YSRCP ON AMARAVATI: మీరేంటో.. మీ విధానాలేంటో... అంతా MAVIGUN
అమరావతిపై ఏదో చేయాలనుకుని ఇంకేదో చేస్తోంది YSRCP. రాజధాని విషయంలో ఆ పార్టీ స్టాండ్ సొంత కార్యకర్తలను కూడా కన్విన్స్ చేయలేకపోతోంది.

అమరావతికి అనుకూలమే.. కానీ చట్టబద్దతకే వ్యతిరేకం..!
అమరావతిని వద్దనం... కానీ పార్లమెంట్లో వ్యతిరేకిస్తాం..!
అమరావతి కావాలనే అంటాం.. .. అవసరమైతే మళ్లీ మారుస్తాం..!!!
ఇదీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఆ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షం.. YSRCP తీరు. కొన్ని రోజులుగా ఇదే వరుస. ఏదో చెప్పాలనుకుంటారు.. కానీ ఇంకేదో అంటుంటారు. అమరావతికి మేం వ్యతిరేకం కాదు కదా.. అని ఓ ముఖ్యనేత అంటే అదే పార్టీలోని సీనియర్ నేతలు అన్నీ అమరావతిలో పెడితే మేం అడుక్కోవాలా అంటారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై చులకనగా మాట్లాడతారు. ఇవన్నీ ఒకెత్తేతే.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఓ కొత్త థియరీ తెచ్చారు. అమరావతి కాదు మాకు MA VI GUN కావాలంటున్నారు. పేరు చూడగానే ఏదోలా అనిపిస్తుంది కానీ ఇది జగన్మోహనరెడ్డి ప్రతిపాదించిన రాజధాని ప్రాంతం.
జగన్ రాజధాని MAVIGUN
జగన్ మోహనరెడ్డి YSRCP తరపున ప్రతిపాదిస్తున్న భవిష్యత్ రాజధాని ప్రాంతం MAVIGUN అదెక్కడ నుంచి వచ్చిందంటారా.. ? ఇప్పుడున్న అమరావతి రాజధాని ప్రాంతాన్ని మచిలీపట్నం దాకా విస్తరించి మచిలీపట్నంలో MA,విజయవాడలో VI, గుంటూరులో GUN కలిపి MAVIGUN అని చెప్పారు. ప్రతిపాదన బాగానే ఉంది కానీ పేరే కాస్త ఏదోలా ఉంది. "ఈ పేరు వింటే జగన్ గుర్తొస్తాడు అని మీకు అనిపిస్తే మీకు నచ్చిన పేరు పెట్టుకోండి" అనే ఆప్షన్ కూడా జగన్ ఇచ్చారు. కాబట్టి ఈ ప్రతిపాదనను తీసుకోవాలంట...సరే ఇప్పుడు అమరావతికి చట్టబద్దత కల్పించే ఏపీ పునర్విభజన చట్టానికి సవరణ కూడా జరిగి రాజధాని అమరావతి అనే పేరును శాసన ప్రక్రియ ద్వారా దఖలు పరిచేశారు కాబట్టి ఇప్పుడు ఈ MAVIGUN తో పనుండక పోవచ్చు. కానీ రాజధాని విషయంలో జగన్ , ఆయన పార్టీ పోకడ ఏంటన్నదనే విషయాన్ని మాత్రం ఈ సంఘటన చాటుతోంది.
రాజధానిగా అమరావతిని 12 ఏళ్ల కిందట ఖరారు చేసిన తర్వాత దానిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన విషయం అందరికీ తెలుసు. మూడు రాజధానుల పేరుతో అప్పటి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను హైకోర్టు, సుప్రీంకోర్టు అడ్డుకున్నాయి. జగన్ ప్రభుత్వ పతనానికి అమరావతిని తొక్కేయడం అనేది ఓ ముఖ్య కారణం. రాజధానిగా అమరావతిని తొలగించే ప్రయత్నం జరిగినందునే దానికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పించేందుకు ఇవాళ ప్రయత్నం చేశారు. ఇలాంటి సందర్భంలో ఆ పార్టీ తాము చట్టబద్ధతకు అనుకూలమా.. కాదా అన్న క్లియర్ స్టాండ్ చెప్పాల్సి ఉంది. కానీ ఇవాళ కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు.
రాజధానిపై రోజుకోమాట...
రాజధానిపై YSRCPకి ఓ నిర్ధిష్టమైన విధానం లేదన్నది స్పష్టం. 2019లో అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ల తర్వాత అమరావతిపై వ్యతిరేకతను తమ చర్యలు, మాటల ద్వారా వ్యక్తం చేశారు. అమరావతిని స్మశానం అంటూ వ్యాఖ్యలు కూడా చేశారు. మూడు రాజధానులు అని చెబుతున్నప్పటికీ... అమరావతిని అడ్డుకోవడమే అసలు విషయం అన్నది అందరికీ అర్థం అయింది. మొదట మూడు రాజధానులు అని.. ఆ తర్వాత విశాఖనే రాజధాని అన్నారు. ఆ ప్రయోగం ఫెయిల్ అయిన తర్వాత అయినా అమరావతిపై ఆ పార్టీ తమ విధానమేంటో క్లియర్గా ప్రకటించడం లేదు. ఎన్నికల తర్వాత తొలిసారిగా అమరావతిపై స్పందించిన జగన్... ఇంత పెద్ద రాజధాని అవసరం లేదు..గుంటూరు- నాగార్జునసాగర్ మధ్యలో 500 ఎకరాల్లో రాజధాని కట్టమని సలహా ఇచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఓ కాంక్లేవ్లో ఆ పార్టీ ముఖ్యనేత సజ్జల.. "అమరావతిని గుర్తిస్తున్నాం కదా.." అన్నారు. అంటే రాజధానిగా అమరావతిని ఆ పార్టీ అంగీకరిస్తున్నట్లే అనుకున్నారు. అయినా ఆ తర్వాత కూడా మళ్లీ మాటల్లో మార్పులొస్తున్నాయి. ఇవాళ జగన్ ప్రెస్మీట్ను..లోక్సభలో వైఎస్సార్సీపీ అనుసరించిన విధానాన్ని చూస్తే.. కొన్ని సందేహాలు వస్తాయి.
