Sharmila Hot Comments: చిచ్చుబుడ్డి తుస్సుమంది, ప్రధాని మోదీ అమరావతి పర్యటనపై షర్మిల సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని.. ఆనాడు 2015లో ప్రధాని మోదీ వచ్చి మట్టి కొట్టారు. నేడు సున్నం కొట్టి వెళ్లారని షర్మిల సెటైర్లు వేశారు.

YS Sharmila Comments on PM Modi Visit To Amaravati | అమరావతి: ప్రధాని మోదీ ఏపీలో పర్యటనలో భాగంగా అమరావతి పనుల పున:ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. వేలకోట్ల ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. అమరావతి అద్భుతమైన రాజధాని అవుతుందని, వికసిత్ భారత్ లో ఏపీ కీలక భాగస్వామిగా మారుతుందని పేర్కొన్నారు. అయితే ప్రధాని మోదీ ఏపీ పర్యటనపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. మోదీ తీరు చూస్తే చిచ్చుబుడ్డి తుస్సుమంది అనక తప్పదంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
షర్మిల చేసిన పోస్టులో ఏముందంటే..
ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం ఏపీ నూతన రాజధాని నిర్మాణ బాధ్యత మొత్తం కేంద్రానిదే. నూతన రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలు కేంద్రం కల్పించి ఇవ్వాల్సిందే. ఏపీ విభజన చట్టంలో కేంద్రం విధులేంటో స్పష్టంగా పేర్కొన్నారు. మరి ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ఇస్తున్నది ఏంటి ? ఆనాడు 2015లో అమరావతికి వచ్చి మట్టి కొట్టారు. నేడు మళ్లీ వచ్చి సున్నం కొట్టి వెళ్ళారని షర్మిల ఎద్దేవా చేశారు.
చంద్రబాబు మళ్లీ అదే గోతిలో పడ్డారు..
10 ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని ద్రోహం చేశారో.. నేడు అవే అబద్ధాలను మరోసారి చెప్పి ఘరానా మోసం చేశారు. మళ్ళీ "అభివృద్ధి చేస్తాం, భుజాలు కలుపుతాం" అంటూ బూటకపు మాటలు చెప్పారు. 5 కోట్ల మంది కలల సౌధం అమరావతికి 2015 నుంచి అన్ని చేశామంటూ అబద్ధాలు చెప్పారు. చెప్పినట్లు అన్ని ఇచ్చినట్లు అయితే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదు ? అమరావతి నిర్మాణానికి ఖర్చయ్యే లక్ష కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి అయినా ప్రకటించారా ?. రాజధాని అమరావతి నిర్మాణం కేంద్రం బాధ్యత అని హామీ ఇవ్వకపోవడాన్ని షర్మిల తప్పు పట్టారు. కనీసం రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామని కూడా చెప్పలేదు. పోనీ విభజన హామీలపై టైమ్ బాండ్ క్లారిటీ ఇచ్చారా ? సీఎం చంద్రబాబు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మోదీని నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోతున్నట్లు ఇకనైనా తెలుసుకోవాలి. ఏదో ఉద్ధరిస్తారని నమ్మి ఒకసారి రాత్రి గోతిలో పడ్డ చంద్రబాబు.. మళ్ళీ మోదీని పిలిచి అదే గోతిలో పగలు పడ్డారని సెటైర్లు వేశారు.
చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్నలివే..
కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాజధాని అమరావతికి కావాల్సింది అప్పులు కాదు, మాకు కావాల్సింది నిధులు. ఏపీ రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, అప్పు లేకపోతే జీతాలకు దిక్కులేదని చెప్పే మీరు అమరావతి నిర్మాణానికి ఎవరి నుంచి రూ.60 వేల కోట్లు అప్పు తెస్తున్నారు ? వడ్డీల భారం మోసేదెలా? చెప్పాలని ప్రశ్నించారు. వరల్డ్ బ్యాంక్, ADB, KFW, హడ్కోల దగ్గర ఆంధ్రప్రదేశ్ ను ఎందుకు తాకట్టు పెడుతున్నారు ? ప్రభుత్వ భూములు అంటే ప్రజల ఆస్తి, అలాంటి వాటిని అమ్మి రాజధాని ఎలా కడతారు ? కేంద్రం మెడలు వంచే దమ్ములేక భావితరాల మీద అప్పు భారం ఎందుకు మోపుతున్నారో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని’ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.




















