Madhura Sreedhar Reddy: సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
Tollywood Producers Issues: నిర్మాతలు సమస్యలు సమస్యలు అని చెప్పడం వల్ల ఇండస్ట్రీ పరువు పోతుందని, సినిమా బిజినెస్ వర్కవుట్ అవ్వకపోతే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపొమ్మని మధుర శ్రీధర్ ట్వీట్ చేశారు.

- సినిమా పరిశ్రమలో సమస్యలు, నష్టాలు సహజమని మధుర శ్రీధర్ రెడ్డి అన్నారు.
- పరిస్థితులు అనుకూలంగా లేకపోతే సినిమాలు తీయవద్దని సూచించారు.
- సింగిల్ స్క్రీన్స్ లో కూడా మల్టీప్లెక్స్ ల మాదిరి పర్సెంటేజ్ విధానం ఉండాలి.
- సినిమా వ్యాపారమే కానీ దాతృత్వం కాదని స్పష్టం చేశారు.
సమ్మర్ సీజన్లో వచ్చిన సినిమాలు తక్కువ... సింగిల్ స్క్రీన్ ఓనర్స్ & ఎగ్జిబిటర్స్ వర్సెస్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ గొడవ పుణ్యమా అంటూ వార్తల్లో నిలించింది ఎక్కువ. కలెక్షన్లలో పర్సెంటేజ్ డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్స్ మీడియా ముందుకు వచ్చిన తర్వాత నిర్మాతలు సైతం చిత్రసీమలో సమస్యలను ఏకరువు పెడుతున్నారు. అలా చేయడం వల్ల ఇండస్ట్రీ పరువు పోతుందని దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి (Madhura Sreedhar Reddy) 'ఎక్స్'లో ట్వీట్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?
ఇదేమీ భారతీయ సంక్షోభం... ప్రపంచ సమస్య కాదు!
ఏ బిజినెస్లోనైనా రిస్కులు, ఒత్తిడులు, నష్టాలు సహజమని, వాటిని ముందే అర్థం చేసుకుని ఎవరైనా ఆ రంగంలోకి వస్తారని, సినిమా కూడా అంతేనని మధుర శ్రీధర్ రెడ్డి అన్నారు. నిజంగా పరిస్థితులు అనుకూలంగా లేవని అనిపిస్తే సినిమాలు తీయకండని మధుర శ్రీధర్ రెడ్డి సూచించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోండి. కానీ ప్రతిసారీ మైకు ముందు వచ్చి 'సమస్యలు... సమస్యలు' అంటూ ఏడవడం వల్ల ఇండస్ట్రీ పరువు మాత్రమే పోతుంది. ఇదేదో ప్రపంచ సమస్య అయినట్టు… భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం అయినట్టు… (చేస్తున్నారు)'' అని పేర్కొన్నారు.
సినిమా అనేది ఒక బిజినెస్… ఛారిటీ కాదు!
''సిన్సియర్గా సినిమాలు తీయండి. వర్కౌట్ అయితే ఉండండి… వర్కౌట్ కాకపోతే బయటికి వెళ్లి వేరే బిజినెస్ చేసుకోండి'' అని మధుర శ్రీధర్ రెడ్డి సూటిగా చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఒక సినిమాలో నష్టం వస్తే? ఆ నష్టాన్ని తట్టుకునే శక్తి ఉంటే ఇంకో సినిమా తీయండి. లేకపోతే ఆగిపోండి. మీ సమస్యలు, మీ కంపెనీ సమస్యలు, మీ వ్యక్తిగత సమస్యలు అన్నీ కూడా సినిమాపై రుద్దకండి. సినిమా ఒక అద్భుతమైన మీడియం. దాన్ని బాధల వేదికగా మార్చొద్దు'' అని చెప్పారు. సిన్సియర్గా సినిమాలు తీయమని, ప్రతి మంచి సినిమాకు ప్రేక్షకుల్లో ఒక మంచి స్థానం తప్పకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సినిమా అనేది ఒక బిజినెస్ అని, ఛారిటీ కాదని ఆయన తెలిపారు.
పర్సెంటేజ్కు ఓటు వేసిన మధుర శ్రీధర్ రెడ్డి!
రెంటల్ సిస్టమ్ వర్సెస్ పర్సెంటేజ్ మీద కూడా మధుర శ్రీధర్ రెడ్డి తన ఆలోచన, అభిప్రాయాలను సూటిగా చెప్పారు. ''మల్టిప్లెక్సులలో ఎలా అయితే పర్సెంటేజ్ సిస్టమ్ అమలులో ఉందో... సింగిల్ స్క్రీన్స్లో కూడా అదే విధానం ఉండాలి. ఎంత పర్సెంటేజ్ ఉండాలనేది నిర్ణయించాలి. కచ్చితంగా పర్సెంటేజ్ సిస్టమ్ ఉండాలి'' అని పేర్కొన్నారు శ్రీధర్.
ఇన్నేళ్ళూ రెంట్ లేదా పర్సెంటేజ్, రెంట్ కమ్ పర్సెంటేజ్ అంటూ అటూ ఇటూ ఉన్న విధానాలతో ఇండస్ట్రీని కన్ఫ్యూజ్ చేశారని, కనీసం ఇప్పుడైనా స్పష్టమైన, ప్రొఫెషనల్ బిజినెస్ మోడల్ను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు




















