AP Telangana Rain Live Updates : కవరేజ్ కు వెళ్తూ వరదలో గల్లంతైన ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్
Andhra Pradesh - Telangana Rain Live Updates ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలపై తాజా వార్తలకు ఈ పేజీని చూడండి.

Background
పీ, తెలంగాణలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు పడనున్నట్లుగా భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. మరో మూడు నాలుగు రోజుల పాటు వానలు భారీగా పడనున్నట్లుగా హైదరాబాద్, అమరావతిలోని భారత వాతావరణశాఖ కేంద్రాలు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించాయి. 7, 8, 11 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు ఉండనున్నట్లు అధికారులు అంచనా వేశారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితి
* అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. నిన్న దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతాలపై ఉన్న అల్ప పీడన ప్రాంతం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా తీర ప్రాంతాల్లోకి విస్తరించి దానికి అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల వరకూ విస్తరించి ఎత్తుకు వెళ్లేకొలదీ నైరుతి దిశగా వంగి ఉంటుంది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత గుర్తించే అవకాశం ఉంది.
* రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోటా, గుణ, దామోహ్, పెండ్రా రోడ్, ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతం మీదుగా అల్ప పీడన ప్రాంత కేంద్రం గుండా వెళ్తూ, అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.
* తూర్పు - పశ్చిమ గాలుల కోత దాదాపు ఉత్తర భారత ద్వీపకల్పం అయిన 20 డిగ్రీల ఉత్తర అక్షాంశమైన వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉంది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణం వైపు వంగి ఉంటుంది.
ఉత్తర కోస్తా, యానాంలో ఇలా..
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల పడతాయి. రేపు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు పడే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రలో
ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమలో
ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.
కవరేజ్ కు వెళ్తూ వరదలో గల్లంతైన ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్
జగిత్యాల జిల్లాలో అపశృతి చోటుచేసుకుంది. కవరేజ్ కి వెళ్తూ ప్రముఖ ఛానల్ రిపోర్టర్ వరదలో గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయినా ఇంకా అతని ఆచూకీ లభ్యం కాలేదు. ప్రైవేటు వ్యవసాయ క్షేత్రంలో వరదలో చిక్కుకున్న వారి న్యూస్ కవరేజ్ కి వెళుతుండగా ఓ ప్రముఖ ఛానల్ కు చెందిన జర్నలిస్టు వరద నీటిలో గల్లంతయ్యారు. సహాయక బృందాలు కూలీలను సురక్షితంగా తరలిస్తున్నారనే వార్త తెలిసిన రిపోర్టర్ జమీర్ అక్కడికి తన సహచర మిత్రుడితో కలిసి షిఫ్ట్ కార్ లో వెళ్లారు. రాయికల్ మండలం రామోజీ పేట భూపతిపూర్ గ్రామాల మధ్యన ఉన్న కల్వర్టు పై వరద నీరు ఉద్ధృతంగా వస్తున్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు నీటిలో కొట్టుకుపోయింది. అయితే కారులో ఉన్న మరో వ్యక్తి తప్పించుకోగలిగారు. అతను స్థానికులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
హైదరాబాద్ నెహ్రూ జూపార్కులోకి చేరిన వరద నీరు
హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో జూపార్కులోని సఫారీ పార్కును అధికారులు మూసివేశారు. వరదనీరు తగ్గాక సందర్శకులను అనుమతిస్తామని తెలిపారు. మీరాలం చెరువు పొంగి జూ పార్కు లోకి నీళ్లు చేరాయి.





















