లభిస్తే... పదవి కాలం ముగిసిపోయే వరకూ తేలే అవకాశం ఉండదని చెప్పవచ్చు. మొత్తంగా... ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రత్యర్థులపై దాఖలు చేసిన పిటిషన్ల విచారణ చివరి దశకు రావడంతో.. ఊహించని తీర్పులు వస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)