By: ABP Desam | Updated at : 26 Jul 2021 05:29 PM (IST)
Yediyurappa
ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగడం అంతకంటే పెద్ద సవాలే. ఇందుకు యడియూరప్ప రాజకీయ జీవితమే ఉదాహరణ. కర్ణాటక రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఒక్కసారి కూడా ఐదేళ్ల పాటు పూర్తిస్థాయిలో అధికారంలో ఉండలేకపోయారు. రాజకీయ కుట్రలు, అవినీతి ఆరోపణలు.. కారణమేదైనా కావొచ్చు.. సీఎం పీఠం మాత్రం ఆయనకు ముళ్ల కుర్చీ అయ్యింది.
క్లర్క్గా కెరీర్..
బుకనకరె సిద్ధలింగప్ప యడియూరప్ప చదువు పూర్తిచేసుకున్న అనంతరం 1965లో సాంఘిక సంక్షేమ శాఖలో డివిజన్ క్లర్క్గా ఉద్యోగంలో చేరారు. అయితే కొద్ది రోజులకే ఆ ఉద్యోగం వదిలి తన స్వస్థలమైన శిఖారీపురలో ఓ రైస్మిల్లులో క్లర్క్గా చేరారు. ఆ మిల్లు యజమాని కుమార్తె మిత్రాదేవిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత శివమొగ్గ వెళ్లి సొంతంగా హార్డ్వేర్ షాపు పెట్టుకున్నారు. అయితే చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న యడ్డీ.. జనసంఘ్లో చేరారు. 1970 తొలినాళ్లలో జనసంఘ్ శిఖారీపుర తాలుకా చీఫ్గా ఎంపికయ్యారు. అలా రాజకీయాల్లో తొలి అడుగు పడింది.
8 సార్లు ఎమ్మెల్యే..
1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శిఖారీపుర నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి శిఖారీపుర, శివమొగ్గ నుంచి 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. అందులో నాలుగుసార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. మూడు సార్లు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు. ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఏకైక వ్యక్తి యడ్డీనే. అయితే ఎప్పుడూ కూడా పూర్తిస్థాయిలో ఆ పదవిలో ఉండలేకపోయారు.
కర్ణాటకలో 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మాజీ ప్రధాని దేవేగౌడ నేతృత్వంలోని జేడీఎస్తో కలిసి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ రెండేళ్ల తర్వాత యడియూరప్ప తన రాజకీయ చతురతను ఉపయోగించి దేవేగౌడ కుమారుడు కుమారస్వామితో చేతులు కలిపారు. ఫలితంగా సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత జేడీఎస్తో కలిసి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం పదవిని పంచుకోవాలని ఇరు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయి. తొలుత కుమారస్వామి సీఎం అయ్యారు. ఆ తర్వాత 2007 నవంబరులో యడియూరప్ప తొలిసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే సరిగ్గా వారం రోజుల తర్వాత కుమారస్వామి ఒప్పందాన్ని తోసిపుచ్చి కూటమి నుంచి తప్పుకున్నారు. దీంతో యడ్డీ నేతృత్వంలోని భాజపా సర్కారు సంక్షోభంలో పడింది. యడియూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు.
రెండో'సారీ'
2008 అసెంబ్లీ ఎన్నికల్లో యడియూరప్ప నేతృత్వంలోని భాజపా ఘన విజయం సాధించింది. దీంతో ఆయన రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే అదే సమయంలో కర్ణాటక లోకాయుక్త అక్రమ మైనింగ్ కేసులపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించింది. గనుల కేటాయింపుల్లో యడ్డీ అక్రమంగా లాభాలు పొందారని, భూకేటాయింపుల్లో ఆయన కుమారులకు అనుకూలంగా పనిచేశారని ఆరోపణలు వచ్చాయి. ఇవి కాస్త తీవ్ర వివాదాస్పదంగా మారడంతో భాజపా అధిష్ఠానం ఆయనపై ఒత్తిడి తెచ్చింది. దీంతో 2011 జులై 31న ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అంతేగాక, శాసనసభ పదవికి, భాజపా సభ్వత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 'కర్ణాటక జనతా పక్ష' పేరుతో కొత్త పార్టీ ప్రారంభించారు. అయితే 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగి భాజపా గూటికే చేరారు.
మూడురోజులైనా లేకుండా..
దాదాపు పదేళ్ల తర్వాత 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా మళ్లీ సత్తా చాటింది. అయితే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ సాధించలేకపోయింది. అయినప్పటికీ స్వతంత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీంతో ముచ్చటగా మూడోసారి యడియూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఇది కూడా మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు సరైన సంఖ్యాబలం లేకపోవడంతో రెండు రోజులకే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది.
ఏడాదిన్నరకే మళ్లీ సీఎం..
అనేక నాటకీయ పరిణామాల నడుమ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు.. సమన్వయ లోపంతో సతమతమైంది. దీంతో ఏడాదిన్నర కూడా నిలవలేకపోయింది. అధికారకూటమికి చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేయడంతో సంక్షోభం తలెత్తి సంకీర్ణం కూలిపోయింది. దీంతో మళ్లీ భాజపా సర్కారు అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి కొత్త నాయకత్వంపై కాషాయ పార్టీ మొగ్గుచూపినా.. మరోసారి యడ్డీకే అవకాశం కల్పించింది. ఆయన సేవలను గుర్తించి రెండేళ్ల ఒప్పందంతో ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఆ ఒప్పందం నేటితో పూర్తవడంతో యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆయన.. మొత్తంగా 5 ఏళ్ల 75 రోజులు మాత్రమే సీఎం పీఠంపై ఉండటం గమనార్హం..!
Weather Latest Update: తెలంగాణలో ఈవారం ఠారెత్తనున్న ఎండ, ఐఎండీ హెచ్చరిక - ఏపీలో ఈ జిల్లాల్లో వడగాడ్పులు!
ABP Desam Top 10, 4 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
TSPSC Group 1 Exam: జూన్ 4న 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఎన్టీఆర్ హైస్కూల్లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!
Gold-Silver Price Today 04 June 2023: కొండ దిగొచ్చిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?