Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!
Pawan Kalyan Health News: వారాహి విజయ యాత్ర నిర్వహిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. నొప్పి భరించలేక జనవాణి మధ్యలోనే వెళ్లిపోయారు.

Pawan Kalyan Suffers With Back Pain:
వారాహి విజయ యాత్ర నిర్వహిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్న పవన్ మరోసారి తన సమస్య తిరగబెట్టడంతో మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వెన్నునొప్పి సమస్యతో బాధ పడుతున్నారు. తాజాగా జనవాణిలో పాల్గొన్న పవన్ ప్రజల నుంచి సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న పవన్ కళ్యాణ్ ను వెన్ను నొప్పి మొదలైంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నా వెన్ను నొప్పి తగ్గకపోవడంతో జనవాణి కార్యక్రమం మధ్యలోనే పవన్ కళ్యాణ్ వెళ్లిపోవాల్సి వచ్చింది. పవన్ ఆరోగ్యంపై జనసైనికులతో పాటు ఆయన అభిమానులు ఆందోళకు గురవుతున్నారు.
గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ గాయపడ్డారు. తన వెన్ను పూసకు గాయం కాగా, ఆ నొప్పి తరచూ తనను వేధిస్తోందని 2019లోనే జనసేనాని పవన్ ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తుండగా వెన్ను నొప్పి తీవ్రమైందని పవన్ తెలిపారు. ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, ఎన్నికల ర్యాలీలలో పాల్గొనడం సభలు నిర్వహించడంతో వెన్ను నొప్పి అధికమైందని స్వయంగా పవన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. చికిత్స తీసుకున్నప్పుడు కాస్త ఉపశమనం ఉంటుండగా, పవన్ వరుస కార్యక్రమాలు, సభలలో పాల్గొంటే నొప్పి తిరగబెడుతోందని జన సైనికులు చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో ఏం జరగబోతోంది ?
పెడనలో జరగనున్న వారాహి యాత్రలో అలజడి సృష్టించేందుకు వైఎస్ఆర్సీపీ గూండాలు, రౌడీలతో ప్రయత్నిస్తోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. రాళ్ల దాడులు చేసి రక్తపాతం సృష్టించాలని అనుకుంటున్నారని మచిలీపట్నంలో ఆరోపించారు. ఈ అంశంపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని.. వైసీపీ వాళ్లు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని పార్టీ శ్రేణులను కోరారు. వారాహి యాత్రపైకి రాళ్లతో ఎవరైనా దాడులకు వస్తే వారిపై దాడి చేయవద్దని పట్టుకుని పోలీసులకు అప్పగించాలన్నారు.
దాడులకు యత్నమని పవన్ ఆరోపణలు
పెడనలో రెండు, మూడు వేల మంది రౌడీముకలు రాళ్ల దాడుల కోసం వచ్చే అవకాశం ఉందన్నారు. పెడనలో జరిగే పరిణామాలకు ప్రభుత్వం, డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పులివెందుల రౌడీయిజం చేయాలని చూస్తే ఊరుకోమని ఈ అంశంపైతమకు స్పష్టమైన సమాచారం ఉందన్నారు. జగన్ రెడ్డి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే భవిష్యత్లో దారుణమైన పరిస్థితులు ఉంటాయని గుర్తుంచుకోవాలని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. అవనిగడ్డలో బహిరంగసభ తర్వాత రెండు రోజుల పాటు మచిలీపట్నం కేంద్రం జనవాణి కార్యక్రమంతో పాటు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. బుధవారం పెడన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా జోగి రమేష్ ఉన్నారు. జోగి రమేష్ గతంలో తన అనుచరులందర్నీ తీసుకుని నేరుగా చంద్రబాబు ఇంటిపైకే దాడికి వెళ్లారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాతే ఆయనకు మంత్రి పదవి లభించిందని ఆరోపించారు. ఏది ఏమైనా కోనసీమలో పవన్ వారాహి యాత్రలోనూ కనీసం 50 మందిని చంపేందుకు రాయలసీమ నుంచి గూండాలను రప్పించారని ఏపీ ప్రభుత్వంపై పవన్ ఆరోపణలు చేయడం తెలిసిందే.




















