Revanth Reddy: సినీ పరిశ్రమలో వివాదాలు వద్దు, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది: రేవంత్ రెడ్డి
సినీ పరిశ్రమలో వివాదాలు వద్దు అనే ఉద్దేశంతోనే సినీ కార్మికుల సమ్మె విరమించాలని చొరవ చూపినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కార్మికుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలి అన్నారు.

Tollywood Workers Strike | హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, టాలీవుడ్ అభివృద్ధికి తన వంత సహకారం ఎప్పటికీ ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సినీ కార్మికుల సమ్మె పరిష్కారానికి సహకరించిన రేవంత్ రెడ్డికి టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు ధన్యవాదాలు తెలిపారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పలువురు సినీ నిర్మాతలు, దర్శకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమ ప్రాధాన్యత, అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను వివరించారు.
త్వరలోనే సినీ కార్మికులతో రేవంత్ భేటీ
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “సినిమా పరిశ్రమలో పని వాతావరణం సానుకూలంగా ఉండాలి. త్వరలోనే సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడతాను. ప్రభుత్వం నుంచి పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుంది. కొత్తగా పరిశ్రమలోకి వచ్చే వారికి నైపుణ్యాలు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి. ఈ క్రమంలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేయడం మంచిదని భావిస్తున్నాను” అని చెప్పారు.

అంతేకాకుండా, స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయికి చేరిందని, తెలంగాణలో ఇది అత్యంత ముఖ్యమైన పరిశ్రమగా నిలిచిందని గుర్తు చేశారు. ఇటీవల కార్మికుల సమ్మె విరమణలో ప్రభుత్వం చొరవ చూపిందని, భవిష్యత్తులో నిర్మాతలు–కార్మికుల అంశంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరం
సినిమా కార్మికుల పట్ల నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని, నిర్మాతలు, కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. “సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరం ఉంది. పరిశ్రమకు కావలసిన అంశాలను సమగ్రంగా లిఖించుకునే కొత్త పుస్తకాన్ని సిద్ధం చేద్దాం. ఎవ్వరైనా వ్యవస్థలను నియంత్రించడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వం సహించదు. అందరూ చట్ట పరిధిలోనే పని చేయాలి. హైదరాబాద్లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణలు జరుగుతున్నాయని, తెలుగు సినిమాల షూటింగ్ ఎక్కువగా తెలంగాణలోనే జరిగేలా చూడండి. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను నిలబెట్టడమే తమ ధ్యేయం” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

జూబ్లీ హిల్స్లోని నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తెలుగు సినిమా ప్రముఖులు కలిశారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ నిర్మాతలలో అల్లు అరవింద్, డి. సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని, వంశీ, బాపినీడు, డివివి దానయ్య, గోపి, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేన్, రాధామోహన్, దాము తదితరులు పాల్గొన్నారు.
దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల ఉన్నారు.





















