Breaking News Live Telugu Updates: పవన్ కల్యాణ్కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

Background
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను అరెస్ట్ చేస్తామని వైసీపీ నేతలతో పాటు సీఐడీ పోలీసులు కొద్ది రోజులుగా చేస్తున్న ప్రకటనలు సంచలనంగా మారాయి. ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ ను అరెస్ట్ చేసి తీసుకు వచ్చేందుకు టీమ్ కూడా వెళ్లిందన్నారు. లోకేష్ కనిపించడం లేదని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ అరెస్టు చేయడానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఫైబర్ గ్రిడ్ ఎఫ్ఐఆర్లో అసలు లోకేష్ పేరు లేదన్న సీఐడీ
ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం నారా లోకేష్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో లోకేష్ను అరెస్ట్ చేస్తారనే ఆందోళన తమకుందని లోకేష్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే లోకేష్ను ఇంతవరకూ ఫైబర్ గ్రిడ్ కేసులో నిందితుడిగా చేర్చలేదని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. ఒకవేళ చేరిస్తే ఆయనకు సీఆర్పీసీలోని 41 ఏ కింద నోటీసులు ఇస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. 41 ఏ నిబంధనలు పాటించకపోతే కోర్టుకు విన్నవిస్తామన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కేసులో పదో తేదీన లోకేష్ సీఐడీ విచారణ
ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో లోకేష్ సవాల్ చేశారు. లోకేష్ సిఐడీ విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తూ సిఐడీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సిఐడీ ఇచ్చిన 41 ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో లోకేష్ సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హెరిటేజ్ డాక్యుమెంట్లు అడిగారని.. లోకేష్ హెరిటేజ్లో షేర్ హోల్డర్లు మాత్రమేనన్నారు. వాటిని లోకేష్ ను ఇవి అడగడం సమంజసం కాదని సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాము డాక్యుమెంట్ల పై ఒత్తిడి చేయబోమని, బుధవారమే విచారణకు హాజరు కావాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. అయితే అంత తొందర ఏముందని లోకేష్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనల అనంతరం ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పటి వరకూ అరెస్టు చేసే అవకాశం లేదు.
స్కిల్ కేసులో ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ కక్షపూరిత రాజకీయాల కారణంగానే చంద్రబాబు అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నారని తెలుగుదేశం పార్టీ మండిపడింది. స్కిల్ డెవెలప్మెంట్ కేసులో మంగళవారం సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం స్పందించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు చట్టాన్ని పాటించలేదని ఆ పార్టీ ఆరోపించింది. అవినీతి నిరోధక చట్టం 2018 సవరణ ప్రకారం, మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి ముందు రాష్ట్ర గవర్నర్ నుంచి సీఐడీ అనుమతి పొందాలని, కానీ సీఐడీ వాటిని అమలు చేయకుండానే చంద్రబాబును అరెస్ట్ చేసిందని పేర్కొంది.
చంద్రబాబు నాయుడుపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ విమర్శించింది. సీఐడీ సెక్షన్ 17ఏ ప్రయోగించిందని, చట్టం నిర్దేశించిన విధివిధానాలను పాటించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని మండిపడింది. అవినీతి నిరోధక చట్ట సవరణ తర్వాత అంటే 2018 తర్వాత దర్యాప్తు లేదా కేసు నమోదైతే, గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరని పేర్కొంది. అనుమతి లేకుండా ఏ పోలీసు అధికారి, ఉన్నతాధికారులు పబ్లిక్ సర్వెంట్లను విచారించకూడదని తెలిపింది.
