TMC Congress Merger: కాంగ్రెస్లో తృణమూల్ విలీనం ప్రచారం - ఫైటర్ దీదీ అంత త్వరగా చేతులెత్తేస్తారా?
Mamata Banerjee: బెంగాల్లో మమతా బెనర్జీకి ఎదురవుతున్న పరిస్థితులను తట్టుకోలేకపోతున్నారు. తృణమూల్ ను కాంగ్రెస్లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను పెట్టినట్లుగా చెబుతున్నారు.

Trinamool Congress Rebels: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. దేశ రాజకీయాల్లోనే అత్యంత శక్తివంతమైన ప్రాంతీయ శక్తులలో ఒకటైన తృణమూల్ కాంగ్రెస్ , గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్లో విలీనం కాబోతోందనే వార్త ఇప్పుడు జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. పార్టీలోని కీలక ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేస్తూ రెబల్స్గా మారుతున్న తరుణంలో.. మమతా బెనర్జీ ఈ విధమైన ఆలోచన చేస్తున్నారనే ప్రచారం కోల్కతా రాజకీయ వర్గాల్లో దావానలంలా వ్యాపించింది.
కాంగ్రెస్లో విలీనం కోసమే చర్చలా?
ఈ ప్రచారానికి ఊతమిస్తూ ఇటీవల మమతా బెనర్జీ కాంగ్రెస్ సీనియర్ నేత్రి సోనియా గాంధీతోనూ, అటు పార్టీ సెకండ్-ఇన్-కమాండ్ అభిషేక్ బెనర్జీ నేరుగా రాహుల్ గాంధీతోనూ సుదీర్ఘంగా సమావేశమవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. కేవలం 'ఇండియా' కూటమి సమన్వయం కోసమే ఈ భేటీలు జరిగాయని టీఎంసీ పైకి చెబుతున్నప్పటికీ, అంతర్గతంగా మాత్రం పార్టీ భవిష్యత్తును కాంగ్రెస్తో ముడిపెట్టేలా పెద్ద వ్యూహమే నడుస్తోందని బెంగాలీ రాజకీయవర్గాలు కోడై కూస్తున్నాయి.
ఫైటర్ దీదీ ఇంత త్వరగా చేతులెత్తేస్తారా?
అయితే, రాజకీయాల్లో సుదీర్ఘ పోరాటాల చరిత్ర ఉన్న, ఒంటిచేత్తో లెఫ్ట్ ఫ్రంట్ను, ఆ తర్వాత బీజేపీ అశ్వమేధాన్ని అడ్డుకున్న మమతా బెనర్జీ లాంటి ఫైటర్ అంత సులభంగా చేతులెత్తేస్తారా? అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ శ్రేణులకు, కాంగ్రెస్ క్యాడర్కు దశాబ్దాలుగా తీవ్రమైన వైరుధ్యం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు ఇరు పార్టీల కార్యకర్తలు క్షేత్రస్థాయిలో రక్తం చిందించుకున్నారు. ఇలాంటి స్థితిలో విలీనం అనేది గ్రౌండ్ లెవెల్లో తీవ్ర ప్రతిఘటనకు దారితీసే ప్రమాదం ఉంది.
తిరుగుబాటుదారులు తమదే అసలైన తృణమూల్ అని ప్రకటించుకునే చాన్స్
ఈ విలీన ప్రచారానికి అసలు కారణం పార్టీలో పెరుగుతున్న అంతర్గత అసమ్మతి, కేంద్ర సంస్థల దర్యాప్తు ఒత్తిళ్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ మమతా బెనర్జీ విలీనానికి మొగ్గు చూపితే, పార్టీలోని ఒక పెద్ద రెబల్ వర్గం బయటకు వచ్చి నిజమైన తృణమూల్ మాదే అంటూ తిరుగుబాటు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే మమతా నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కొందరు సీనియర్లు, ఈ పరిణామాన్ని సాకుగా తీసుకుని పార్టీ సింబల్పై హక్కుల కోసం లేదా బీజేపీ వైపు వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
జాతీయ రాజకీయాలకు మారిపోవాలని దీదీ ప్లానా?
మరోకోణంలో చూస్తే.. ఇది మమతా బెనర్జీ చేతులెత్తేయడం కాదు, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వేస్తున్న 'మాస్టర్ స్ట్రోక్' అని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. ప్రాంతీయ పార్టీగా ఉంటే బెంగాల్ దాటి ప్రభావం చూపలేమని, అదే కాంగ్రెస్లో విలీనమైతే జాతీయ స్థాయిలో మోదీని ఢీకొట్టే ప్రధాన శక్తిగా మారవచ్చని అభిషేక్ బెనర్జీ భావిస్తున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ నాయకత్వానికి మమతా ఇమేజ్ తోడైతే, అది జాతీయ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తుందనేది ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం కావచ్చు.
ఎన్నో సవాళ్లు కూడా ఉంటాయి!
ఈ విలీనం అనేది సిద్ధాంతపరంగా ఎంత ఆకర్షణీయంగా కనిపించినా, ఆచరణలో మాత్రం కత్తిమీద సామే. క్షేత్రస్థాయిలో బెంగాలీ అస్తిత్వాన్ని నమ్ముకున్న టీఎంసీ కార్యకర్తలు, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ జెండాను మోయడానికి ఎంతవరకు సిద్ధపడతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ మమతా, సోనియాల చర్చలు సఫలమై విలీనం వైపు అడుగులు పడితే, బెంగాల్లో మరో రాజకీయ చీలిక ఖాయంగా కనిపిస్తోంది. అటువంటప్పుడు రెబల్స్ వర్గం 'అసలైన టీఎంసీ'గా అవతరించి బెంగాల్ పీఠం కోసం కొత్త పోరాటానికి తెరలేపడం ఖాయం.
ట్రెండింగ్ వార్తలు






















