Polavaram Project: ఏపీకి గుడ్న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
పోలవరం ప్రాజెక్టు పనుల కోసం కేంద్రం నుండి సానుకూల స్పందన లభించింది. డ్యామ్ పనులతో పాటు, అత్యంత కీలకమైన పునరావాసం, పరిహారం ప్రక్రియ కోసం రాష్ట్ర జలవనరుల శాఖ పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది.

Andhra Pradesh News | అమరావతి: ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రాజెక్టు పనుల కోసం తాజాగా మరో ₹1,301 కోట్ల అడ్వాన్స్ నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే కేంద్రం ₹1,508 కోట్లు విడుదల చేయగా, తాజా నిధులతో కలిపి మొత్తం నిధుల వాటా ₹2,809 కోట్లకు చేరింది. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్లో సవరించిన అంచనాల మేరకు కూటమి ప్రభుత్వం దాదాపుగా నిధులను పొందినట్లయింది.
గతంలో కేంద్రం అందించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించింది. గతంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులు 1,508 కోట్లలో, రూ.600 కోట్లను ప్రాజెక్టు నిర్మాణ పనులకు, మరో రూ. 300 కోట్లను భూసేకరణ, పునరావాస పనుల కోసం వెచ్చించింది. కేంద్ర నిబంధనల ప్రకారం, ఇచ్చిన అడ్వాన్స్ నిధులలో 75% ఖర్చు చేస్తేనే తదుపరి విడత నిధులు విడుదలవుతాయి. అయితే, గతంలో ఖర్చు చేసిన రూ. 300 కోట్లను కేంద్రం కొన్ని సాంకేతిక కారణాల వల్ల రీయింబర్స్ చేయలేదు.
ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు పోలవరం ప్రాజెక్టును సందర్శించినప్పుడు, రాష్ట్ర అధికారులు ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసినప్పటికీ నిధుల విడుదల పెండింగ్లో ఉన్న విషయాన్ని వివరించి, క్షేత్రస్థాయిలో జరిగిన పనులను ప్రత్యక్షంగా చూపించారు. అధికారుల వివరణతో సంతృప్తి చెందిన కేంద్రం, ప్రాజెక్టు ప్రాముఖ్యతను గుర్తించి ఇప్పుడు అదనపు అడ్వాన్స్ను మంజూరు చేసింది.
పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనులతో పాటు, అత్యంత కీలకమైన పునరావాసం, పరిహారం (R&R) ప్రక్రియ కోసం కేంద్రం నిధుల చేయడం పునరావాస ప్యాకేజీల పంపిణీలో భాగంగా నిర్వాసితులకు, రైతులకు ఎంతో కీలకం కానున్నాయి. కేంద్రం విడుదల చేసిన ఈ నిధులలో నిర్వాసిత రైతులు, గిరిజన కుటుంబాల పరిహారం కోసం ఖర్చు చేయనున్నారు. నిధులు ప్రాజెక్ట్ అకౌంట్లో జమ అయిన వెంటనే, అర్హులైన లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ ద్వారా చెల్లింపులు జరగనున్నాయి. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే స్పిల్వే వంటి కీలక పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధుల విడుదల పనులకు మరింత ఊతం ఇవ్వనుంది. నిధుల విడుదలతో ముంపు గ్రామాల ప్రజలు, రైతు కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.