అవినీతి నిరోధక చట్ట సవరణకు ముందు, 2018కి ముందే విచారణ ప్రారంభమైందని జగన్ ప్రభుత్వం చెబుతోందని, కానీ ప్రభుత్వ వాదన ప్రకారం 2018కి ముందే దర్యాప్తు ప్రారంభమైనట్లు ఎలాంటి రుజువు లేదని టీడీపీ ఆరోపించింది. ఒకవేళ ఉంటే ప్రభుత్వ తరఫు న్యాయవాది తప్పనిసరిగా ఆయా పత్రాలను కోర్టుకు సమర్పించాలని, కానీ అలాంటివి ఏవీ సమర్పించలేదంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేనందున, విచారణను మరింత జాప్యం చేసేందుకు కోర్టు అడిగిన పత్రాలను సమర్పించడానికి అదనపు సమయాన్ని కోరుతోందని విమర్శించింది. దీని వెనక ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించింది.
చంద్రబాబు నాయుడుని జైలులోనే నిర్బంధించాలనే ఉద్దేశ్యంతో కోర్టు ఆదేశించిన పత్రాలను సమర్పించేందుకు సమయం కోరడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోందని టీడీపీ ఆరోపించింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఎలా నరకయాతన పెడుతోంది అనడానికి ఇదే నిదర్శనమని, కేవలం ఆరోపణల ఆధారంగా పలుమార్లు అరెస్టులు చేసి టీడీపీ నేతలను సుదీర్ఘ కాలంగా జైలులో ఉంచేందుకు చూస్తోందని మండిపడింది. ఇలా చేయడం ద్వారా ఎన్నికల ముందు టీడీపీ నాయకత్వాన్ని దెబ్బకొట్టాలనే వ్యూహంతో జగన్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని ధ్వజమెత్తింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను మళ్లీ సోమవారానికి (అక్టోబరు 9) వాయిదా పడింది. ఈ సందర్భంగా హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోపు తమకు కూడా సమర్పించాలని సీఐడీ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఇటీవల ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
నేడు (అక్టోబరు 3) సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు, సిద్ధార్థ లుథ్రా, హరీశ్ సాల్వే, అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా చంద్రబాబుపై కేసు నమోదు చేశారని లాయర్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతీకారానికి వ్యతిరేకంగా సెక్షన్ 17ఏ తీసుకొచ్చారని.. ఈ కేసులో ఆ సెక్షన్ వర్తిస్తుందా? లేదా? అన్నదే ప్రధానమని అన్నారు. ఆరోపణలు ఎప్పుడు వచ్చాయనేది కాదని.. కేసు నమోదు, విచారణ ఎప్పుడు అనేది చర్చించాలని హరీశ్ సాల్వే వాదించారు.
పవన్ కల్యాణ్కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు
పెడన సభలో అసాంఘిక శక్తులతో దాడులు చేయించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. అలాంటి సమాచారం మీ వద్ద ఉంటే సాక్ష్యాలు సమర్పించాలని ఆయనకు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ సమాచారానికి బేస్ ఏంటని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయడం సరికాదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా కౌంటర్ ఇచ్చారు. తాము ఇచ్చిన నోటీసులకు రిప్లై రాలేదని అలా రాని పక్షంలో ఆయన చేసిన ఆరోపణలు నిజం కావని అభిప్రాయపడాల్సి ఉంటుందన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారాయణ పిటిషన్పై విచారణ వాయిదా
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ తన ఇంటి వద్దే ప్రశ్నించాలని మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ కేసు వేేరే బెంచ్కు ట్రాన్స్ఫర్ చేయాలని జడ్జి కోరడంతో విచారణ వాయిదా పడింది. అనారోగ్య కారణంగా తన ఇంటి వద్దే ప్రశ్నించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో నారాయణ పిటిషన్ వేశారు. దీనిపై విచారించాల్సిన న్యాయమూర్తి ఈ కేసును వేరే బెంచ్కు బదిలీ చేయాలని సూచించడంతో కేసు విచారణ వాయిదా పడింది. మరో రెండు రోజులు నారాయణపై ఎలాంటి ఒత్తిడి చేయొద్దని సీఐడీకి ఆదేశించారు.





















