Viral News: రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల తరువాత నిర్దోషిగా తీర్పు, అంతలోనే విషాదం
Gujarat High Court: 20 రూపాయల లంచం కేసులో ఒక కానిస్టేబుల్ దశాబ్దాలపాటు జైలు శిక్ష అనుభవించాడు. 30 ఏళ్ల తర్వాత కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. మరుసటి రోజు గుండెపోటుతో చనిపోయాడు.

న్యాయం గెలిచింది.. కానీ మనిషి ఓడిపోయాడు: 30 ఏళ్ల పోరాటం తర్వాత విషాదాంతం
అహ్మదాబాద్: భారత న్యాయ వ్యవస్థలో కేసుల విచారణలో జరిగే జాప్యం ఒక్కోసారి మనుషుల జీవితాన్ని తలకిందులు చేస్తుంది. కొన్ని సందర్భాలలో ప్రాణాలు పోయాక సైతం తీర్పులు వచ్చిన కేసులు చాలానే ఉన్నాయి. గుజరాత్లో దాదాపుగా అలాంటి ఘటన ఒకటి తాజాగా జరిగింది. కేవలం 20 రూపాయల లంచం తీసుకున్నారనే ఆరోపణలతో 30 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేసిన ఒక మాజీ పోలీసు కానిస్టేబుల్ ఎట్టకేలకు నిర్దోషి అని నిరూపించుకున్నాడు. కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిన మరుసటి రోజే గుండెపోటుతో కన్నుమూయడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన హాలీవుడ్ క్లాసిక్ 'ది షాషాంక్ రిడెంప్షన్' కథను తలపిస్తోంది.
అసలేం జరిగింది?
అహ్మదాబాద్లో పోలీసు కానిస్టేబుల్గా పనిచేస్తున్న బాబూభాయ్ ప్రజాపతి 20 రూపాయల లంచం తీసుకున్నారనే ఆరోపణతో 1996లో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. 1997లో ఛార్జ్షీట్ దాఖలు కాగా, 2004లో సెషన్స్ కోర్టు ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 3,000 జరిమానా విధించింది. తాను ఏ తప్పు చేయలేదని, సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ అప్పీలు ఏకంగా 22 ఏళ్ల పాటు పెండింగ్లో ఉండిపోయింది.
చివరి క్షణంలో న్యాయం
ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరి 4న గుజరాత్ హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. సాక్ష్యాధారాల్లో పొంతన లేదని, ప్రాసిక్యూషన్ ఆరోపణలను నిరూపించడంలో విఫలమైందని పేర్కొంటూ మాజీ పోలీస్ కానిస్టేబుల్ బాబూభాయ్ను నిర్దోషిగా విడుదల చేసింది. తీర్పు విన్న ఆయన ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. నా జీవితంపై పడిన పెద్ద మచ్చ తొలగిపోయింది, ఇప్పుడు దేవుడు నన్ను తీసుకువెళ్లినా బాధ లేదు అని తన లాయర్ వద్ద కన్నీరు పెట్టుకున్నారు.
20 ఏళ్లకు న్యాయం గెలిచింది.. ప్రాణం పోయింది..
కోర్టు తీర్పుతో తన గౌరవం తిరిగి దక్కిందన్న సంతోషంతో బాబూభాయ్ ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజే ఆయన గుండెపోటుతో చనిపోయారు. చేయని తప్పిదానికి 30 ఏళ్లు ఎంతో నరకయాతన అనుభవించి, సుదీర్ఘ పోరాటం తర్వాత దక్కిన విజయాన్ని అనుభవించకుండానే బాబూభాయ్ కన్నుమూయడం ఆయన కుటుంబాన్ని, ఆయన లాయర్లను తీవ్రంగా కలిచివేసింది. న్యాయం ఆలస్యమవ్వడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే అనే మాటకు ఈ ఘటన ఒక నిదర్శనం అని అతడి కుటుంబసభ్యులు అంటున్నారు.




















