ఈ ప్రమాదం అమరావతి మండలం కోనూరు గ్రామ సమీపంలో కృష్ణా నదిలో జరిగింది. ఒక శుభకార్యం నుండి తిరిగి వస్తుండగా పడవ నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది.
Palnadu Crime News: కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి.. ఆరుగుర్ని రక్షించిన గ్రామస్తులు
Boat Capsize in Krishna River | పల్నాడు జిల్లాలో కృష్ణా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతిచెందగా, ఆరుగుర్ని ప్రాణాలతో కాపాడిన ఘటన ఆదివారం జరిగింది.

- పల్నాడులో పడవ బోల్తా; ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యం.
- గల్లంతైన కొనత చైతన్య కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
- పాపికొండల పడవ ప్రయాణాలు భద్రతా కారణాలతో తాత్కాలికంగా నిలిపివేత.
- సాంకేతిక లోపంతో పడవ ఆగిపోగా, పర్యాటకులు సురక్షితంగా రక్షించబడ్డారు.
Palnadu Crime News | పల్నాడు జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమరావతి మండలం కోనూరు గ్రామ సమీపంలో కృష్ణా నదిలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు నదిలో గల్లంతవగా.. స్థానికులు, పోలీసులు జరిపిన గాలింపు చర్యల్లో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన వారంతా చిన్నపిల్లలు కావడంతో ఆ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. మృతులను గంధం సంధ్య (9), గంధం సైనీ (10), బత్తుల కార్తీక్ (12)గా అధికారులు గుర్తించారు. కాగా, ప్రమాదంలో కొట్టుకుపోయిన కొనత చైతన్య (28) అనే యువకుడి కోసం నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పది మంది బంధువులు కోనూరులో జరిగే ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు పడవపై కృష్ణా నది దాటి వెళ్లారు. వేడుక ముగిసిన తరువాత అదే పడవపై తిరుగు ప్రయాణమయ్యారు. నది మధ్యలోకి రాగానే ఒక్కసారిగా పడవ నియంత్రణ కోల్పోయి నీటిలో బోల్తా పడింది. అందులో ఉన్న వారంతా నీట మునిగిపోయారు. ఇది గమనించిన స్థానిక మత్స్యకారులు, గ్రామస్థులు వెంటనే నదిలోకి దూకి ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు పిల్లల మృతదేహాలు వెలికితీశారు. ప్రమాద తీవ్రతను బట్టి గజ ఈతగాళ్లను రంగంలోకి దించి, గల్లంతైన చైతన్య కోసం కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు కళ్లముందే నదిలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో వారి బాధ వర్ణణాతీతం.
పాపికొండలు యాత్రకు విరామం..
అమరావతి: పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రకు బ్రేక్ పడింది. గోదావరి నదిలో పర్యాటక బోట్ల నిర్వహణ, ప్రయాణికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యగా బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పర్యాటక శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నిషేధ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇటీవల నదిలో చోటుచేసుకున్న ఒక ప్రమాదకర సంఘటన ఆధారంగా ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 12వ తేదీన 89 మంది పర్యాటకులతో పాపికొండల వైపు వెళ్తున్న పర్యాటక పడవలో అకస్మాత్తుగా తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ పడవ దేవిపట్నం సమీపంలో గోదావరి నది ఉధృతి మధ్యలోనే నిలిచిపోయింది. నడి నదిలో పడవ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమై, ప్రత్యేక రెస్క్యూ బోట్ల సహాయంతో పడవలోని పర్యాటకులను ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
Also Read : Sejal Pawar: ప్రైవేట్ పార్ట్స్, శవాలపై జోకులా... ఎంబీబీఎస్ స్టూడెంట్ సెజల్ పవార్కు మెడికల్ కాలేజ్ షాక్
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్.. నదిలో తిరుగుతున్న పర్యాటక బోట్ల ఫిట్నెస్, లైసెన్స్లపై సమగ్ర విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పడవను స్వాధీనం చేసుకున్న అధికారులు, దాని సాంకేతిక లోపాలు, భద్రతా ప్రమాణాలపై తనిఖీలను ముమ్మరం చేశారు.
పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే ప్రైవేట్ బోటు నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ పరిధిలోని బోట్లకు మాత్రమే ఈ నిలిపివేత వర్తిస్తుంది. తెలంగాణలోని భద్రాచలం మీదుగా కునవరం నుండి పాపికొండల శ్రేణిలోకి ప్రవేశించే పడవ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు.
Frequently Asked Questions
పల్నాడు జిల్లాలో పడవ ప్రమాదం ఎక్కడ జరిగింది?
పల్నాడు పడవ ప్రమాదంలో ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది మృతదేహాలు లభ్యమయ్యాయి?
ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గల్లంతవగా, స్థానికులు, పోలీసులు జరిపిన గాలింపు చర్యల్లో ముగ్గురు చిన్నపిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. కొనత చైతన్య అనే యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పాపికొండల పర్యాటక బోట్ల నిర్వహణను ఎందుకు నిలిపివేశారు?
గోదావరి నదిలో పర్యాటకుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నందున, ముందస్తు జాగ్రత్త చర్యగా బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల ఒక పడవలో సాంకేతిక లోపం తలెత్తింది.
పాపికొండల బోట్ల నిలిపివేత ఏ ప్రాంతాలకు వర్తిస్తుంది?
ఈ నిషేధ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ పరిధిలోని బోట్లకు మాత్రమే వర్తిస్తాయి. తెలంగాణలోని భద్రాచలం మీదుగా కునవరం నుండి ప్రవేశించే పడవ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు.
ట్రెండింగ్ వార్తలు























