భర్తను బతికుండగానే భార్య పాతేసిన దారుణ ఘటన చెన్నైలో జరిగింది. పెరుంబాకం అనే ప్రాంతంలో ఉంటోన్న ఓ 55 ఏళ్ల మహిళ తన భర్త అమరత్వం పొందాలని మూఢనమ్మకంతో ఈ పని చేసింది.


అసలేం జరిగింది?


నాగరాజ్ (59) తన కుటుంబంతో పెరుంబాకంలో నివాసం ఉంటున్నారు. ఆయన కూతురు ఐటీ ఉద్యోగం చేస్తోంది. అయితే గురువారం ఆమె ఇంటికి వచ్చేసరికి తండ్రి కనబడలేదు. తల్లిని అడిగితే సమాధానం చెప్పలేదు. మాట్లాడకపోయేసరికి గట్టిగా నిలదీసింది. దీంతో భర్త కోరిక మేరకు అమరత్వం పొందుతాడని నమ్మి బతికుండగానే పూడ్చేసినట్లు తల్లి లక్ష్మి చెప్పింది. దీంతో కూతురు షాకైంది. 


ఎందుకలా?


నాగరాజ్ ఇటీవల తమిళనాడులోని పలు ఆలయాలను సందర్శించారు. ఆ తర్వాత చాలా మందికి తాను దేవుడితో మాట్లాడుతున్నానని నాగరాజ్ చెప్పినట్లు సమాచారం. ఆయన ఇంటి వెనకు ఉన్న స్థలంలో ఓ ఆలయాన్ని కూడా నాగరాజ్ నిర్మించారు. అక్కడికి వచ్చేవారికి జ్యోతిష్యం చెప్పేవారట. 


శవాన్ని ఏం  చేశారు?


నవంబర్ 16న నాగరాజ్‌కు ఛాతీ నొప్పి రావడంతో తాను చనిపోయేముందే తనను పూడ్చేయాలని ఆయన తన భార్యకు చెప్పారు. అలా చేస్తే తాను అమరత్వాన్ని పొందుతానని అన్నారట. దీంతో నవంబర్ 17న అతని భార్య ఇద్దరు కూలీలను పిలిపించి వాటర్ ట్యాంకు కోసం అని ఓ గొయ్యి తవ్వించారు. ఆ తర్వాత తన భర్త స్పృహలో లేనప్పుడు ఆ గోతిలోనే పూడ్చేసింది.


ఆర్డీఓ సమక్షంలో పోలీసులు గొయ్యి తవ్వి శవాన్ని పంచనామాకు పంపించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు తర్వాత అసలు నిజాలు బయటకు వస్తాయని పోలీసులు అంటున్నారు.


Also Read: Farmers Protest: నవంబర్ 29న రైతుల 'చలో పార్లమెంట్'.. మోదీ సర్కార్‌కు తప్పని నిరసన సెగ


Also Read: Abhinandan Awarded Vir Chakra: పాక్‌ను వణికించిన కమాండర్ అభినందన్‌కు 'వీర చక్ర'