CM Chandrababu: తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, వర్చువల్గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు - 2000 మందికి ఉపాధి
Andhra Pradesh News | తిరుపతిలో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ను సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి నుంచి వర్చువల్ గా ప్రారంభించారు.

Green Hydrogen Plant in Tirupati | అమరావతి: తిరుపతిలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ను ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. రాక్మ్యాన్ ఇండస్ట్రీస్లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్... పారిశ్రామిక అవరసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని చంద్రబాబు అన్నారు. ఈ టెక్నాలజీ కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని, భారతదేశ శక్తి పరివర్తనకు కొత్త బెంచ్మార్క్ను నిర్దేశిస్తుందనన్నారు తిరుపతిలో ప్రవేశపెట్టిన స్కేలబుల్ మోడల్ను ఏపీ వ్యాప్తంగా, ఇంకా దేశవ్యాప్తంగా ఇతర పరిశ్రమల్లోనూ అనుకరించవచ్చని చెప్పారు.
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ప్రపంచానికి కేంద్రంగా..
స్వర్ణాంధ్ర విజన్-2047 (Vision 2027) సాధనలో పేర్కొన్నట్టుగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగు. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ICE) పాలసీ 2024 కింద 160 గెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, క్లీన్ ఎనర్జీలో రూ.10 ట్రిలియన్ పెట్టుబడిని సాధిస్తాం. శిలాజ ఇంధనాలపై ఏపీ ఆధారపడటం తగ్గించడానికి, 2070 నాటికి భారతదేశం యొక్క నెట్-జీరో లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి, ఇంధన భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ‘గ్రీన్ ఎనర్జీ ప్లాంట్తో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ జైత్రయాత్ర మొదలు కావాలని భావిస్తున్నాను. ఏపీలో వాణిజ్యానికి ఉన్న అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ (Hero Future Energies)కు సహకారం అందిస్తాయి’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
వనరులు వినియోగించుకోండి :
ఆంధ్రప్రదేశ్ లో విస్తారమైన తీరప్రాంతం, లోతైన సముద్ర ఓడరేవులు, బలమైన లాజిస్టిక్స్ నెట్వర్క్ ఉన్నాయి. దాంతో దేశీయ, ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చడానికి, గ్రీన్ హైడ్రోజన్ (Geen Hydrogen) ఎగుమతులకు కేంద్రంగా మారడానికి ఆంధ్రప్రదేశ్ అనువైందని చంద్రబాబు అన్నారు. రూ. 1000 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ నెలకొల్పడంతో 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, దీనిని ఏడాదికి 54 టన్నులకు పెంచుకునే అవకాశం ఉంది. ఏడాదికి 206 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ (Co2) ఉద్గారాల తగ్గింపుతో పాటు, వాతావరణంలోకి ఏడాదికి 190 నుంచి 195 టన్నుల ఆక్సిజన్ విడుదల అవుతుంది. దాంతో 8 నుంచి 10 శాతం ఉద్గారాలు తగ్గుతాయని చెప్పారు.
రాక్మాన్ ఇండస్ట్రీస్ :
1960లో స్థాపించిన హీరో గ్రూప్లో భాగమైన రాక్మ్యాన్ ఇండస్ట్రీస్ అల్యూమినియం డై-కాస్టింగ్ భాగాలు, అధునాతన కార్బన్ సంబంధిత ఆటో భాగాల తయారీదారు. సూరత్, వడోదర, లుధియానా, హరిద్వార్, చెన్నై, బవాల్, తిరుపతి ప్లాంట్లతో రూ.2,390 కోట్ల వార్షిక ఆదాయం కలిగి ఉంది. ఏరోస్పేస్, హై-ఎండ్ ఆటోమోటివ్ రంగాల్లోకి ప్రవేశించింది. ఈ ప్రారంభోత్సవంలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఎండీ, చైర్మన్ రాహుల్ ముంజల్, రాక్మాన్ ఇండస్ట్రీస్ ఎండీ ఉజ్వల్ ముంజల్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్ సీఈవో శ్రీవాత్సన్ అయ్యర్, రాక్మాన్ ఇండస్ట్రీస్ సీఈవో కౌసిక్ మన్నా, ఓహ్మియం సీఈవో ఆర్నే బాలంటైన్ పాల్గొన్నారు.
Also Read: AP Mega DSC: మెగా డిఎస్సీపై ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ :
2012లో స్థాపించిన హీరో గ్రూపు పునరుత్పాదక ఇంధన విభాగం హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ పవన, సౌర (Solar), హైబ్రిడ్ ఇంధన వనరుల ఉత్పత్తిపై దృష్టి పెట్టి పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నిస్తోంది. భారత్, UK, ఉక్రెయిన్, వియత్నాం, బంగ్లాదేశ్లో 1.9 GW సామర్థ్యంతో ప్రాజెక్టులను నిర్వహిస్తూ రూ.1,460 కోట్ల వార్షిక ఆదాయంతో ఈ రంగంలో ఎదుగుతోంది. ప్రపంచ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా, 2030 నాటికి సామర్థ్యాన్ని 30 GWకి పెంచడానికి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉంది.






















