Breaking News 25 September: హైదరాబాద్ లో భారీ వర్షం... ఇళ్ల నుంచి బయటకు రావొద్దని నగరవాసులకు జీహెచ్ఎంసీ సూచన
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 25న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు ప్రమాదం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుపానుగా మారి ఉత్తరాంధ్రలోని విశాఖ, ఒడిశాలోని గోపాలపుర్ల మధ్య ఈనెల 26న తీరం దాటే అవకాశముంది. ఈ తుపానుకు పాకిస్థాన్ పెట్టిన ‘గులాబ్’ అనే పేరును ఖరారుచేసే అవకాశాలున్నాయి. శుక్రవారం రాత్రి వాతావరణ విభాగం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం... బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి శుక్రవారం వాయుగుండంగా మారింది.
హైదరాబాద్ లో భారీ వర్షం... ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ సూచన
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్పేట్, కాచిగూడ, గోల్నాక, ఖైరతాబాద్, హిమాయత్నగర్, పంజాగుట్ట, అమీర్పేట, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్రోడ్, లక్డీకాపూల్, కోఠి, అబిడ్స్, దిల్సుఖ్నగర్, సరూర్నగర్, సైదాబాద్, కూకట్పల్లి, ఆల్విన్ కాలనీ, హైదర్నగర్, ప్రగతినగర్, నిజాంపేటలో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్లో రాత్రి 9 గంటల వరకు వర్షం పడే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. నగర వాసులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపింది. సాయం కోసం 040-29555500 కు సంప్రదించాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అంబర్పేటలో భారీ వర్షం కారణంగా ముసారాంబాగ్ బ్రిడ్జి మీదుగా మూసీ వరదనీరు ప్రవహిస్తోంది. బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం
ఐక్యరాజ్యసమితి 76వ వార్షిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారత్ అని అన్నారు. ప్రపంచం కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. గతంలో ఎన్నడూ చూడని విపత్తు ఇది. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే ప్రపంచం అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయుల ప్రగతి ప్రపంచానికి దోహదం చేస్తుందన్నారు.





















