News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

BJP: దేశంలో ఎవరికైనా కొత్త పార్టీలు పెట్టుకునే హక్కు ఉంది, కానీ బీఆర్ఎస్‌తో ఏ లాభం లేదు: కిషన్ రెడ్డి

2047 నాటికి అంటే వచ్చే 25 ఏళ్ల అమృత కాలంలో జరిగే వేగవంతమైన అభివృద్ధిలో భారత సమాజాన్ని భాగస్వామిని చేసేందుకు కార్యకర్తలు, నాయకులు కృషిచేయాలని ప్రధాని సూచించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

FOLLOW US: 
Share:

- దేశాభివృద్ధిలో సమాజాన్ని భాగస్వామిని చేస్తూ ముందుకెళ్లాలన్నదే ప్రధానమంత్రి సందేశం
- అప్పుడే సమగ్రమైన పురోగతి సాధ్యమని ప్రధాని చెప్పారన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- 2024 పార్లమెంటు ఎన్నికలు నడ్డా నేతృత్వంలోనే.. ఆలోపలే 9 రాష్ట్రాల ఎన్నికలు కూడా..
- బీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబం పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది
- వారిని త్వరలోనే ఫాం హౌజ్ కు పరిమితం చేయడం ఖాయం అన్న కిషన్ రెడ్డి
- ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రకారం భారతదేశానికి భవ్యమైన భవిష్యత్తు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం 2047 నాటికి అంటే వచ్చే 25 ఏళ్ల అమృత కాలంలో జరిగే వేగవంతమైన అభివృద్ధిలో భారత సమాజాన్ని భాగస్వామిని చేసేందుకు కార్యకర్తలు, నాయకులు కృషిచేయాలని ప్రధాని సూచించారని ఆయన అన్నారు. రెండ్రోజులపాటు దేశ రాజధానిలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఈ రెండ్రోజుల్లో పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికలతోపాటు రానున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు జేపీ నడ్డా నేతృత్వంలోనే పార్టీ ముందుకెళ్తుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. సమావేశాల ముగింపులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయకమైన మార్గదర్శనం చేశారని ఆయన అన్నారు. ప్రస్తుతం పార్టీ ఆధర్వ్యంలో జరుగుతున్న కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకెళ్లాలని మోదీ సూచించారన్నారు. 
 
2047 వరకు నిర్దేశించుకున్న అమృత కాలాన్ని ప్రస్తావిస్తూ.. మన పూర్వీకుల ఆకాంక్షలను పూర్తిచేసేందుకు సరైన సమయం ఆసన్నమైందని, ఇందుకోసం సమాజంలోని అన్ని వర్గాలకు కలుపుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని మోదీ సూచించారన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రధాని ఎవరన్నది ముఖ్యం కాదని, దేశాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి కార్యకర్త కృషిచేయాలని ప్రధాని మార్గదర్శనం చేశారన్నారు. 

దేశంలో ఎవరికైనా కొత్త పార్టీలు పెట్టుకునే హక్కుందని, కానీ ప్రజల ఆకాంక్షలను వదిలిపెట్టి రాజకీయాలు చేస్తే ఆ ప్రజలే సరైన బుద్ధి చెబుతారన్నారు. టీఆర్ఎస్ పార్టీ పట్ల, కల్వకుంట్ల కుటుంబం పట్ల తెలంగాణ ప్రజల్లో విశ్వాసం లేదని, రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేసిన కుటుంబం.. దేశాన్ని దోపిడీ చేద్దామని అనుకుంటోందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోనే టీఆర్ఎస్ పార్టీకి భూమి కదిలిపోతోందని, అలాంటిది దేశ రాజకీయాల్లోకి వచ్చి కల్వకుంట్ల కుటుంబం సాధించేది ఏమీ ఉండదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల, కల్వకుంట్ల కుటుంబం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందని అందుకే త్వరలోనే ఈ కుటుంబాన్ని ఫాం హౌజ్ కు పరిమితం చేయడం ఖాయమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

దేశంలో రాజకీయ పరిస్థితులపై "రాజకీయ తీర్మానం" ప్రవేశపెట్టిన ఈటల రాజేందర్ మాట్లాడారు. ప్రజలని నమ్ముకొని నాయకులు ఎన్నికలకి వెళ్తున్నారు, కానీ తెలంగాణ లో మాత్రం పైసలు తో ఎన్నికలు నడుస్తున్నాయని ఆరోపించారు. ఆత్మాభిమానానికి చిహ్నం అయిన ఓటుకు కెసిఆర్ వెలకడుతున్నారు. ఎమ్మెల్యే గా పోటీ చేయాలి అంటే భయపడే పరిస్థితి తీసుకువచ్చారు. టికెట్ ఇచ్చే ముందే ఎన్ని డబ్బులు ఉన్నాయి అని అడుగుతున్నారు. ఈ పరిస్థితిని మారాలన్నారు. కేంద్రం అయినా  రాష్ట్రం అయినా  (ప్రజా ధనం) ప్రజల పైసలు ఖర్చు చేస్తారు. ముఖ్యమంత్రులు "నేను" ఖర్చు పెట్టిన అంటున్నారు. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఎప్పుడూ అలా చెప్పలేదు అన్నారు. ప్రజాస్వామ్యంలో "నేనే" అని చెప్పుకొనే పరిస్థితి మారాలన్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత కూడా ప్రభుత్వాలు పధకాలు ప్రవేశపెడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

Published at : 17 Jan 2023 11:42 PM (IST) Tags: BJP PM Modi Kishan Reddy bjp national executive meeting Union Minister Kishan Reddy