India vs Australia Womens ODI | తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఓటమి | ABP Desam
ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్ను కైవసం చేసుకుని ఊపుమీదున్న భారత మహిళల జట్టుకు వన్డే సిరీస్లో గట్టి షాక్ తగిలింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్ను చిత్తు చేసింది. మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత ఇన్నింగ్స్ రెండో బంతికే ప్రతికా రావల్ డకౌట్ కాగా, షెఫాలీ వర్మ ( Shafali Verma ), జెమీమా త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ దశలో స్మృతి మంధాన ( Smriti Mandhana ), హర్మన్ప్రీత్ కౌర్ ( Harmanpreet Kaur ) బాగా ఆడి స్కోరును 100 దాటించారు. అయితే వీరిద్దరూ అవుట్ అయ్యాక భారత బ్యాటింగ్ మళ్లీ తడబడింది. చివర్లో కాశ్వీ గౌతమ్, రిచా ఘోష్ మెరుపులు మెరిపించడంతో భారత్ 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయింది.
215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు భారత బౌలర్ శ్రీ చరణి ( Sri Charani ) ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హేలీ రాణించడంతో ఆస్ట్రేలియా మరో 70 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. టీ20ల్లో చూపిన దూకుడు వన్డే ఫార్మాట్లో భారత్ ప్రదర్శించలేకపోయింది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ వైఫల్యం జట్టును దెబ్బతీసింది.