- రాజధానిగా అమరావతి ఉండటం అభ్యంతరం లేదంటున్నారు. అలాంటప్పుడు చట్టబద్ధతకు వచ్చిన ఇబ్బంది ఏంటి..?
- అమరావతికి మేం ఎప్పుడూ వ్యతిరేకం కాదు అన్నారు.. అమరావతిని శాసనపరంగా దఖలు పరుస్తున్నప్పుడు వైసీపీ ఎందుకు వాకౌట్ చేసింది.
- ఓ పక్క రాజధాని ప్రాంతాన్ని నోటిఫై చేస్తున్నప్పుడు.. కొత్తగా ఇంకో ప్లేసులు పేర్లు చెప్పి కన్ఫ్యూజన్ ఎందుకు సృష్టించడం?
- అమరావతికి ఎప్పుడూ వ్యతిరేకం కానప్పుడు.. 2019-24 మధ్యలో దానిని ఎందుకు అభివృద్ధి చేయలేదు. ?
- గడచిన ప్రభుత్వంలో జగన్ ఒక్కసారి కూడా అమరావతికి అనుకూలంగా ఎందుకు మాట్లాడలేదు. ఇప్పుడు చెబుతున్న మాటలు ఆరోజు ఎందుకు లేవు?
- రెండు రోజుల కిందట పార్టీ సీనియర్ నేతలు అమరావతి హోద కల్పించడం.. నిధులు కేటాయించడాన్ని తప్పు పట్టారు.అన్నీ అమరావతికి చేస్తే... మేం అడుక్కుతినాలా అని ధర్మాన ఎందుకు అన్నారు..?
- అన్నింటి కంటే ముఖ్యంగా అమరావతిపై తమకు ద్వేషం లేదంటూనే.. చట్టాన్ని తీసుకొస్తే.. దానిని మళ్లీ సవరించలేరా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం..
అమరావతిపై జెన్యూనిటీ ఉంటే
అమరావతిపై YSRCP వాదనలో జెన్యూన్గా కనిపిస్తున్న అంశాలు మూడు.. కానీ వాటిలో కూడా వైరు్ధ్యాలు కనిపిస్తున్నాయి.
1. రాజధాని నిర్ణయం అనేది రాష్ట్రాల విషయం.. ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి..కానీ దానిని తీసుకెళ్లి కేంద్రానికి అప్పగించకూడదు అన్నది. అంతకు ముందు అమరావతి అనే దానిని నిర్ణయించింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే.. దానిని ఏకపక్షంగా మార్చింది జగన్ మోహనరెడ్డే. ఆయన చెప్పినట్లుగానే 6వేల కోట్ల పనులు జరిగాక మార్చారు. ఆ తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చి మళ్లీ ఇంకో ప్లేసుకు మార్చేస్తారాా..? ఇలా మార్చుకుంటూ పోతే... ఇక రాజధాని ఎక్కడుంటుంది. అసలు కేంద్రం చట్ట సవరణ చేయాల్సిన పరిస్థితి కల్పించిందే జగన్
2. అమరావతిలో జరుగుతున్న అవినీతి. ఈ విషయాన్ని జనాలకు అర్థమయ్యేలా బహిరంగపరచొచ్చు. కానీ అవినీతి పేరు చెప్పి ఆ ప్రాంతంలో రాజధాని వద్దనడం ఏంటి.. పైగా మీరు ఇంతకు ముందు సామాజిక వర్గం పేరు చెప్పి వద్దన్నారు. అది ఎంత వరకూ సబబు
3. అమరావతి అనేది ఫెయిల్యూర్ మోడల్. అదో ఐరావతం అవుతుందని అనేది. అదే నిజంగా మీ పార్టీ విధానం, లేదా మూడు రాజధానుల వల్లే లాభం ఉంటుందని కచ్చితంగా నమ్మితే ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పొచ్చు. అమరావతికి చాలా నిధులు కావాలి. వైజాగ్ బెస్ట్ చాయిస్ అని నేరుగానే చెప్పొచ్చు. కానీ ఇప్పటికీ దాగుడు మూతలు ఆడుతున్నారు.
ఇవాళ పార్లమెంట్లో వ్యవహరించిన తీరులో కానీ.. అమరావతిపై జగన్ ఇవాళ మాట్లాడిన దాంట్లో కానీ.. ఏడేళ్లుగా అమరావతి విషయంలో జగన్, ఆయన పార్టీ మారుస్తున్న స్టాండ్స్ కానీ చూస్తే. ఎందుకో ఎక్కడా క్లారిటీ ఉండదు. ఇవాళ ఆ కన్ఫ్యూజన్ మరింత పెంచింది.























