శకపురుషుడు' ప్రతి ఇంటిలో ఉండదగ్గ పుస్తకం: ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ సమావేశంలో వక్తలు
మొన్నటివరకూ ఎన్టీఆర్ శతాబ్ధి ఉత్సవాల పేరుతో ఆయనకు ఘన నివాళి ప్రకటించగా ఇప్పుడు శకపురషుడు అనే పేరుతో ఓ ప్రత్యేక సంచికను ఎన్.టి.ఆర్. సెంటినరీ కమిటీ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా వక్తలు ఎన్టీఆర్ కొనియాడారు

Sakapurushudu NTR: ప్రముఖ నటుడు, రాజకీయ వేత్త నందమూరి తారకరామారావు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఎన్.టి.ఆర్. శాసన సభ, చారిత్ర ప్రసంగాలతో పాటు శకపురషుడు ప్రత్యేక సంచికపై సమాలోచనను ఎన్.టి.ఆర్. సెంటినరీ కమిటీ జూలై 2న సమావేశమైంది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయేంద్రప్రసాద్.. ఎన్.టి.ఆర్. సినిమా, రాజకీయ జీవితంపై వెలువడిన శకపురుషుడు లాంటి ఆయన ప్రసంగాల పుస్తకాలను ఈ తరం తప్పకుండా చదవాలని, ఎన్.టి.ఆర్. నుంచి స్ఫూర్తి పొందాలని చెప్పారు. కాగా ఈ సభలో కమిటీ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, దొప్పలపూడి రామ్ మోహన రావు, డి. మధుసూదన రాజు, మండవ సతీష్, శ్రీపతి సతీష్, కాట్రగడ్డ ప్రసాద్, విక్రమ్ పూల తదితరులు పాల్గొన్నారు. ఈ సభను సీనియర్ జర్నలిస్ట్, కమిటీ సభ్యుడు భగీరథ సమర్థవంతంగా నిర్వహించారు.
ఎన్.టి.ఆర్. శకపురుషుడు..
ఇక ఎన్టీఆర్ గొప్పతనాన్ని, ఆయన చేసిన సేవలను కొనియాడిన రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్.. తెలుగు జాతికి గుర్తింపు, గౌరవనాన్ని తీసుకొచ్చిన మహనీయ నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు అని ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ తెలుగు జాతికి ఎప్పటికీ స్పూర్తినిస్తూనే ఉంటారని, ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్.టి.ఆర్. శకపురుషుడని ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
ప్రతిపక్షాలను ఐక్యం చేసిన ఘనత ఎన్.టి.ఆర్.ది..
ఎన్టీఆర్ పేద ప్రజల అభ్యున్నతి కోసం విశేషమైన కృషి చేశారని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ చెప్పారు. ముఖ్యమంత్రిగా అలాంటి వారు ప్రపంచంలోనే అరుదుగా ఉంటారని కొనియాడారు. ఆయన ఏది అనుకుంటే అది సాధించే దాకా నిద్రపోరని, 40 సంవత్సరాల క్రితమే ప్రతిపక్షాలను ఐక్యం చేసిన ఘనత ఎన్.టి.ఆర్.ది అంటూ జయప్రకాశ్ నారాయణ చెప్పుకొచ్చారు. కమిటీ వెలువరించిన ఈ మూడు గ్రంథాలు ఎన్.టి.ఆర్. వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని తెలియజేస్తాయన్న ఆయన.. ఈ గ్రంథాలు ప్రజలందరికి చేరాలని తాను కోరుకుంటున్నట్టు ఈ సందర్భంగా జయప్రకాశ్ నారాయణ తెలిపారు.
