Andhra Pradesh News: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం - కాకినాడ సెజ్ భూములు రైతులకే రిజిస్ట్రేషన్
Kakinada SEZ lands: కాకినాడ సెజ్ భూముల్ని తిరిగి రైతులకే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రూపాయి కూడా తీసుకోకుండా వారికే రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశాలు దారీ చేశారు.

AP government decides to return Kakinada SEZ lands to farmers: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) కోసం రైతులు ఇచ్చిన భూములను తిరిగి ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన 2,180 ఎకరాల భూములను తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసి అందించాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలు వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని 1,551 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్లకు కృతజ్ఞతలు తెలిపారు.
కాకినాడ SEZ 2000ల మధ్యలో ప్రారంభమైంది. అప్పటి ప్రభుత్వం రిలయన్స్, ఇతర కంపెనీలతో కలిసి SEZ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. దీని కోసం ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని రైతుల నుంచి 10,000 ఎకరాలకు పైగా భూములు సేకరించారు. కానీ ప్రాజెక్ట్ ముందుకు సాగకపోవడంతో, రైతులు తమ భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. 2021లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2,180 ఎకరాలు తిరిగి ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ, అమలు కాలేదు. రైతులు అనేకసార్లు ఆందోళనలు, ప్రదర్శనలు చేశారు. 2018లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తర్ఫున రైతులతో మాట్లాడి, భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాకినాడ సెజ్ అవార్డు భూములు తిరిగి రైతులకే రిజిస్ట్రేషన్
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) October 14, 2025
• రిజిస్ట్రేషన్ రుసుములు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు
• ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ఇచ్చిన హామీకి కార్యరూపం
• గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో ప్రత్యేకంగా చర్చించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
కాకినాడ ప్రత్యేక…
2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మేనిఫెస్టోలో కాకినాడ SEZ భూముల సమస్య పరిష్కారం ఒక ముఖ్య హామీ. పవన్ కల్యాణ్ ప్రచార సభల్లో "రైతులు ఇచ్చిన భూములు తిరిగి ఇవ్వాలి. SEZ అభివృద్ధి చేస్తాం, కానీ రైతులు బాధపడకూడదు" అని ప్రకటించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా, భూములను రిజిస్టర్ చేసి అందించాలని స్పష్టం చేశారు.
ఈ 2,180 ఎకరాలు ప్రధానంగా వ్యవసాయ భూములు. రైతులు తమ భూములు తిరిగి పొందడంతో వ్యవసాయం మళ్లీ ప్రారంభించవచ్చు. మొత్తం SEZ ప్రాజెక్ట్ 10,000 ఎకరాలు, కానీ ఈ భూములు తిరిగి ఇవ్వడంతో ప్రాజెక్ట్ పరిధి తగ్గుతుంది. ప్రభుత్వం మిగిలిన భూములతో SEZను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. రెవెన్యూ శాఖ అధికారులు త్వరలో రైతులతో సమావేశమై, భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. రైతులు తమ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు.





















