Medaram Jatara 2024: వనదేవతలను దర్శించుకున్న సీతక్క - అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి
Sammakka Saralamma Jatara 2024: తెలంగాణ మంత్రి సీతక్క ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం వెళ్లారు. అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.

Medaram Jatara In Mulugu district: ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, డాక్టర్ దనసరి అనసూయ సీతక్క దర్శించుకున్నారు. మంత్రి సీతక్క సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీతక్క తెలిపారు. ఈ నెల 23 న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని సీతక్క చెప్పారు. గవర్నర్ తో పాటు రాష్ట్రపతి వచ్చే అవకాశాలు ఉన్నాయని సీతక్క అన్నారు. 
తెలంగాణ కుంభమేళా, అతిపెద్ద గిరిజన జాతర మేడారం మహా జాతరకు అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు సమ్మక్క, సారలమ్మ జాతర జరగుతుందని ఆమె తెలిపారు. ఏపీ, తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్నందున వారికి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తుందని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారని చెప్పారు. ఇప్పటికే భక్తులు పెద్దఎత్తున అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అధికారులు జంపన్నవాగుపై స్నాన ఘట్టాలు, క్యూ లైన్లు, తాగునీరు, రోడ్లు, బస్టాండ్ అన్ని పనులు పూర్తి చేసినట్లు మంత్రి సీతక్క వివరించారు.
7 కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఏర్పాటు
మేడారం జాతరకు వచ్చే భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) అన్ని చర్యలు చేపట్టింది. మేడారంలో 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్ ను ఇప్పటికే ఏర్పాటు చేసింది. అక్కడ 7 కిలోమీటర్ల పొడువున 47 క్యూ లైన్ లను సైతం నిర్మిస్తోంది. సమ్మక్క- సారలమ్మలను దర్శనం పూర్తయిన అనంతరం భక్తులను ఈ క్యూ లైన్ల ద్వారా సురక్షితంగా వారి గమ్యస్థానాలకు సంస్థ చేర్చుతుందని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.





