శకపురుషుడు ప్రతి ఇంటిలో ఉండదగ్గ పుస్తకం
ఎన్.టి.ఆర్. తనకు దైవంతో సమానమని డా. పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఆయనతో పనిచేసే అవకాశం. అదృష్టం కలిగాయని, ఆయన శతాబ్ది సందర్భంగా కమిటీ వెలువరించిన మూడు గ్రంథాలలో శకపురుషుడు అత్యున్నతమైనదని చెప్పారు. అలాంటి గ్రంథాన్ని ఈ తరం పాఠకులకు అందించినందుకు కమిటీని అభినందిస్తున్నాని గోపాలకృష్ణ తెలిపారు. శకపురుషుడు ప్రతి ఇంటిలో ఉండదగ్గ పుస్తకమన్నారు.
అది నాకు ఎప్పటికీ ముధుర స్మృతే..
ఎన్టీఆర్ తో నటించే అవకాశం రాకపోయినా ఆయనను మూడు సార్లు కలిశామని, ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారని, అది తన జీవితంలోనే మరచిపోలేనని నటుడు సుమన్ చెప్పారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం తీసుకువచ్చినపుడు చాలా స్ఫూర్తి పొందానన్నారు. ఆ స్ఫూర్తితోనే లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చానని, ఆ ఆనందం తనకు ఎప్పటికీ ముధుర స్మృతిగా మిగిలిపోతుంది చెప్పారు.
ఎన్టీఆర్ నిజంగా దైవాంశ సంభూతుడు..
ఎన్.టి.ఆర్.ను కలవకపోయినా.. దూరంగా చూస్తేనే జీవితం ధన్యమైపోతుందనుకున్న రోజులున్నాయని దర్శకుడు బి. గోపాల్ చెప్పారు. అలాంటిది అడవి రాముడు సినిమా షూటింగ్ సమయంలో ఆయన పక్కనే నిలబడి క్లాప్ కొట్టే అవకాశం వచ్చిందని, జీవితంలో ఈ తృప్తి, ఈ ఆనందం చాలని అనుకున్నానన్నారు. ఎన్టీఆర్ నిజంగా దైవాంశ సంభూతుడని గోపాల్ కొనియాడారు.
అవే మాకు వారసత్వంగా వచ్చాయి..
నాన్నగారి శతాబ్ది ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా జరగటం తమ కుటుంబానికి ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలగజేశాయని నందమూరి రామకృష్ణ చెప్పారు. తన వివాహం తిరుపతిలో జరిగినప్పుడు నాన్నగారు స్వయంగా రాలేదని బాధపడ్డా.. ఆయన ప్రజల కోసం ప్రచారంలో ఉన్నాడని తెలిసి గర్వపడ్డామని చెప్పారు. నాన్నగారి కృషి, పట్టుదల తమకు వారసత్వంగా వచ్చాయని రామకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.
ఎనిమిది నెలలు అవిశ్రాంతంగా శ్రమించాం..
అన్నగారి శతాబ్ది సంవత్సరంలో ఆయనకు నివాళిగా ఏదైనా చేయాలనే సంకల్పంతో ఒక కమిటీగా ఏర్పాటయ్యామని, అన్నగారి శాసనసభ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలు, శకపురుషుడు పుస్తకాలు తీసుకు రావటానికి ఎనిమిది నెలలు అవిశ్రాంతంగా శ్రమించామని కమిటీ ఛైర్మన్ టి.డి. జనార్ధన్ తెలిపారు. కమిటీ సభ్యులంతా నిబద్ధతతో పనిచేశారన్న ఆయన.. ఇప్పుడు ఆ పుస్తకాలను అందరూ ప్రశంసిస్తుంటే తమకెంతో సంతోషంగా, సంతృప్తిగా ఉందని తెలిపారు. ఎన్టీఆర్ గారి వంద అడుగుల విగ్రహాన్ని తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టించాలనే సంకల్పంతో ఈ కమిటీ పనిచేస్తుందని, ఈ కమిటీని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు.
Read Also : Trivikram- Allu Arjun New Movie: ఇట్స్ అఫీషియల్ - బన్నీతో త్రివిక్రమ్ నాలుగో మూవీ, హీరోయిన్ ఆమేనా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

