Chandrababu on Union Budget: అమరావతి, తిరుపతి మీదుగా హై స్పీడ్ రైలు కారిడార్లు.. బడ్జెట్ స్వాగతించిన చంద్రబాబు
Union Budget 2026 | కేంద్ర బడ్జెట్ పై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి, తిరుపతి మీదుగా హై స్పీడ్ రైలు కారిడార్లను స్వాగతించారు

CM Chandrababu Welcomes Union Budget 2026 | కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను 'ఫార్వర్డ్ లుకింగ్' బడ్జెట్గా అభివర్ణిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా (Viksit Bharat) మార్చే దిశగా ఈ బడ్జెట్ అడుగులు వేస్తోందని ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎంఎస్ఎంఈల బలోపేతం, మహిళలు మరియు యువత సాధికారతకు ఈ బడ్జెట్ గొప్ప ఊతాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర మౌలిక సదుపాయాల పరంగా ఈ బడ్జెట్ అత్యంత కీలకమని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై వంటి హైస్పీడ్ రైల్ కారిడార్లు అమరావతి, తిరుపతి, పలమనేరు వంటి ప్రాంతాలను అనుసంధానిస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాయని తెలిపారు. అలాగే సెమీకండక్టర్ రంగానికి రూ. 40 వేల కోట్లు కేటాయించడం, అరకు వంటి ప్రాంతాల్లో పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం, మరియు కొబ్బరి, జీడి మామిడి వంటి పంటలకు మద్దతునిచ్చే చర్యలను ఆయన స్వాగతించారు.
ఐటీ హబ్గా విశాఖపట్నం..
విశాఖపట్నం ఐటీ హబ్గా ఎదిగేందుకు ఈ బడ్జెట్ బాటలు వేస్తోందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. డేటా సెంటర్లకు 2047 వరకు పన్ను మినహాయింపులు ఇవ్వడం వల్ల గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖకు వస్తాయని, తద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఏపీ దూసుకుపోతుందని అన్నారు. లాజిస్టిక్స్ మరియు పునరుత్పాదక ఇంధన రంగాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించడం వల్ల రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది ఆమెకు వరుసగా 9వ బడ్జెట్. "వికసిత్ భారత్" లక్ష్యంగా రూపొందించిన ఈ బడ్జెట్లో మౌలిక సదుపాయాలు, రైల్వేలు, వైద్య రంగాలతో పాటు యువతకు పెద్దపీట వేశారు. ట్యాక్స్ పేయర్లకు ఎలాంటి ఊరట లభించలేదు. స్లాబ్ లు అలాగే కొనసాగుతాయని స్పష్టం చేశారు.
రైల్వేలు & మౌలిక సదుపాయాలు
7 హైస్పీడ్ రైలు కారిడార్లు: హైదరాబాద్ కేంద్రంగా మూడు ప్రధాన కారిడార్లను ప్రకటించారు. అవి: పుణే-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై. మౌలిక సదుపాయాల కోసం కేటాయింపులను రూ. 12.2 లక్షల కోట్లకు (గత ఏడాది కంటే 9% ఎక్కువ) పెంచారు. రూ. 1000 కోట్లకు పైగా బాండ్లు జారీ చేసే నగరాలకు రూ. 100 కోట్ల ఇన్సెంటివ్ ప్రకటించారు.
ఔషధ రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ. 10,000 కోట్లతో ఈ కొత్త పథకాన్ని ప్రారంభించారు. ప్రతి జిల్లా ఆసుపత్రిలో అత్యాధునిక 24x7 ఎమర్జెన్సీ కేర్/ట్రామా సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రాణాంతక వ్యాధులకు వాడే కొన్ని మందులపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించి, ధరలను అందుబాటులోకి తెచ్చారు.
సెమీకండక్టర్ మిషన్ 2.0: దీని కోసం రూ. 40,000 కోట్లు కేటాయించారు. ఇది ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బాలికల కోసం ప్రత్యేక వసతి గృహాల నిర్మాణం చేపట్టనున్నారు. చిన్న తరహా పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు పెట్టుబడి పరిమితులను సవరించారు. ఆన్లైన్ విద్య, డిజిటల్ లెర్నింగ్కు బడ్జెట్ ఊతమిచ్చింది. ఆంధ్రప్రదేశ్, కేరళ సహా 5 రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల వెలికితీతకు ప్రత్యేక నిధులు కేటాయించారు. భారతీయ కంపెనీలలో ఎన్నారైల పెట్టుబడి పరిమితిని 10% నుండి 24% కి పెంచారు.




















