Top 10 Headlines Today:


పని మొదలు పెట్టిన చంద్రయాన్-౩


ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలక దశ ముగిసింది. భారత శాస్త్రవేత్తలు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. విక్రమ్ ల్యాండర్ ను చంద్రుడిపై విజయంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు. అయితే జాబిల్లిపై ప్రస్తుతం సెకనుకు సెంటీమీటర్ వేగంతో ల్యాండర్ విక్రమ్ కదులుతోంది. చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన వెంటనే ల్యాండర్ విక్రమ్ పని మొదలుపెట్టేసింది. అక్కడి నుంచి నాలుగు ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. బెంగళూరు కేంద్రానికి, చంద్రయాన్ 3 ల్యాండర్ కు కనెక్షన్ కుదిరింది. హారిజాంటర్ వెలాసిటీ కెమెరా తీసిన చిత్రాలు ఇవి అని ఇస్రో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


వీడియోలు వైరల్


అంతరిక్ష రంగంలో కొత్త చరిత్రను సృష్టిస్తూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బుధవారం (ఆగస్టు 3) చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విక్రమ్ ను సున్నితంగా దింపిన సంగతి తెలిసిందే. తాజాగా అందులో నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటికి వచ్చింది. ల్యాండర్ దిగిన 2 గంటల 26 నిమిషాల తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చిందని జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే, దీన్ని ఇస్రో అధికారికంగా వెల్లడించలేదు. కానీ, ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటికి వచ్చిన వీడియోలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు ఇస్రో కమాండ్ సెంటర్ నుంచే బయటికి వచ్చినట్లుగా అర్థం అవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


మైనంపల్లిపై చర్యలేవి?   


భారత రాష్ట్ర సమితిలో    ఇప్పుడు హాట్ టాపిక్ అంతా మైనంపల్లి హన్మంతరావుదే.  ఆయన ఉద్దేశపూర్వకంగానే  టార్గెట్ చేసినట్లుగా హరీష్ రావుపై కామెంట్లు చేస్తున్నారని.. దీని వెనుక బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాల కోణం ఉందన్న చర్చలు జరుగుతున్నాయి.  తిరుమలలో అలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా మైనంపల్లికి టిక్కెట్ ప్రకటించారు. ఇప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోలేదు.  ఏ క్షణమైనా సస్పెండ్ అనే లీకులు వస్తున్నాయి.  ప్రత్యామ్నాయ అభ్యర్థిపై కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. కానీ ఆయన సైలెంట్ గా ఉంటే అంతా సర్దుకుపోతుందని బీఆర్ఎస్‌లోని ఓ వర్గం గట్టి నమ్మకంతో ఉంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం కూడా మైనంపల్లికి వ్యతిరేకంగా పోస్టులు ఆపేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


దొంగ ఓట్లకు బాధ్యులెవరు?


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఓటర్ల జాబితా అంశం హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్‌సీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. వైఎస్ఆర్‌సీపీ నేతలు పెద్ద ఎత్తున దొంగ ఓట్లను గుర్తించామని తీసేయాలని ఫామ్ 7లు  అప్లయ్ చేస్తున్నారు. అయితే  వైసీపీ కుట్ర పూరితంగా నిజమైన ఓటర్లను.. తమ పార్టీకి ఓటు వేయని వారిని వాలంటర్ల ద్వారా గుర్తించి.. తీసేస్తుందని ఇది ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయడమేనని మండిపడుతోంది. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఈ అంశంపై చేసిన పోరాటానికి ఈసీ చాలా ఆలస్యంగానైనా  స్పందించింది. పలువురు ఉద్యోగులపై వేటు వేసింది. ఒక్క  ఉరవకొండ కాదని దేశం మొత్తం అదే పరిస్థితి ఉందని టీడీపీ ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


హరినాథ్ గౌడ్ కన్నుమూత


బత్తిని కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆస్తమా, ఉబ్బసం బాధితులకు చేప ప్రసాదం పంపిణీ చేసే బత్తిని సోదరుల్లో ఒకరైన హరినాథ్‌గౌడ్‌ కన్నుమూశారు. బత్తిని సోదరుల్లో హరినాథ్‌గౌడ్‌ ఒకరు. ఆయన వయస్సు 84ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ పాతబస్తీలోని ఇంట్లో అర్ధరాత్రి ఆయన తుది శ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరుగనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


అక్కడక్కడా వర్షాలు


ఈ రోజు ఉత్తర - దక్షిణ ద్రోణి దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా కొమరిన్ ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిమీ ఎత్తు వద్ద  ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం (ఆగస్టు 23) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు వాయువ్య /పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల  రేపు, ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అన్నారు. ఈరోజు భారీ వర్షాలు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


చెక్కర ఎగుమతిపై నిషేధం


కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోందని సమాచారం. ఏడేళ్లలో తొలిసారి పంచదార ఎగుమతులను నిషేధించేందుకు సిద్ధమవుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సరైన వర్షపాతం లేకపోవడంతో చెరకు ఉత్పత్తి తగ్గిపోయింది. ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు మోదీ సర్కార్‌కు మరో దారిలేదని రాయిటర్స్‌ రిపోర్టు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ది సోల్‌ ఆఫ్‌ సత్య


సుప్రీమ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌, కలర్స్‌ స్వాతి జంటగా 'ది సోల్‌ ఆఫ్‌ సత్య' అనే మ్యూజికల్‌ షార్ట్‌ ఫీచర్‌ ఇటీవలే యూట్యూబ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ గీతాన్ని, ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. అయితే తాజాగా ఈ సాంగ్ ను హీరోయిన్ రాశీ ఖన్నా ఆలపించింది. దీనికి సంబంధించిన వీడియోను టీ-సిరీస్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


వరుణ్‌ లావ్‌ ప్రేమకథ


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), సొట్ట బుగ్గల సుందరి & ఉత్తరాది అందాల భామ లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi) ప్రేమలో ఉన్నారు. అది పాత విషయమే. త్వరలో ఏడు అడుగులు వేయబోతున్నారు. ఆ విషయమూ ప్రేక్షకులకు తెలుసు. కుటుంబ సభ్యుల సమక్షంలో వాళ్లిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. పెద్దల అనుమతితో వచ్చే నెలలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నారు. నవంబర్ 1న పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. అసలు, ఇద్దరిలో ముందుగా లవ్ ప్రపోజ్ చేసింది ఎవరు? ప్రేమకథ ఎప్పుడు మొదలైంది? ఈ విషయాలు అన్నీ వరుణ్ తేజ్ చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


మ్యాచ్ రద్దు


ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది. మూడు మ్యాచుల సిరీసులో 2-0తో విజయ దుందుభి మోగించింది. వరుణుడు అంతరాయం కలిగించడంతో ఆఖరి మ్యాచ్‌ జరగలేదు. డబ్లిన్‌ నగరంలో ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో టాస్‌, బంతి పడకుండానే ఆట రద్దైంది. మ్యాచ్‌ పెట్టేందుకు ఆఖరి వరకు నిర్వాహకులు ప్రయత్నించారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. దాంతో అభిమానులు నిరాశగా స్టేడియం వీడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి