ఫేస్ బుక్‌లో జరిగిన పరిచయం దేశాల్ని దాటించింది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించి ఏళ్లుగా సహజీవనం చేస్తున్న వారి ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డ కూడా పుట్టింది. కానీ, ఇంతలో అనుకోని కుదుపు. అతను మరణించడంతో ఆమె చిక్కుల్లో పడింది. అంతకుముందు భారత్‌కు వచ్చేందుకు చేసిన అక్రమ పనులన్నీ బయటికొచ్చాయి. చివరికి పోలీసుల అదుపులో ఉండాల్సి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 


గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ దళారీ హితేష్‌ జోషితో బంగ్లాదేశ్‌కు చెందిన సిరినా అక్తర్‌ హుస్సేన్‌కు 2016లో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయింది. ఫోన్‌ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆ తర్వాత వాట్సాప్‌ ద్వారా వారి మనసులు కలిశాయి. తొలుత హితేష్‌ను కలుసుకోవాలని భావించిన సిరిన 2017 మార్చిలో టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చి వెళ్లేది. ఆపై అతడితోనే కలిసి జీవించాలని నిర్ణయించుకుని తప్పుడు మార్గంలో సరిహద్దులు దాటేసి భారత్‌కు వచ్చేసింది. ఇందుకోసం బంగ్లాదేశ్‌లో ఉన్న దళారులు ఆమెకు సహకరించారు. 


అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన సభ్యుల ద్వారా గుత్తా సోను బిశ్వాస్‌ పేరుతో నకిలీ ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డులు సంపాదించి.. అహ్మదాబాద్‌ వెళ్లి హితేష్‌ను కలిసింది. 2017 అక్టోబర్‌ నుంచి అక్కడి సనాతన్‌ ప్రాంతంలో వీళ్లిద్దరూ సహజీవనం చేస్తుండేవారు. ఇలా వీరికి 2018లో ఓ కుమార్తె కూడా పుట్టింది. 2020లో సిరిన.. సోను పేరుతో పాస్‌పోర్టు కూడా పొందింది. దీంతో భారతీయురాలిగా బంగ్లాదేశ్‌ వెళ్లి తన ఫ్యామిలీని కూడా కలిసేది. అప్పటి నుంచి ఆమె వ్యవహారం గుట్టుగానే ఉంటూ వచ్చింది. 


Also Read: Gold-Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. స్థిరంగా వెండి.. నేటి తాజా ధరలు ఇవీ..


భారీ కుదుపు
గత నెల ఆఖరి వారంలో హితేష్‌ అనారోగ్య కారణాలతో కన్నుమూశాడు. ఆపై సిరిన అలియాస్‌ సోను అతడి తల్లిదండ్రుల (అత్తామామల) ఇంటికి చేరింది. ఆస్తుల పంపకం విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తి వివాదాలకు కారణమైంది. దీంతో ఆవేశానికి గురైన హితేష్‌ తల్లిదండ్రులు సిరినను ఉద్దేశించి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీ అంటూ తిట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గత వారం ఆమెను అరెస్టు చేశారు.


విచారణలో భాగంగా ఆధార్, పాన్‌ కార్డులు తయారు చేసిన ఇచ్చిన నిందితుల కోసం అహ్మదాబాద్‌ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనికోసం ఓ ప్రత్యేక బృందాన్ని ఆదివారం హైదరాబాద్‌‌కు కూడా పంపారు. సిరిన కేవలం హితేష్‌పై ఉన్న ప్రేమతోనే ఇలా అక్రమంగా వచ్చిందని, ఈ కేసులో మరే ఇతర కోణం లేదని అహ్మదాబాద్‌ పోలీసులు తేల్చారు. చట్ట ప్రకారం ఆమె చేసింది నేరం కావడంతో అరెస్టు చేశామని చెబుతున్నారు.


Also Read: TSRTC: ఆర్టీసీపై పాట.. భీమ్లా నాయక్ స్టైల్‌లో.. కిన్నెర మొగులయ్య పాడితే.. రీ ట్వీట్ చేసిన సజ్జనార్


Also Read: దర్యాప్తు అలా కాదు.. ఇలా చేయండి..! వివేకా హత్య కేసులో సీబీఐ డైరక్టర్‌కు అరెస్టయిన నిందితుడి లేఖ !


Also Read : ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ? ఏపీ బీజేపీ నేతలకు చివరి చాన్స్ !?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి